- కంప్యూటర్లో ఆటలు ఆడటం ఇపుడు సాధారణమై పోయింది. పట్టణాలు, నగరాల్లో పిల్లలు బయట ఆటల కంటే ఎక్కువ సేపు కంప్యూటర్లో ఆటలు ఆడేందుకే ఎక్కువ సమయాన్ని కేటాయిస్తున్నారు. ఇది అంత మంచిది కాదు. కంప్యూటర్లో ఎక్కువ సేపు ఆటలు ఆడటం వలన మున్ముందు పెద్ద పెద్ద సమస్యలు వచ్చే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అందుకే పిల్లలూ - జాగ్రత్త పడండి. కంప్యూటర్తో ఆటలు ఆడండి. కానీ కేవలం కొద్ది సమయం మాత్రమే. అదీ మనం కొత్త విషయాలు నేర్చుకొనేందుకు ఉపయోగపడే ఆటలు ఆడండి. చరిత్ర, శాస్త్ర సాంకేతిక విషయాలు, ఇంగ్లీష్ గ్రామర్, చిత్ర లేఖనం వంటివి నేర్చుకొనేందుకు ఉపయోగపడే ఆటలు ఆన్లైన్లో ఎన్నో ఉన్నాయి. మరి మీరు అటువంటి ఆటలు ఆడుతున్నారా? మీరు ఆడుతున్న ఆటల గురించి మాకు వ్రాసి పంపండి. మిగిలిన బాల నేస్తాలకు కూడా ఈ విషయాలను తెలియజేద్దాం.
-
క్రికెట్టూ, కంప్యూటర్ గేమ్స్ రాక ముందు మన ఊళ్లలో పిల్లలు ఎన్నో రకాల ఆటలు ఆడేవాళ్లు. ఆ ఆటలకు హద్దే ఉండేది కాదు. ఎగరటం, దూకటం, పరిగెత్తటం, కుందటం, పాకటం ఇలా ఎన్నో రకాలుగా శారీరక వ్యాయామాన్ని ఇచ్చే ఎన్నో ఆటలను అప్పట్లో ఆడేవాళ్లు. కాని ఇప్పుడు క్రమంగా ఈ ఆటలన్నీ కనుమరుగై పోతున్నాయి.
పిల్లలూ, మీ అమ్మా నాన్నలు తమ చిన్నతనంలో ఏయే ఆటలు ఆడేవాళ్లో అడిగి తెలుసుకోండి. ఆ ఆటల నియమాలు ఏమిటి? ఆడేందుకు ఏమేం కావాలి? వంటి విషయాలను కూడా తెలుసుకొని మాకు వ్రాసి పంపండి. 'బాల చెలిమి' లో ప్రచురిస్తాం. -
కవికాకి కోగిర జై సీతారామ్ రచించిన పుస్తకం ఇది. పిల్లల పాటల పేరుతో ఎన్నో పుస్తకాలు వచ్చి ఉండవచ్చు. కానీ జై సీతారామ్ పాటలు మాత్రం పిల్లలు, పిల్లల్ని ప్రేమించే వారి హృదయాలలో చిరకాలం ఉండి పోతాయి. ఈ పాటలలో అనంతపురం జిల్లా మాండలికం గుభాళిస్తుంది. ఇక్కడి భాషను ఇంత సృజనాత్మకంగా, ఇంత లయబద్ధంగా మరో రచయిత తీర్చిదిద్దలేదంటే అతిశయోక్తి కాదు.
అనంతపురం జిల్లా లోని కోగిర గ్రామంలో జై సీతారామ్ జన్మించారు. ఆయన ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటవ తరగతి ఉపాధ్యాయుడు గాను, ఏకోపాధ్యాయుడు గాను పని చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు పొందారు. రాష్ట్ర ప్రభుత్వానికి తెలుగు వాచకాలు, పాఠాలు రాశారు. అష్టావధానాలు, శతావధానాలలో పాల్గొన్నారు.
జై సీతారామ్ పాటలు పిల్లలు, పెద్దల నోట విస్తృతంగా ప్రచారం పొందినా ఈనాటికీ ఆయనకు తగినంత గుర్తింపు రాలేదు. చదువు చెప్పటమంటే పిల్లల్ని కొట్టడమనే అర్థం ఉన్న రోజుల్లోనే ఆట, పాటలతో కూడిన చదువును ఆయన ప్రవేశపెట్టారు. స్వయంగా పాటలు రాసి పిల్లలతో ఆడి పాడేవారు. పాటలకు, పుస్తకాలకు తగిన రీతిలో బొమ్మలు వేసేవారు. తిట్టకుండా, కొట్టకుండా అపారమైన ప్రేమ, స్నేహాలతో పిల్లలను పెంచటం ఎలాగో తల్లిదండ్రులకూ, ఉపాధ్యాయులకూ తెలియాలి. జీవితానికీ, నేర్చుకొనే విద్యకూ సంబంధం లేకుండా పిల్లల్ని యంత్రాలుగా కాకుండా సృజనశీలురుగా, చైతన్యమూర్తులుగా తయారు చేసే ప్రయత్నాలకు జై సీతారామ్ పాటలు స్ఫూర్తినిస్తాయి.
'మేం పిల్లలం' పుస్తకాన్ని పిల్లల పుస్తక ప్రచురణ సంస్థ 'పాల పిట్ట' ప్రచురించింది. వెల వంద రూపాయలు. -
ఉండవల్లి గుహలు కొండలను తొలిచి నిర్మించిన గుహాలయాలకు ఒక ఉదాహరణ. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం లోని ఉండవల్లి గ్రామంలో కృష్ణా నదికి దక్షిణంగా ఈ గుహలు ఉన్నాయి. 4 - 5 శతాబ్థాల కాలంలో ఇక్కడ చిన్న చిన్న గుహలను తొలిచారు. అయితే వీటిలో పెద్ద గుహ నాలుగు అంతస్తులను కలిగి ఉంది. రెండవ అంతస్తులో ఒకే గ్రానైట్ రాతితో చెక్కిన అతి పెద్ద అనంత పద్మనాభుడి విగ్రహం ఉంది. తొలుత ఈ గుహలను బౌద్ధ ఆరామాల రీతిలో నిర్మించినట్లు కనిపిస్తుంది.
ఉండవల్లి గుహలను క్రీ.శ. 420 నుంచి 620 సంవత్సరాల మధ్య పరిపాలించిన విష్ణుకుండిన రాజుల కాలంలో నిర్మించారు.
ఉండవల్లి హైదరాబాద్ నుంచి 280 కిలో మీటర్ల దూరంలో ఉంది. విజయవాడనుంచి 6 కిలో మీటర్ల దూరం లోను, గుంటూరు నుంచి 22 కిలో మీటర్ల దూరంలోను ఉండవల్లి ఉంది. మంగళగిరి, అమరావతి ఇక్కడకు దగ్గరలో ఉన్న దర్శనీయ స్థలాలు.
-
భారతీయ రూపాయికి ఇన్నాళ్లకు గుర్తు లభించనుంది. దేవనాగరి లిపినుంచి 'ర' రోమన్ గుర్తు 'ఆర్' ను కలిపి ఈ గుర్తును రూపొందించారు. బోంబే ఐఐటీ విద్యార్థి ఉదయ్కుమార్ దీన్ని రూపొందించారు. ఈ గుర్తుకోసం దేశవ్యాప్తంగా 3వేల డిజైన్లు తుది పోటీకి రాగా ఉదయ్కుమార్ డిజైన్ను ఎంపికచేశారు. కేంద్ర మంత్రివర్గం 15 జూలై న ఈ గుర్తును ఆమోదించింది. దీంతో ఇక యు.ఎస్.డాలర్, యూరో, బ్రిటిష్ పౌండ్, జపనీస్ 'యెన్' తరహాలో మన రూపాయకూ ప్రత్యేకమైన గుర్తు ఉంటుంది. అయితే దీన్ని కరెన్సీ నోట్పై మాత్రం ముద్రించరు. త్వరలో అమల్లోకి రానున్న యునిక్కోడ్, ప్రపంచస్థాయి వ్యాపారలావాదేవీలు, వ్యాపార, ప్రింట్ మీడియాలో డిస్ప్లేల సందర్భంగా ఈ గుర్తును వాడతారు. మరో 6 నెలల్లో మన దేశంలోను రెండేళ్లలోను ప్రపంచవ్యాప్తంగాను ఈ గుర్తు అమల్లోకి వస్తుందని కేంద్రమంత్రి అంబికాసోనీ తెలిపారు.
ప్రత్యేక గుర్తుతో ఇదీ లాభం...
- గుర్తు రావటం వల్ల రూపాయికి బ్రాండ్ ఏర్పడి అంతర్జాతీయంగా దీని గుర్తింపు సులువవుతుంది.
- మున్ముందు డాలర్, పౌండు, యూరో, యెన్ల తరహాలోనే మన కరెన్సీలోనూ ట్రేడింగ్ మరింత ఊపందుకునే అవకాశాలున్నాయి.
- అంతర్జాతీయ ప్రాచుర్యంతో భారత్లోకి మరిన్ని పెట్టుబడులు వచ్చేందుకు ఆస్కారముంటుంది.
దీంతో యూరప్లోని పెద్దపెద్ద కంపెనీలన్నీ తమ కంప్యూటర్ సిస్టమ్స్లో సింబల్కి చోటు కల్పించేందుకు 50 బిలియన్ డాలర్లకు పైగా వెచ్చించాల్సి వచ్చింది. ఇప్పుడు రూపాయి గుర్తుకి కూడా ఇదే కసరత్తు చేయాల్సి ఉంటుంది. ఉదాహరణకు కంప్యూటర్లో తీసుకుంటే సాఫ్ట్వేర్లో కొత్త గుర్తును కూడా చేర్చాలి. పైపెచ్చు కీ బోర్డులో ఈ గుర్తుతో కూడిన కీని చేర్చాలి. అలాగే టైప్ రైటర్స్లోను, మొబైల్ పోన్లలోను కూడా దీనికి చోటు కల్పించాల్సి ఉంటుంది. దీనికి తగ్గట్లే యూనికోడ్, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్లు రూపాయి గుర్తును ఎన్కోడ్ చేశాక ఐటీ సంస్థలు తమ ఆపరేటివ్ సాఫ్ట్వేర్లో అప్డేట్లాగా కానీ, కొత్త ప్రోగ్రాం ద్వారా గానీ దానికి చోటు కల్పించేలా నాస్కామ్ చొరవ తీసుకుంటుందని ప్రభుత్వం తెలిపింది.
కరెన్సీపై మాత్రం గుర్తు ఉండదు..
ప్రస్తుతం డాలరు, యూరో, యెన్ మొదలైన కరెన్సీలకు ప్రత్యేక గుర్తులు ఉన్నా వాటిని ఆయా నోట్లపై మాత్రం ముద్రించడం లేదు. నోట్లపై అక్షరాల్లో రాస్తున్నారంతే. ఒక్క పౌండ్ స్టెర్లింగ్ గుర్తును మాత్రమే నోట్లపై ముద్రిస్తున్నారు. మిగతా వాటి తరహాలోనే కరెన్సీ నోట్లపై గానీ నాణేలపై కానీ రూపాయి గుర్తు ముద్రణ ఉండదని, ఇప్పట్లానే అక్షరాల్లో రాయటాన్నే కొనసాగిస్తామని ప్రభుత్వం తెలియజేసింది.
రూపాయిని ఇప్పటిదాకా దేశంలో వివిధ భాషల్లో వివిధ రకాలుగా పలుకుతున్నారు. రాసేటపుడు కూడా వివిధ రకాలుగా రాస్తున్నారు. హిందీలో రూప్యా, గుజరాతీలో రూపియో, తమిళంలో రుబాయి.. త్రిపురా, మిజోరాం, ఒరిస్సా, అసోం రాష్ట్రాల్లో టంకా, బెంగాలీలో టాకా అని పిలుస్తున్నారు. రాసేటప్పుడు కూడా ఇంగ్లీషులోని ఆర్ఎస్, ఆర్ఈ, టి వంటి అక్షరాలతోను, తెలుగులో రూ.. అని రాస్తున్నారు. ఇకపై వాడుక భాషలో రూపాయి, రుబాయి, రూప్యా అంటూ మాట్లాడినా, రాసేటపుడు మాత్రం అందరూ ఒకే గుర్తును రాసే అవకాశముంది. కాకుంటే దీనికి కొంత సమయం పట్టొచ్చు.
రూపాయి గుర్తుకు రూపమిచ్చిన డి.ఉదయ్కుమార్ పుట్టింది తమిళనాడులో. ప్రస్తుతం ఐఐటీ-ముంబైలో పీహెచ్డీ చేస్తున్నారు. డిజైన్లో మాస్టర్స్ డిగ్రీ ఉన్న ఉదయ్కుమార్ చిప్ అనే కంప్యూటర్స్ మ్యాగజైన్లో డిజైన్ హెడ్గా కూడా పనిచేశారు. తాజాగా ఆయన ఐఐటీ-గౌహతిలోని డిజైన్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేరబోతున్నారు కూడా. రూపాయి గుర్తు ఎంపిక ప్రకటన వెలువడగానే ఉదయకుమార్కు మీడియా నుంచి కాల్స్ వెల్లువెత్తాయి. "నా ఆనందాన్ని మాటల్లో చెప్పలేను. నేను రూపొందించిన గుర్తులో త్రివర్ణ పతాకం కూడా ప్రతిబింబించాలని అనుకున్నాను. భారతీయ లిపిలో అక్షరాలకు పైన గీత అనేది దేవనాగరిలోనే ఉంటుంది. అందుకే ఆ లిపిలోని ర అక్షరం, రోమన్ అక్షరం ఆర్లు, పైన రెండు గీతలు మధ్యలో తెల్లని వ ర్ణం కలబోతతో రూపాయి గుర్తు రూపొందించాను' అని ఉదయ్కుమార్ చెప్పారు. ఈ గుర్తును రూపొందింఛి నందుకు గాను ఉదయ్కుమార్కి రెండున్నర లక్షల నగదు బహుమతి లభిస్తుంది. -
గిరిజనులు తాము నివసించే ప్రాంతాల్లో దొరికే వాటితోనే రకరకాల వస్తువులను తయారు చేస్తారు. ఏ పనికైనా స్వయంగా తామే ఓ కొత్త పద్దతిని కనుగొంటారు. ఉత్తరాంధ్ర లోని చింతపల్లి, జి.కె.వీధి, పాడేరు, అరకు, హుకుంపేట ప్రాంతాలలో పర్యటించినప్పుడు మేము తెలుసుకొన్న ఆసక్తికరమైన విషయాలను ఇక్కడ తెలియజేస్తున్నాము.
దోనె
పశువులకు కావలసిన నీటిని అందించేందుకు దోనెలను గిరిజనులు ఉపయోగిస్తున్నారు. బాగా లావుగా ఉన్న కర్రను తీసుకొని మధ్యలో కలపను తొలగించి తొట్టెలాగ చేస్తారు. దీని పొడవుగు తగినట్లుగా, రెండు ప్రక్కల రెండు రాటలు వేసి, దానిపైన చెక్కిన ఈ కర్ర దోనెను ఉంచుతారు. దీనిలో నీళ్లు పోసి ఉంచుతారు. పశువులు నీటిని దీనిలో నుంచి తాగుతాయి.
పంట పొలాలకు దోనె
ఏజెన్సీ గ్రామాలలో పంట పొలాలకు నీరు పెట్టేందుకు కూడా దోనెను ఉపయోగించటం జరుగుతోంది. ముఖ్యంగా కూరగాయలను పెంచుతున్నప్పుడు దీనిని వాడుతున్నారు. పెద్ద కర్రను తీసుకొని, ఆ చివర నుంచి ఈ చివర వరకు మధ్యలో ఖాళీ వచ్చేలా చెక్కుతారు. ఒక వైపు ఎత్తు ఎక్కువగా ఉన్న రాటను ఉంచి, నీరు వెళ్లేందుకు అనువుగా మరొక వైపు ఎత్తు తక్కువగా ఉండేలా రాటను అమర్చుతారు. ఈ రాటల పైన దోనెను ఉంచుతారు. ఇపుడు నీటిని ఎత్తుగా ఉన్నవైపు పోస్తే నీరు క్రిందికి జారి పొలంలో అవసరమైన చోట పడుతుంది. ఇలా శారీరక శ్రమను తగ్గించుకొనేందుకు గిరిజనులు కనుగొన్న పద్ధతి ఇది.
- జి. ఉదయ్ -
చదువు కొన్న వాళ్లకే గొప్ప తెలివి తేటలు ఉంటాయనుకోవటం పెద్ద పొరపాటు. అక్షర జ్ఞానం లేకుండా అడవులలో నివసించే గిరిజనులకు ప్రకృతిలో సహజంగా లభించే వస్తువులతో తమ అవసరాలను తీర్చుకొనటం ఎలాగో తెలుసు. విశాఖపట్నం జిల్లా లోని చింతపల్లి పరిసర గిరిజన గ్రామాలలో ప్రజలు అనుసరించే ఈ పద్ధతులే ఇందుకు ఉదాహరణ. ఉత్తరాంధ్ర లోని చింతపల్లి, జి.కె.వీధి, పాడేరు, అరకు, హుకుంపేట ప్రాంతాలలో పర్యటించినప్పుడు ఇటువంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాలను మేము తెలుసుకొన్నాం.
మేకల దుర్రి
కర్రలు, వెదురు, గడ్డి వంటి వాటితో మేకల దుర్రిని తయారు చేస్తారు. కర్రలతో నాలుగు రాటలు వేసి, వెదురు లేదా కర్రలతో దడిలా చేసి దానిపైన గడ్డిని కప్పుతారు. ఈ గదిలో మేకలను ఉంచుతారు. క్రింద పేరుకున్న మేకల గత్తముని ఎరువుగా ఉపయోగిస్తారు. ఈ పద్ధతిని ఎక్కువగా పి.టి.జి (ప్రిమిటివ్ ట్రైబ్ గ్రూపు) లు పాటిస్తున్నట్లు స్థానికులు చెప్పారు.
గడ్డి పందిరి
దీనిని గిరిజన ప్రాంతాలలో ఎక్కువగానే ఉపయోగిస్తున్నారు. ఆవులు, ఎద్దులు, గేదెల వంటి పెంపుడు జంతువులకు ఆహారంగా ఉపయోగపడే ఎండు గడ్డిని నిల్వ చేసేందుకు గడ్డి పందిరిని తయారు చేస్తారు. ముందుగా నాలుగు రాటలను వేసి, వాటి పైన కర్రలతో పందిరిలాగ కడతారు. దానిపైన వరి గడ్డిని పరుస్తారు. ఇలా గడ్డిని నిల్వ చేయటం వలన వానలు వచ్చినా క్రింద గడ్డి తడిసి పాడై పోకుండా ఉంటుంది.
- జి. ఉదయ్
-
-
''మేం మేధా సంపన్నులం. మేమేమైనా చేయగలం. ఏమైనా సాధించగలం. తుపాకులు, అణ్యాయుధాలతో దేనినైనా అంతం చేయగలం.'' అనే భావనతో ప్రపంచాన్నంతటినీ పాదాక్రాంతం చేసుకొనేందుకు చేసే ప్రయత్నాలతో మనిషి చిట్టచివరికి భూమిని నివాస యోగ్యం కాకుండా మార్చేస్తాడు. ప్రకృతిలో సహజంగా జరిగే చర్యలన్నిటికీ అడ్డుపడి సహజ వనరులను కోల్పోతాడు. అయినా అతడు మారడు. ఇక విశ్వాంతరాల్లోకి అన్వేషణ మొదలవుతుంది. ఇతర గ్రహాల మీది వనరుల మీదా దాడి మొదలవుతుంది. ఆ తర్వాత ఏమవుతుంది? అనే ప్రశ్నకు జవాబు 'అవతార్'.
ఇటీవల విడుదలైన 'అవతార్' చిత్రం హాలీవుడ్ బ్లాక్ బస్టర్గా నిలిచింది. అలియన్స్, టెర్మినేటర్, టైటానిక్ వంటి సంచలనాత్మక చిత్రాలకు దర్శకత్వం వహించిన జేమ్స్ కామెరన్ అత్యద్భుతంగా పర్యావరణ సందేశాన్ని ప్రపంచానికి అందిస్తూ తీసిన అవతార్ ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ఆదరణకు నోచుకోవటం ఓ మంచి పరిణామమే.
కథ 2154లో మొదలవుతుంది. అప్పటికి భూమి మీద ఉన్న సహజ వనరులన్నీ కనుమరుగై పోతాయి. భూమికి 4.4 కాంతి సంవత్సరాల దూరంలో పచ్చగా కళకళలాడుతున్న 'పండోరా'కు చక్రాల కుర్చీకి పరిమితమైన మెరైనర్ జాక్ సల్లీ కూడా చేరుకొంటాడు. మిలిటరీ సహాయంతో 'రీసోర్సెస్ డెవలప్మెంట్ అడ్మినిస్ట్రేషన్' నేతృత్వంలో అప్పటికి మూడు దశాబ్ధాలుగా పండోరాపై వలస ఏర్పర్చుకుని, అరుదైన ఖనిజం 'యునొబ్టానియం' ని మానవులు వెలికి తీస్తూ ఉంటారు. భూమి మీద శక్తిని ఉత్పత్తి చేసేందుకు ఉపయోగపడే ఖనిజం అది. వనరుల మీద ఆధిపత్యం సాధించేందుకు, వాళ్లను నియంత్రించేందుకు పండోరా వాసులతో సన్నిహిత సంబంధం ఏర్పర్చుకోవాలని అడ్మినిస్ట్రేషన్ ప్రయత్నిస్తూ ఉంటుంది. పండోరా వాసులు నీలి వర్ణంలో పొడవుగా ఉండే యోధులు. వాళ్లను నవీలని పిలుస్తారు. అయితే పండోరా వాతావరణం మానవులకు విషతుల్యం. కనుక అక్కడి బయోస్ఫియర్ను అధ్యయనం చేసేందుకు శాస్త్రవేత్తలు మానవ జన్యువులను ఆధారంగా చేసుకొని అవతార్లను సృష్టిస్తారు. జాక్ కు అవతార్గా మారే అవకాశం లభిస్తుంది. నవీల సమాచారాన్ని సేకరించి శాస్త్రవేత్తలకు అతడు అందించాలి. ఆ క్రమంలో జాక్ నవీ యువరాణి నేత్యిరి సహాయంతో పండోరా గురించి పూర్తిగా తెలుసుకొంటాడు. పండోరాలో ప్రాణకోటికి ఆయువుపట్టుగా నిలిచిన ఐవా, ప్రకృతితో సహ జీవనం చేసే నవీలు, అక్కడ చరాచర జీవ కోటి పట్ల అతడికి గౌరవం పెరిగిపోతుంది. చివరకు అతడే నవీగా మారిపోయి పండోరాను రక్షించే బాధ్యతను తీసుకొంటాడు.
ఈ సినిమాను చూస్తున్నంత సేపు మన దేశంలో, ముఖ్యంగా మన రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాలలో ఖనిజ వనరుల కోసం చేపడుతున్న గనుల తవ్వకాలు, గిరిజనుల ఆందోళనా కళ్ల ముందు నిలుస్తాయి.
కేవలం స్పెషల్ ఎఫెక్ట్స్ కోసం కాకుండా, వినోదం కోసం కాకుండా మరొక్కసారి ఈ సినిమాను చూడండి. -
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సతీష్ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి జూలై 12 వ తేదీ ఉదయం చేపట్టిన పీఎస్ఎల్వీ సీ -15 ఉపగ్రహ వాహక నౌక ప్రయోగం విజయవంతం అయ్యింది. మొదటి మూడు దశలను పూర్తి చేసిన పీఎస్ఎల్వీ నాలుగోదశలో సెకనుకు 7.5 కి.మీ. వేగంతో ప్రయాణించింది. అన్ని దశలను విజయవంతంగా పూర్తి చేసిన వాహకనౌక 5 ఉపగ్రహాలను నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. ఈ వాహకనౌక 694 కిలోల బరువుగల కార్డోశాట్-2బి, 116 కిలోల బరువుగల అల్శాట్-ఏ, కెనడా, స్విట్జర్లాండ్లకు చెందిన రెండు ఉపగ్రహాలు , ఆంధ్రప్రదేశ్, కర్ణాటక విద్యార్థులు తయారు చేసిన స్టడ్ శాట్లను కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశపెట్టింది.
పట్టణ ప్రణాళిక, రింగ్ రోడ్లు వంటి మౌలిక వసతుల అభివృద్ధికి కార్టోశాట్ దోహదపడుతుంది. ఇందులో అత్యాధునిక పాన్క్రొమాటిక్ కెమెరా ఉంది. 9.6 కిలోమీటర్ల ప్రాంతంలోని దృశ్యాలను 0.8 మీటర్ల రిజల్యూషన్తో చిత్రీకరించగలదు. గ్రామస్థాయిలో వనరుల అంచనా, సూక్ష్మ వాటర్షెడ్ అభివృద్ధి పథకాలు, పంటల పరిశీలన వంటివి దీనిద్వారా చేపట్టవచ్చు. ఇప్పటికే కక్ష్యలో కార్టోశాట్-2, కార్టోశాట్-2ఎలు ఉన్నాయి.
పీఎస్ఎల్వీ 'కోర్ ఎలోన్' వర్షన్ను ఈసారి ప్రయోగిస్తున్నారు. 44 మీటర్ల పొడవుండే ఈ వాహకనౌక.. పైకిలేచే సమయంలో 230 టన్నుల బరువును కలిగి ఉంటుంది. ఇప్పటి వరకూ ఇది 17 భారత, 22 విదేశీ ఉపగ్రహాలను ప్రయోగించింది. ఇందులో భారత తొలి చంద్రమండల అన్వేషక ఉపగ్రహం చంద్రయాన్-1 కూడా ఉంది. - భూమి వయస్సు గురించి వేసిన అంచనాలన్నీ తప్పేనని కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు తేల్చారు. గతంలో పేర్కొన్న దానికన్నా భూమి వయస్సు తక్కువేనని నిర్ధరించారు. 456 కోట్ల సంవత్సరాల కిందట సౌర కుటుంబం ఆవిర్భవించిందని, ఆ తరువాత చాలా కాలానికి భూమి పుట్టిందని వారు అన్నారు. భూమి మ్యాంటిల్ భాగంలోని రసాయన ఐసోటోపులను రోదసి నుంచి వచ్చిపడ్డ ఉల్కలతో పోల్చి చూసిన శాస్త్రవేత్తలు ఈ మేరకు నిర్ధరించారు. ప్రస్తుత పరిమాణానికి చేరుకోవడానికి భూమికి 446 కోట్ల సంవత్సరాలు పట్టిందని తేల్చారు. వాయువులు, ధూళి, ఇతర పదార్థాలు కలగలసి భూమిగా ఏర్పడడానికి మూడు కోట్ల సంవత్సరాలు పట్టిందని శాస్త్రవేత్తలు గతంలో పేర్కొన్నారు. అయితే తాజా పరిశోధనలో ఇందుకు 10 కోట్ల సంవత్సరాలు పట్టి ఉంటుందని తేల్చారు. ప్రస్తుత పరిమాణంలో 60 శాతం మేర చేరుకోవడానికి ఎక్కువ సమయం పట్టలేదని అన్నారు. ఆ తరువాత పెరుగుదల మందగమనంలో సాగిందని, ఫలితంగానే 10 కోట్ల సంవత్సరాలు పట్టిందని వారు అన్నారు.
-
సామెతలు...
తెలుగు సాహిత్యంలో సామెతల కేమీ కొదవ లేదు. నగర జీవి మరిచిపోయినా ఈ సామెతలు పల్లె జనం నోళ్లలో నేటికీ నానుతూ ఉన్నాయి. జంతువులు, చెట్లు, వ్యవసాయం..... ఇలా ఎన్నో విషయాల గురించి విలువైన సమాచారాన్ని సామెతల్లో నిక్షిప్తం చేశారు మన పూర్వీకులు. అటువంటి సామెతల నుంచి కొన్నిటిని ఇక్కడ ఇస్తున్నాం.
- ఆకులున్న చెట్టుకే నీడ
- ఆకు నలిపి నపుడే అసలు వాసన బయట పడేది
- ఆ పప్పు ఈ నీళ్లకు ఉడకదు
- ఆముదపు విత్తులు ఆణిముత్యాలగునా?
- ఆరికకు చిత్తగండం
- ఆరుద్ర కురిస్తే దారిద్య్రం లేదు
- ఆవులు ఆవులు పోట్లాడుకొని దూడల కాళ్లు విరిగినట్లు
- ఆవు ఎక్కడ తిరిగితేనేమి మన ఇంటికొచ్చి పాలిస్తే చాలు అన్నట్లు
- ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా?
- ఆవు పాడి ఎన్నాళ్లు? ఐశ్వర్యమెన్నాళ్లు? బర్రె పాడి ఎన్నాళ్లు? భాగ్యమెన్నాళ్లు?
- ఆవు ముసలిదైతే పాల రుచి తగ్గుతుందా?
- ఆవు మేత లేక చెడితే పైరు చూడక చెడింది
- ఆవులలో ఆబోతై తినాలి
ఇటువంటి సామెతల గురించి మీ ఇంట్లో అమ్మానాన్నలనీ, అమ్మమ్మ, నానమ్మ, తాతయ్యలనీ అడగండి. ఆ సామెతల వెనుక దాగిన అర్థం ఏమిటో తెలుసుకోండి. మీరు తెలుసుకున్న సామెతల గురించి వివరంగా మాకు వ్రాసి మీ ఫోటోతో పాటుగా పంపండి. 'బాల చెలిమి'లో వాటిని ప్రచురిస్తాం. -
పొడుపు కథ:
1
పిఠాపురం చిన్నవాడా!
పిట్టల వేటకాడా !
వేటకైతే పోతు
న్నావు కానీ అడవికి పోరాదు
పోతే తుపాకీ మందు కూరరాదు
కూరితే గురి చూడారాదు
చూసినా తుపాకి పేల్చరాదు
పేల్చినా పిట్టను కొట్టరాదు
నీచు లేకుండా రారాదు
ఇదేమిటో చెప్పుకో చూద్దాం !!
2
రాజమండ్రి వారి ఆడపడుచా
రఘుపతి కోడలా
నీళ్లకు పోతున్నావు కానీ
నూతి దగ్గరకు వెళ్లకూడదు
వెళ్లినా చేద విప్పకూడదు
విప్పినా నూతిలో వేయకూడదు
వేసినా నీళ్లు తోడకూడదు
తోడినా బిందెలో పోయకూడదు
అలా అని నీళ్లు లేకుండా రానూ కూడదు
ఈ పొడుపు కథేమిటో విప్పు చూద్దాం.
పొడుపు కథలు. పొడుపు కథలకు తెలుగు సాహిత్యంలో ప్రత్యేక స్థానం ఉంది. ఇవి పిల్లలు, పెద్దలలో ఆలోచనలను రేకెత్తించేవిగా ఉంటాయి. వినోదాన్నీ ఇస్తాయి. మానసిక వికాసాన్నీ కలిగిస్తాయి. చాలా పొడుపు కథలు కనుమరుగై పోయినా, కాల గర్భంలో కలిసి పోయినా, ఇప్పటికీ పల్లె ప్రాంతాలలో వీటికి ఆదరణ ఎంతో ఉంది.
మీ ప్రాంతంలో ప్రచారంలో ఉన్న పొడుపు కథలను వ్రాసి బాల చెలిమికి పంపండి. మీ పేరు, ఫోటో కూడా జత చేసి పంపండి. వెంటనే బాల చెలిమిలో ప్రచురిస్తాం.
జవాబులు : కోడి గుడ్డు, కొబ్బరి కాయ -
1
వంకర టింకర మాను
వయ్యారి మాను
రాజు లెక్కే మాను
మా ఊరొచ్చే మాను
కాపు లెక్కే మాను
కష్ట జీవుల మాను
ఎత్తుకు తిరిగే మాను
ఇంతల పెండ్లి కానూ!!
2
అంతులేని చెట్టుకు అరవై ఆరు కొమ్మలు
కొమ్మ కొమ్మకు కోటి పూలు
పొడుపు కథలు. పొడుపు కథలకు తెలుగు సాహిత్యంలో ప్రత్యేక స్థానం ఉంది. ఇవి పిల్లలు, పెద్దలలో ఆలోచనలను రేకెత్తించేవిగా ఉంటాయి. వినోదాన్నీ ఇస్తాయి. మానసిక వికాసాన్నీ కలిగిస్తాయి. చాలా పొడుపు కథలు కనుమరుగై పోయినా, కాల గర్భంలో కలిసి పోయినా, ఇప్పటికీ పల్లె ప్రాంతాలలో వీటికి ఆదరణ ఎంతో ఉంది.
మీ ప్రాంతంలో ప్రచారంలో ఉన్న పొడుపు కథలను వ్రాసి బాల చెలిమికి పంపండి. మీ పేరు, ఫోటో కూడా జత చేసి పంపండి. వెంటనే బాల చెలిమిలో ప్రచురిస్తాం.
జవాబులు : పల్లకీ, ఆకాశం-చుక్కలు -
కూడు, గూడు, గుడ్డ...సెల్ఫోన్! అన్నట్లుగా మారిపోయింది పరిస్థితి. సెల్ ఫోన్ కనీస అవసరాల జాబితాలో చేరిపోయినట్లే అయింది. ప్రపంచ జనాభా సుమారు 685 కోట్లు కాగా, సెల్ఫోన్ కనెక్షన్ల సంఖ్య 500 కోట్లను దాటింది. ఈ వారంలోనే కొత్త రికార్డు నమోదైనట్లు 'ఎల్ఎం ఎరిక్సన్ ఏబీ' సంస్థ పేర్కొంది.
సెల్ కనెక్షన్ల సంఖ్య కొన్నాళ్లకు జనాభాను మించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే.. రెండేసి ఫోన్లు వాడుతున్నవాళ్లు, ఒకే ఫోన్లో డ్యుయల్ సిమ్లు పెట్టుకున్న వాళ్లు భారీ సంఖ్యలోనే ఉన్నారు. అభివృద్ధి చెందుతున్న దేశాలుగా పేరు పొందిన భారత్, చైనాల్లోనే భారీ స్థాయిలో సెల్ఫోన్ల వినియోగదారుల సంఖ్య పెరుగుతోంది. మొబైల్ ఫోన్ల వినియోగంలో చైనా, భారత్ల మధ్య పోటీ నెలకొంది. వందకోట్లు దాటిన భారత జనాభాలో దాదాపు ప్రతి ఇద్దరిలో ఒకరికి సెల్ ఉంది. రెండు మూడు వేల రూపాయలకే సకల సౌకర్యాలున్న మొబైల్ సెట్స్ అందుబాటులోకి రావడం సెల్ విస్తరణకు మరో కారణమైంది.దేశంలో ఈ ఏడాది మార్చి నెలలోనే ఏకంగా రెండు కోట్ల సెల్ కనెక్షన్లు పెరగడం విశేషం. మొబైల్ కనెక్షన్లలో చైనా తర్వాతి స్థానం భారత్దే.