వాతావరణ మార్పులు భూమ్మీదే కాదు.. అంతరిక్షంలోనూ ఉన్నాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. విశ్వ ఆవిర్భావానికి కారణమని భావిస్తున్న మహావిస్ఫోటనం (బిగ్బ్యాంగ్) తర్వాత కాలంలో అంతరిక్ష వాతావరణంలోని ఉష్ణోగ్రతల్లో గణనీయమైన మార్పులు సంభవించాయని చెబుతున్నారు. బిగ్బ్యాంగ్ అనంతరం 100 కోట్ల ఏళ్ల తర్వాత రోదసిలోని వాయువుల ఉష్ణోగ్రత ఎనిమిదివేల డిగ్రీల సెల్సియస్ ఉండేదని, 350 కోట్ల ఏళ్ల తర్వాత ఇది 12వేల డిగ్రీల సెల్సియస్కు పెరిగిందని కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు గుర్తించారు. మహావిస్ఫోటనం తర్వాత అనేక కొత్త నక్షత్ర మండలాలు ఏర్పడ్డాయని.. వాటికి కేంద్రంగా ఉండే క్వాజర్లనే కృష్ణబిలాల నుంచి అతినీలలోహిత కిరణాలు పెద్ద ఎత్తున విడుదల కావటం వల్లనే ఉష్ణోగ్రతలు పెరిగి ఉంటాయని ముఖ్య శాస్త్రవేత్త జార్జ్బెకర్ తెలిపారు.