-
ఆఫ్రికాకు చెందిన భయంకరమైన రెండు జాతుల మలేరియా దోమలు జన్యుపరంగా తేడాలున్న రెండు కొత్త జాతులుగా రూపాంతరం చెందుతున్నట్లు లండన్ ఇంపీరియల్ కళాశాలకు చెందిన పరిశోధకులు కనుగొన్నారు. మలేరియాతో జరిపే పోరుపై ఈ ఆవిష్కరణ ప్రభావం చూపనుంది. ఆఫ్రికాలో మలేరియా వ్యాప్తికి కారణమైన అనోఫెలెస్ గాంబియా అనే దోమలపై లండన్ ఇంపీరియల్ కళాశాలకు చెందిన పరిశోధకులు అధ్యయనం చేశారు. ఈ దోమలకు చెందిన రెండు జాతులు వాటి జన్యుపరిణామ క్రమంలో వేగంగా విడిపోతున్నట్లు కనుగొన్నారు. దీంతో ఎప్పటికప్పుడు వ్యాధి నివారణకు కొత్త ఔషధాలను కనుక్కోవాల్సిన అవసరం ఏర్పడుతోంది. ''దోమల్లో అత్యంత వేగంగా కొత్త జాతులు పుట్టుకొస్తున్నట్లు మా పరిశోధనలో తేలింది. ఓ జాతి నివారణ పద్ధతి మరో జాతి దోమలపై సమర్థంగా పనిచేయడం లేదు'' అని పరిశోధన బృందం సభ్యుడు మారియా లానిక్జాక్ తెలిపారు.
-
రక్తమార్పిడి తప్పనిసరైన లుకేమియా తదితర వ్యాధుల చికిత్సలో ఉపయోగపడే ఓ సరికొత్త విధానాన్ని శాస్త్రవేత్తలు ఆవిష్కరించారు. మెక్మాస్టర్ విశ్వవిద్యాలయానికి చెందిన మూలకణ, క్యాన్సర్ పరిశోధనా కేంద్రం శాస్త్రవేత్తలు భారత సంతతికి చెందిన శాస్త్రవేత్త మిక్భాటియా సారథ్యం లో ఈ విజయం సాధించారు. ఈ విధానం బాగా ప్రాచుర్యంలోకి వస్తే శస్త్రచికిత్సలు, ఇతరత్రా రక్తమార్పిడి అవసరమైన సందర్భాల్లో ఎవరి రక్తాన్ని వారే ఉపయోగించుకుని స్వస్థత పొందవచ్చని శాస్త్రవేత్తలు విశ్లేషిస్తున్నారు. ఈ విధానంలో సేకరించిన మానవ చర్మకణాలను నేరుగా రక్తంగా రూపాంతరం చెందిస్తారు. ఇది మూలకణాల ద్వారా రక్తం తయారీ ప్రక్రియ కంటే సులువైన విధానమని శాస్త్రవేత్తలు వెల్లడించారు. అయితే, కేవలం యౌవన ప్రాయంలో ఉన్న వ్యక్తులనుంచి సేకరించే చర్మకణాలు మాత్రమే వినియోగించాల్సి ఉంటుందని తెలిపారు.