గిరిజనులు తాము నివసించే ప్రాంతాల్లో దొరికే వాటితోనే రకరకాల వస్తువులను తయారు చేస్తారు. ఏ పనికైనా స్వయంగా తామే ఓ కొత్త పద్దతిని కనుగొంటారు. ఉత్తరాంధ్ర లోని చింతపల్లి, జి.కె.వీధి, పాడేరు, అరకు, హుకుంపేట ప్రాంతాలలో పర్యటించినప్పుడు మేము తెలుసుకొన్న ఆసక్తికరమైన విషయాలను ఇక్కడ తెలియజేస్తున్నాము.
దోనె
పశువులకు కావలసిన నీటిని అందించేందుకు దోనెలను గిరిజనులు ఉపయోగిస్తున్నారు. బాగా లావుగా ఉన్న కర్రను తీసుకొని మధ్యలో కలపను తొలగించి తొట్టెలాగ చేస్తారు. దీని పొడవుగు తగినట్లుగా, రెండు ప్రక్కల రెండు రాటలు వేసి, దానిపైన చెక్కిన ఈ కర్ర దోనెను ఉంచుతారు. దీనిలో నీళ్లు పోసి ఉంచుతారు. పశువులు నీటిని దీనిలో నుంచి తాగుతాయి.
పంట పొలాలకు దోనె
ఏజెన్సీ గ్రామాలలో పంట పొలాలకు నీరు పెట్టేందుకు కూడా దోనెను ఉపయోగించటం జరుగుతోంది. ముఖ్యంగా కూరగాయలను పెంచుతున్నప్పుడు దీనిని వాడుతున్నారు. పెద్ద కర్రను తీసుకొని, ఆ చివర నుంచి ఈ చివర వరకు మధ్యలో ఖాళీ వచ్చేలా చెక్కుతారు. ఒక వైపు ఎత్తు ఎక్కువగా ఉన్న రాటను ఉంచి, నీరు వెళ్లేందుకు అనువుగా మరొక వైపు ఎత్తు తక్కువగా ఉండేలా రాటను అమర్చుతారు. ఈ రాటల పైన దోనెను ఉంచుతారు. ఇపుడు నీటిని ఎత్తుగా ఉన్నవైపు పోస్తే నీరు క్రిందికి జారి పొలంలో అవసరమైన చోట పడుతుంది. ఇలా శారీరక శ్రమను తగ్గించుకొనేందుకు గిరిజనులు కనుగొన్న పద్ధతి ఇది.
- జి. ఉదయ్
0 comments:
Post a Comment