చిల్డ్రన్స్ ఎడ్యుకేషనల్ ఎకాడమీ బాలల కోసం ముద్రించిన తొలి పుస్తకం 'చెలిమి కథలు'. చింతామణి గారు రచించిన ఈ కథలు చిన్న తరగతుల లోని బడి పిల్లలకోసం ఉద్దేశించినప్పటికీ, పెద్ద వారికి కూడా ఉపయోగకరమే. నిజం చెప్పాలంటే వీటిని విజ్ఞాన గుళికలని చెప్పాలి. ప్రతి కథ వెనుక ఒక సందేశం, నీతి, సంస్కృతికి సంబంధించిన అంశం ఉన్నాయి. కాని ఈ నీతి బోధ బాహాటంగా ప్రచార ధోరణిలో ఉండదు. చదవటానికి ఆసక్తికరమైన రీతిలో విజ్ఞానానికి వినోదం జోడించి ఈ కథలను వ్రాశారు. మానవతా విలువలను కాపీ బుక్కు వరవడుల్లాగా కొట్టొచ్చినట్లు ప్రదర్శించక, చిన్న పిల్లలు వాళ్లంతట వాళ్లు తెలుసుకొనేలా సున్నితంగా ఈ కథల ద్వారా తెలియజేశారు. దీనినే ఆధునిక విద్యా బోధనా విధానంలో తనంతట తానుగా తెలుసుకొనే పద్ధతి (డిస్కవరీ మెథడ్) అంటారు.
ఈ కథలన్నీ సులభమైన భాషలో రచించి, పిల్లల మనోభావాలను విశ్లేషించి, నేర్పుగా చిత్రీకరించిన రచయిత అభినందనీయులు. వ్యంగ్యమైన విమర్శలతో మనసులను నొప్పించకుండా, ఉన్నత విలువలను ప్రతిపాదించటంలో ఆయన ఎంతో కౌశలం ప్రదర్శించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇలాంటి రచనలు సాంఘిక, నైతిక ప్రయోజనాలను సాధిస్తాయని నా విశ్వాసం.
--
ఐ.వి. చలపతి రావు
చెలిమి కథలు
రచన : చింతామణి
బొమ్మలు: పాతర్ల లక్ష్మణ్
పేజీలు : 82
వెల:12 రూ.
ప్రతులకు: చిల్డ్రన్స్ ఎడ్యుకేషనల్ ఎకాడమీ
'చంద్రం', 3-6-712/2, 11 వ వీధి
హిమాయత్నగర్, హైదరాబాద్ 500 029