-
బాలల్లో రచనా నైపుణ్యాన్ని పెంపొందించాల్సిన అవసరం ఎంతో ఉందని తెలంగాణ
రాష్ట్ర ప్రెస్ అకాడమి చైర్మన్ అల్లం నారాయణ అన్నారు. బాలసాహిత్యం - నా
అనుభవాలు - సూచనలు అనే అంశంపై బాలచెలిమి పిల్లల వికాస పత్రిక, చిల్డ్రన్స్
ఎడ్యుకేషన్ అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో శనివారం ఆక్స్ఫర్డ్ గ్రామర్
స్కూల్లో నిర్వహించిన 'బాలచెలిమి ముచ్చట్లు' 9వ కార్యక్రమానికి ఆయన ముఖ్య
అతిథిగా హాజరై మాట్లాడారు. బాలల్లో ఊహా శక్తిని పెంపొందించేందుకు అవసరమైన
తోడ్పాటు కుటుంబంతో పాటు విద్యాలయాల నుండి చిన్న నాడే లభిస్తే మంచి
ప్రేరణను పొందుతారని చెప్పారు. బాల్యాన్ని అద్భుతంగా మలచడానికి మంచి బాలల
రచనలు రావాల్సిన అవసరం ఉందని ఆ కృషి ఇంకా పెంపొందాలని తెలిపారు. జీవితంలో
ఎదిగే దశల్ని చూపే బాలల రచనలకు ప్రాధాన్యత కల్పించాలని అన్నారు.
సహజసిద్ధమైన సామాజిక వాతావరణాన్ని బాలలకు రచనల ద్వారా పరిచయం చేయాల్సిన
అవసరం ఉందని చెప్పారు. నిరంతర ఆలోచనల నుండి సృజనాత్మక శక్తితో
స్ఫూర్తినిచ్చే రచనలు క్రియాశీలకంగా బాలల విషయంలో మారుతాయని తెలిపారు.
బాహ్య, అంతర ఆలోచనలను ప్రభావితం చేసిన ఎన్నో బాలల రచనలు ఇప్పటికీ గొప్పగా
మిగిలిపోయాయని ఆయన గుర్తు చేశారు. పేదరాసి పెద్దమ్మ వంటి కథలు ఎంతో
ఆసక్తిని బాలలలో కలిగిస్తాయని తెలిపారు.
ప్రముఖ రచయిత డాక్టర్ నాళేశ్వరం శంకరం మాట్లాడుతూ బాల్యంలో ఆసక్తిని
కలిగించే అంశాలతో సృజనాత్మకంగా రూపొందించిన కథలను అందించడం ద్వారా గొప్ప
ఫలితం ఉంటుందని చెప్పారు. బాల్యాన్ని అందమైన భవిష్యత్తుగా మలుచుకోవడానికి
వీలు కల్పించే రచనలను రచయితలు అందించాలని అన్నారు. ప్రముఖ రచయిత ఘనపురం
దేవేందర్ మాట్లాడుతూ బాలలు చదివి అందరితో చెప్పుకుని ఆనందించే రీతిలో
సులభమైన పదాలతో, అందమైన శైలితో రచనలు ఉండాలని తెలిపారు. బాలలలో ఉన్న సృజనను
వెతికితే గొప్ప రచనలను వారే స్వయంగా చెయ్యగల్గుతారన్న విషయం నిరూపణ
అయ్యిందని అంటూ తాను చేసిన బాలల రచనల అనుభవాలను వివరించారు. స్ఫూర్తి
డైరెక్టర్ కుమారి పద్మిని రంగరాజన్ మాట్లాడుతూ బాలలతో సంభాషించి వారికి
విషయాన్ని సులభంగా అందించగల్గడం ఎంతో అవసరమని చెప్పారు. రచయితలు బాలల
అభిరుచులను గమనించి తమ రచనలను అందించాలని సూచించారు.
కార్యక్రమానికి అధ్యక్షత వహించిన చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ సొసైటీ
చైర్మన్ వేదకుమార్ మణికొండ మాట్లాడుతూ బాల సాహిత్య రంగంలో నిష్ణాతులైన
ప్రముఖులను ఆహ్వానించి ప్రతి నెలా ఉపయోగకరమైన అంశంపై నిర్వహిస్తున్న
సదస్సులో అనేక ప్రయోజనాత్మకమైన అంశాలు వెలువడుతున్నాయని తెలిపారు.
బాలల
సంపూర్ణ వికాసమే లక్ష్యంగా బాలచెలిమి కార్యక్రమాలు కొనసాగుతాయని తెలిపారు.
కార్యక్రమంలో డాక్టర్ ఎస్.రఘు, జుగాష్విలీ, తిరునగరి శ్రీనివాస్,
వేలాద్రి, తిరుమల శ్రీనివాస్, గొల్లపల్లి సిద్ధార్థ, అలువాల సురేష్,
చిదంబరం, రాజ్కుమార్, జ్యోతి, కృష్ణకుమారి, రజిత, వాసవి, షేక్ మౌసిన్, కె. ప్రభాకర్, కో-ఆర్డినేటర్
తదితరులు పాల్గొన్నారు. డైరెక్టర్ గోపీ దేశాయ్ దర్శకత్వం హించిన 'ముజ్షే
దోస్తీ కరేగే' హిందీ షార్ట్ ఫిల్మ్ను ఈ సందర్భంగా ప్రదర్శించారు.
సన్నిహిత ఉమెన్ - గర్ల్ సొసైటీ పాఠశాల విద్యార్థులు బాలల ముఖాముఖి
కార్యక్రమంలో పాల్గొన్నారు.
-
బాలలు ఉన్నతంగా ఎదిగే స్థితిని కల్పించే రచనలను రచయితలు అందించాలని
కేంద్ర సాహిత్య అకాడమి అవార్డు గ్రహీత, ప్రముఖ రచయిత డాక్టర్ ఎం
భూపాల్రెడ్డి అన్నారు. బాలసాహిత్యం - నా అనుభవాలు - సూచనలు అనే అంశంపై
బాలచెలిమి పిల్లల వికాస పత్రిక, చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ అకాడమీ సంయుక్త
ఆధ్వర్యంలో శనివారం ఆక్స్ఫర్డ్ గ్రామర్ స్కూల్లో నిర్వహించిన 'బాలచెలిమి
ముచ్చట్లు' 8వ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. బాలల
భావాలను గ్రహించి వారి మనస్తత్వాన్ని గమనించి నడవడికను తీర్చిదిద్దేలాగా
రచనలు ఉంటే బాగుంటుందని చెప్పారు. ఆడుతూ పాడుతూ కథల్లా సాగిపోయే ఆనందమయమైన
రచనాశైలిని రచయితలు అవలంబిస్తే బాలలకు ఎంతో ఇష్టంగా సాహిత్యం చేరువవుతుందని
అన్నారు. పాటలు, పొడుపు కథలు, సామెతలు వంటి అంశాలలో ఆసక్తికరంగా రచనలను
మలచాలని చెప్పారు. తల్లిదండ్రులు, కుటుంబ పెద్దలు చెప్పే కథల్ని కూడా
రచయితలు సేకరించి తమదైన బాణీలో అందించగలిగితే ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని
సూచించారు.
ప్రముఖ రచయిత, చరిత్ర పరిశోధకులు డాక్టర్ కావూరి శ్రీనివాస్
మాట్లాడుతూ తల్లిదండ్రులు ఎదుగుతున్న పిల్లలను స్నేహితులుగా భావించాలని
అన్నారు. ఆప్యాయతను అందించగల్గిన వాతావరణాన్ని సాహిత్యంలో రచయితలు
ప్రతిబింబింపజేయాలని చెప్పారు. ఊహా శక్తిని పెంపొందించే విధంగా రచయితల కథా
సృష్టి బాలల కోసం ఉండాలని అన్నారు. ప్రముఖ బాలల రచయిత బమ్మిడి
జగదీశ్వర్రావు మాట్లాడుతూ బాలలు సహజంగా ఎదిగే రీతిలో స్వచ్ఛతను
పెంపొందింపజేసే కథాంశాలను ఎన్నుకొని రచనలు చేయాలని చెప్పారు. సామాజికవేత్త
గరిపల్లి అశోక్ మాట్లాడుతూ అంతరించిపోకుండా కథల్ని పిల్లలకు పెద్దలు
వారసత్వ సంపదగా అందించాలని అన్నారు.
పాత్రికేయురాలు ఉషా తురగా రేవల్లి
మాట్లాడుతూ పాఠం విన్నంత సులభంగా బాలలకోసం రచనలను చేయడానికి రచయితలు
సిద్ధపడాలని చెప్పారు. మలుపులు తిరిగే రీతుల్లో కథల్ని అందించినప్పటికీ
బాలల కోసం స్పష్టత ఎంతో ముఖ్యమని ఆమె అభిప్రాయపడ్డారు.
కార్యక్రమానికి అధ్యక్షత వహించిన చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ సొసైటీ
చైర్మన్ వేదకుమార్ మణికొండ మాట్లాడుతూ బాల సాహిత్య రంగంలో నిష్ణాతులైన
ప్రముఖులను ఆహ్వానించి ప్రతి నెలా ఉపయోగకరమైన అంశంపై నిర్వహిస్తున్న
సదస్సులో అనేక ప్రయోజనాత్మకమైన అంశాలు వెలువడుతున్నాయని తెలిపారు. బాల
చెలిమి ముచ్చట్లు కార్యక్రమాన్ని ప్రింట్, ఎలక్ట్రానిక్ రూపాలలో సొసైటీ
ద్వారా అందించేందుకు సంసిద్ధమయ్యామని అన్నారు. బాలల సంపూర్ణ వికాసమే
లక్ష్యంగా బాలచెలిమి కార్యక్రమాలు కొనసాగుతాయని తెలిపారు.
కార్యక్రమంలో
డాక్టర్ వి.ఆర్.శర్మ, మంచి పుస్తకం సురేష్, తిరునగరి శ్రీనివాస్,
వేలాద్రి, వెంకటమ్మ, బాలరాజు, కె.వి. సూర్యప్రకాశ్, సి.హెచ్.పవన్,
శ్యాంసుందర్, మండల స్వామి, జయంతి, వెంకట నారాయణ తదితరులు పాల్గొన్నారు.
డైరెక్టర్ వీరేంద్ర శైని దర్శకత్వం హించిన 'కబీపాస్ - కబీ ఫెయిల్' హిందీ
షార్ట్ ఫిల్మ్ను ఈ సందర్భంగా ప్రదర్శించారు.