చదువు కొన్న వాళ్లకే గొప్ప తెలివి తేటలు ఉంటాయనుకోవటం పెద్ద పొరపాటు. అక్షర జ్ఞానం లేకుండా అడవులలో నివసించే గిరిజనులకు ప్రకృతిలో సహజంగా లభించే వస్తువులతో తమ అవసరాలను తీర్చుకొనటం ఎలాగో తెలుసు. విశాఖపట్నం జిల్లా లోని చింతపల్లి పరిసర గిరిజన గ్రామాలలో ప్రజలు అనుసరించే ఈ పద్ధతులే ఇందుకు ఉదాహరణ. ఉత్తరాంధ్ర లోని చింతపల్లి, జి.కె.వీధి, పాడేరు, అరకు, హుకుంపేట ప్రాంతాలలో పర్యటించినప్పుడు ఇటువంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాలను మేము తెలుసుకొన్నాం.
మేకల దుర్రి
కర్రలు, వెదురు, గడ్డి వంటి వాటితో మేకల దుర్రిని తయారు చేస్తారు. కర్రలతో నాలుగు రాటలు వేసి, వెదురు లేదా కర్రలతో దడిలా చేసి దానిపైన గడ్డిని కప్పుతారు. ఈ గదిలో మేకలను ఉంచుతారు. క్రింద పేరుకున్న మేకల గత్తముని ఎరువుగా ఉపయోగిస్తారు. ఈ పద్ధతిని ఎక్కువగా పి.టి.జి (ప్రిమిటివ్ ట్రైబ్ గ్రూపు) లు పాటిస్తున్నట్లు స్థానికులు చెప్పారు.
గడ్డి పందిరి
దీనిని గిరిజన ప్రాంతాలలో ఎక్కువగానే ఉపయోగిస్తున్నారు. ఆవులు, ఎద్దులు, గేదెల వంటి పెంపుడు జంతువులకు ఆహారంగా ఉపయోగపడే ఎండు గడ్డిని నిల్వ చేసేందుకు గడ్డి పందిరిని తయారు చేస్తారు. ముందుగా నాలుగు రాటలను వేసి, వాటి పైన కర్రలతో పందిరిలాగ కడతారు. దానిపైన వరి గడ్డిని పరుస్తారు. ఇలా గడ్డిని నిల్వ చేయటం వలన వానలు వచ్చినా క్రింద గడ్డి తడిసి పాడై పోకుండా ఉంటుంది.
- జి. ఉదయ్
0 comments:
Post a Comment