-
సామెతలు...
తెలుగు సాహిత్యంలో సామెతల కేమీ కొదవ లేదు. నగర జీవి మరిచిపోయినా ఈ సామెతలు పల్లె జనం నోళ్లలో నేటికీ నానుతూ ఉన్నాయి. జంతువులు, చెట్లు, వ్యవసాయం..... ఇలా ఎన్నో విషయాల గురించి విలువైన సమాచారాన్ని సామెతల్లో నిక్షిప్తం చేశారు మన పూర్వీకులు. అటువంటి సామెతల నుంచి కొన్నిటిని ఇక్కడ ఇస్తున్నాం.
- అంత ఉరిమీ ఇంతేనా కురిసింది
- అందని ద్రాక్ష పుల్లన
- అందరి కన్నా తాడిచెట్టు పెద్ద
- అందరికీ అన్నం పెట్టేవాడు రైతే
- అందితే తియ్యన అందకపోతే పుల్లన
- అగ్నికి వాయువు తోడైనట్టు
- అచ్చివచ్చిన భూమి అడుగైనా చాలు
- అడవిలో ఆంబోతై తినాలి
- అతివృష్టి అయినా అనావృష్టి అయినా ఆకలి బాధ తప్పదు
- అదను ఎరిగి సేద్యమూ పదును ఎరిగి పైరు
- అన్ని కార్తెలు తప్పినా హస్తకార్తె తప్పదు
- అన్నీ పండించిన వాడికే అన్నం కరువు
- అయితే ఆరిక కాకుంటే కంది
- అరవై ఆరు వంటలు ఆవు చంటిలోనే ఉన్నాయి
ఇటువంటి సామెతల గురించి మీ ఇంట్లో అమ్మానాన్నలనీ, అమ్మమ్మ, నానమ్మ, తాతయ్యలనీ అడగండి. ఆ సామెతల వెనుక దాగిన అర్థం ఏమిటో తెలుసుకోండి. మీరు తెలుసుకున్న సామెతల గురించి వివరంగా మాకు వ్రాసి మీ ఫోటోతో పాటుగా పంపండి. 'బాల చెలిమి'లో వాటిని ప్రచురిస్తాం. -
కథ అంటే పిల్లలు చెవి కోసుకొంటారు. కథల పట్ల పిల్లలకున్న ఈ ఆసక్తిని ఆసరాగా చేసుకొని ఎన్నో కథలు వచ్చాయి. వస్తూనే ఉన్నాయి. పిల్లలకు జానపద గా థలంటే వెర్రి వ్యామోహం అనీ, అలాంటి కథలే వాళ్ల మనసులను దోచుకొంటాయనీ ఒక అభిప్రాయం మనలో వేళ్లూనుకొని ఉంది. నిజానికి ఊహాలోకాల్లోకి, స్వప్న జగత్తులోకి ఎగిరి పోవడానికి రంగురంగుల రెక్కలు ఇచ్చే కథల అవసరం ఎంతైనా ఉంది. అలాగే చెలి మెలేసి, జీవితం అంటే ఇదీ, ఇలా వుంటుంది అని కుండ బద్దలు కొట్టినట్లుగా చెప్పే కథల అవసరం అంతకన్నా ఉంది. మారుతున్న విలువలు, వెల్లువలా ముంచెత్తుతున్న నూతన పరిణామాలు పిల్లల మనసుల్లో నాటుకోవాలంటే కథలే సాధనాలు. కథల ద్వారా మాత్రమే అది సాధ్యమవుతుందని మా విశ్వాసం. ప్రస్తుత యుగాన్ని రోదసీ యుగంగా మనం చెప్పుకోవచ్చు. ఈ యుగ లక్షణాల్లో సైన్స్ ఫాంటసీ ఒకటి. పిల్లల మనస్సుల్లో నాటుకొనేలా వినోద విజ్ఞానాలను మేళవించి కొన్ని సైన్స్ ఫాంటసీ కథలను తీసుకురావటానికి బాల చెలిమి సిద్ధమవుతోంది. పిల్లలను జోకొడుతూ, వాళ్లని నిద్ర పుచ్చడానికి కథలు చెప్పే సాంప్రదాయం మనకు అనాదిగా ఉంది. అలాగాక వాళ్ల గుండె తలుపు తట్టి వాళ్లను మేల్కొలపడానికి కథలు చెప్పే కొత్త అవసరం నేడు మన ముందు ఉంది. ఆ గురుతర బాధ్యతను 'బాల చెలిమి' తీసుకొంటోంది.
ఆహ్వానంమీరు పిల్లలైనా, పిల్లల మనసు తెలిసిన పెద్దలైనా, మీకిదే మా ఆహ్వానం. కథలు, కవితలు, గేయాలు, ఇక బాల చెలిమిలో ఉన్న ఏ ఇతర శీర్షిక కైనా మీరు మీ రచనలను పంపవచ్చు. మీ అభిప్రాయాలను, సూచనలను, సలహాలను మాకు తెలియ జేయండి.
సంప్రదించండి:
chelimihyd@gmail.com -
చాచా నెహ్రు పుట్టినరోజు - పిల్లల పండుగ
పువ్వులంటే ఆయనకు ఇష్టం!
పిల్లలంటే ఎంతో ఇష్టం!!
తీరికలేని సమయాల్లో కూడా, ఏకాస్త తీరిక దొరికినా పిల్లలతో ఆనందంగా గంతులేస్తూ ఆడుకునేవారు.
ఆయనే తొలి భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రూ.
''అపారమైన సంఖ్యలో గల పిల్లలు చూపులకు రకరకాలుగా కనిపిస్తారు. తలో భాష మాట్లాడతారు. రంగురంగుల బట్టలు వేసు కుంటారు. అయినా ఒకే మాదిరిగా ఉంటారు. ఒకేచోట చేరి ఆడుకుంటారు, పాడుకుంటారు, గంతులేస్తారు, పోట్లాడుకుంటారు. అయితే మళ్ళీ వెంటనే కలిసిపోతారు. రంగూ, కులం, భాషా భేదాలు వారికి తెలియవు. వీటి విషయం వారు ఆలోచించరు. నిజానికి పిల్లలు తమ తల్లిదండ్రులకంటే తెలివైనవారు.'' అని చాచా నెహ్రూ అంటారు. వారే మరొక సందర్భంలో ''పిల్లలతో ఉండటానికి ఇంకా చెప్పాలంటే వారితో ఆడుకోవటానికి ఎంతో ఇష్టపడతాను. కొద్ది క్షణాల పాటు నేను ముసలివాణ్ణనే విషయం మరిచిపోతాను'' అని అంటారు.
పండిట్ జవహర్లాల్నెహ్రూ కాశ్మీరు పండిత కుటుంబంలో జన్మించారు కాబట్టి వారిని పండిత్జీ, అని పిలుస్తారు. నెహ్రూను పిల్లలు ముద్దుగా చాచానెహ్రూ, జవహర్, జవహర్ భాయి అని పిలుచుకుంటారు.
-డాక్టర్ వెలగా వెంకటప్పయ్య
-
'స్టాంపుల సేకరణ' ఒకమంచిహాబీ, దేశవిదేశాల స్టాంపులు సేకరించటం వల్ల ఆయాదేశాల వన్య జీవులు, పక్షులు, కట్టాడాలు, నాయకులు, ప్రముఖ వ్యక్తులు, ఆచార వ్యవహారాలు మొదలైన విషయాల్ని గురించి తెలుస్తుంది. ఒక చిన్న స్టాంపు ఎన్నో విశేషాలు తెలియజేస్తుంది. వినోదంతో పాటు విజ్ఞానాన్ని పెంచే ఒక చక్కని హాబీ ఇది.
ప్రపంచంలో మొట్టమొదట ఒక ఇంగ్లీషు మహిళ 'స్టాంపుల సేకరణ' మొదలు పెట్టింది. ఆమె వద్ద దాదాపు 16,000 స్టాంపులుండేవి. ప్రపంచంలోని వివిధ దేశాల స్టాంపులు కొంటానని ఆమె 1814లో 'లండన్ టైమ్స్' అనే పత్రికలో ప్రకటన ఇచ్చింది.
స్టాంపు చరిత్ర:
19వ శతాబ్దం వరకు కూడా బ్రిటన్లో ఉత్తరాలు,పార్శిళ్ళు,పోస్టింగ్ అన్నీ అవకతవకలుగా ఉండేవి. పోస్టల్ రేట్లు ఒక తీరుగా ఉండేవికావు. ముందే డబ్బుకట్టి ఉత్తరాలు పంపేవారు. లేకపోతే ఉత్తరాలు అందుకున్నాకే వారు డబ్బు కట్టేవారు. రేట్లుకూడా దూరాన్ని బట్టి ఉండేవి. ఇదే సమయంలో 'రౌలండ్ హిల్' (1795-1879) అనే అతను ప్రతిపాదించిన రెండు సూచనలు బ్రిటిష్ ప్రభుత్వానికి నచ్చాయి. ఫలితంగా 1840 లో మొట్టమొదటి స్టాంపు వెలువడింది. దీన్ని మే 6, 1840 న ఉపయోగించడానికి వీలుగా మే 1వ తేదీన అమ్మకం ప్రారంభించారు. భారతదేశంలో 1854 లో విక్టోరియా మహారాణి మొట్టమొదటి సారిగా స్టాంపులు జారీచేసింది. వాటిపై విక్టోరియారాణి బొమ్మ ఉండేది.
అరుదైన, ఖరీదైన స్టాంపులు:
బ్రిటిష్లోని గయానాలో 1856 ఫిబ్రవరిలో విడుదలైన ఒక సెంట్ విలువగల స్టాంపు ప్రపంచంలోని ఒక అరుదైన, ఖరీదైన స్టాంపుగా గుర్తింపు పొందింది. ఇది విడుదలైన 17 సంవత్సరాలకు ఒక పాఠశాల బాలుడు ఈ స్టాంపును 10 షిల్లింగ్ (దాదాపు పదిరూపాయలకు) లకు స్టాంపులు సేకరించే వ్యక్తికి అమ్మాడు. ఈ స్టాంపు దేశ విదేశాలు తిరిగి ఇప్పుడు ఒక కోటి రూపాయల విలువ చేసే స్టాంపుగా అగ్రస్థానంలో ఉంది.
రకరకాల స్టాంపులు
స్టాంపులు రకరకాలుగా ప్రింటు చేస్తారు. జాతీయ నాయకులు, ప్రముఖ వ్యక్తులు, జంతువులు, పక్షులు, ఆటలు, పిల్లలు, ఆ దేశపు చారిత్రాత్మక ప్రదేశాలు, కట్టడాలు ఇలా. . . ఇవే గాక అంతర్జాతీయ బాలికల దినోత్సవం, ఒలింపిక్గేమ్స్, ఏషియన్గేమ్స్, బాలల దినోత్సవం ఇలా ప్రత్యేక సందర్భాలలో కూడా స్టాంపులు వెలువడతాయి.
స్టాంపులలో జరిగే పొరపాట్లు:
స్టాంపుల ప్రింటింగ్లో ఒకొక్కసారి పొరపాట్లు జరుగుతాయి. స్టాంపులలో ఒకదానిపైన ఇంకోటి ప్రింట్కావడం, రంగులు ప్రింట్ కాకపోవడం, సగమే ప్రింటవడం, మధ్య డిజైన్ తలకిందులుగా పడటం, రేటు తప్పుగా పడటం ఇలాంటివి జరుగు తుంటాయి. ఇలాంటి స్టాంపులు, కొన్ని లక్షల రూపాయల విలువ చేస్తాయి.
స్టాంపుల విశేషాలు:
స్టాంపుల సేకరణనే 'ఫిలాటెలీ' అని కూడా అంటారు. ఇది 'ఫిలాన్' అనే గ్రీకు పదం నుంచి పుట్టింది.
- ప్రపంచపు పోస్టల్ యూనియన్ సేకరణ అక్టోబర్ 9,1874లో జెనీవాలో స్థాపించబడింది. ప్రతీ దేశంలో విడుదలైన ప్రతి స్టాంపు 400 కాపీలు జెనీవాకు చేరతాయి. 1926 లో నాసిక్ (మహారాష్ట్ర)లో ఇండియా సెక్యూరిటీ ప్రెన్ స్థాపించబడింది. అప్పటి నుంచి మనదేశపు స్టాంపులు అందులో ప్రింటు అవుతున్నాయి.
స్విట్జర్లండ్, జర్మనీ, డచ్, అమెరికా, లండన్లలో పోస్టల్ మ్యూజియంలు ఉన్నాయి. -
అందమైన స్విట్జర్లెండును ఒక దుర్మార్గుడు పరిపాలించే వాడు ఆ దుర్మార్గుణ్ణి తొలగించి మంచి రాజ్యం ఏర్పరచాలని అనేకమంది దేశ భక్తులు ప్రయత్నించేవారు. అలాంటి దేశభక్తులలో ప్రముఖుడు విలియంటెల్.
విలియం టెల్ విలువిద్యలో నిపుణుడు. అతని కొక ముద్దుల చిన్నారి కొడుకుండేవాడు. టెల్ను పట్టుకోవాలని సైనికులు ఎంత ప్రయత్నించినా వారికి చిక్కలేదు. సైనికులు దేశమంతా వెదికారు. కనబడిన వారినల్లా అడిగారు. కొందరిని కొట్టారు. మరి కొందరిని ఖైదులో అనుకోకుండా వారికి టెల్ చిన్నారి కొడుకు తారస పడ్డాడు. ఆ బాబును తీసుకు పోయారు. ఆ బాబు సైనికాధికారి వద్ద ఉన్నట్లు దేశమంతటా చాటింపు వేయించారు. విలియం టెల్ వస్తే ఆ బాబును అప్పచెపుతామని కూడా ఆ చాటింపులో చెప్పించారు. విలియం టెల్ ధైర్యసాహసాలు కల వీరుడు. అందుచేత, ఏమాత్రం జంకకుండా సైనికుల వద్దకు వెళ్లాడు. అక్కడున్న బాబును ముద్దులాడాడు. ఆ దృశ్యం చూస్తున్న సైనికాధికారికి ఒక చిలిపి ఊహ వచ్చింది.
''టెల్ నేనొక చిన్న పరీక్ష పెడతాను. దానిలో నెగ్గితో నీ కొడుకును నీవు తీసుకు వెళ్ళవచ్చును'' అన్నాడా దుర్మార్గుడు ''ఏమిటా పరీక్ష?'' అని అడిగాడు టెల్.
''నీవు విలువిద్యలో గొప్పవాడివి కదా! అందులోనే నీకు పరీక్ష!'' అన్నాడు. ''విలువిద్యలో అయితే సరే! ఇంతకీ ఏమిటా పరీక్ష!'' అన్నాడు టెల్.
''ఏభై అడుగుల దూరంనుంచి ఏపిల్ పండును బాణం తో కొట్టాలి'' అని వికటంగా నవ్వాడా నియంత.
''ఇంతేనా! దీనికి నవ్వుతా వెందుకు?''అని చిరాకు పడ్డాడు టెల్.
''కొంచెం గమ్మత్తుంది . . . . ఆ ఏపిల్ పండు నీ కొడుకు తల మీద పెడతాము. అప్పుడు కొట్టాలి'' అని మళ్లీ నవ్వాడు.
విలియం టెల్ ఒక నిమిషం ఆలోచించి ''సరే!'' అన్నాడు.
బాబును ఒక చోట నించోబెట్టి అతని తలపై యాపిల్ పండుంచారు. సరిగ్గా ఏభై అడుగులు కొలిచారు. అక్కడ నించుని బాణం వదలాలన్నమాట.
విలియం టెల్ కొడుకువంక చూశాడు. ఒకసారి మధ్య ఉన్న దూరం ఎంతో చూసుకున్నాడు. గట్టిగా ఊపిరిపీల్చి వదిలాడు. తన అంబుల పొదలో నుంచి మంచి తిన్నని బాణాలు రెండు ఎంచుకున్నాడు.
ఒక బాణం విల్లుకు తగిలించి గురి చూశాడు. వింటితాడు వెనక్కి లాగి బాణం వదిలాడు. బాణం రయ్యిన వెళ్ళి ఏపిల్ పండును రెండు ముక్కలు చేసింది. అక్కడున్న వాళ్ళంతా ఆనందంతో చప్పట్లు కొట్టారు.
టెల్ తన కొడుకు దగ్గరకు పరుగెత్తు కెళ్లాడు. ఎత్తుకుని ముద్దాడాడు. నెమ్మదిగా నడిపించి పిల్లవాణ్ణి గుర్రం వద్దకు తీసుకు వచ్చాడు.
అప్పుడా దుర్మార్గ సైనిక నియంత ''సరే! ఒక్క బాణంతో ఏపిల్ను కొట్టగలగిన నీవు రెండు బాణాలెందుకు తీసుకున్నావు'' అని అడిగాడు.
''ఒక బాణం గురి తప్పి బాబుకు చిన్న దెబ్బ తగిలినా రెండో బాణం నీ గుండెల్లోకి దూసుకుపోయేది'' అని సమాధానం చెప్పాడు.
''పట్టుకోండి. . . . పట్టుకోండి'' అని కేకలు వినబడిన మరుక్షణం కొడుకును తీసుకుని గుర్రం ఎక్కి మాయమయ్యాడు విలియం టెల్. (తరవాత స్విట్జర్లెండుకు స్వాతంత్య్రం వచ్చింది) -
ప్రయోగం
రవి: సార్! మీరు దేన్నీగురించి ప్రయోగం చేస్తున్నారు.
సైంటిస్ట్: ఏ వస్తువుపైన పోసినా వెంటనే ఆ వస్తువు కరిగిపోయే రసాయనాన్ని గురించి బాబు!
రవి: మరయితే ఆ రసాయనాన్ని దేనిలో నిలువ చేస్తారు.......?
జాబిల్లి రావే...
ఏడుస్తున్న పాపకు తల్లి జోలపాట పాడుతుంది.
''చందమామ రావే
జాబిల్లి రావే....''
పాఠాలు చదువుతూ పెద్దపాప ఆ పాటవిని 'చంద్రుడెలా వస్తాడమ్మా! ఆయనెప్పుడూ భూమిచుట్టూ తిరుగుతాడు కదా!
--- కలలెలా వస్తాయి
పాప: అమ్మా! నువ్వు రోజూ తలుపుకు గడియ వేస్తావా?
అమ్మ: అవును ఏం.....?
పాప: అలావేస్తే నాకు కలలెలా వస్తాయి.
చరిత్రవేణు: చరిత్రలో నాకు అరవై మార్కు లొచ్చాయి తాతయ్య
తాత: హు! మారోజుల్లో అయితే తొంభై మార్కులొచ్చేవి.
వేణు: అప్పట్లో చరిత్ర తక్కువగా ఉండేది మరి.
మీ అన్నయ్యేడి?
స్కూలుకు ఆలస్యంగా వచ్చిన వేణుతో-
టీచర్: వేణూ! ఆలస్యమెందుకయింది;
వేణు: వర్షం వచ్చింది కదూ! రోడ్డుపైన ఉండే కుండీలలో పడతానేమోనని మా అన్నయ్య తీసుకొచ్చాడు.
టీచర్: ఇంతకీ మీ అన్నయ్యేడి?
వేణు: కుండీలో పడిపోయాడు.
మనమంతా ఏమౌతామో?
విచారంగా స్కూలు మెట్లపై కూర్చున్న సురేష్ను చూసి
అశోక్: ఏమిట్రా అలా బాధగా కూర్చున్నావ్
సురేష్: ఇంకో 6 మిలియన్ సంవత్పరాలకు భూమి నశించి పోతుందని టీచర్ చెప్పింది కదా! మనమంతా ఏమౌతామో అని!
చిన్న మీటింగ్కొడుకు: నాన్నా! మనమిప్పుడు చిన్న మీటింగ్కు వెళ్తున్నాం....?
తండ్రి: చిన్న మీటింగేమిట్రా....?
కొడుకు:మా టీచర్-నీవు-నేను, మన ముగ్గురి మీటింగే
తండ్రి: అదేం మీటింగ్రా?
కొడుకు: మరేమో- నిన్ననే మాకు రిపోర్టులు ఇచ్చారు కదా! -
కాంచీపురంలో 'భుజంగం' అనే తెలివైన దొంగ ఉండేవాడు. అతను తెలివిని ఉపయోగించి యుక్తిగా దొంగతనాలు చేస్తూ ఉండేవాడు. ఒకరోజు భుజంగం దొంగతనానికి బయలు దేరాడు. ఆ ఊరిలోని షావుకారు ఇంటి వెనుకకు వెళ్ళి మెల్లిగా గోడ దూకాడు. ఒక్కసారిగా మంచి మిఠాయిల వాసన వచ్చింది. సహజంగా భోజన ప్రియుడైన భుజంగానికి, నగలూ, డబ్బూ బదులు మిఠాయిలు దొంగిలించాలనే కోరిక కలిగింది. ఇంటి వెనక గుమ్మంలోంచి లోపలికి వెళ్ళాడు. లోపల వంటవాడు లడ్డూలు చేస్తున్నాడు. భుజంగానికి వెంటనే ఓ ఉపాయం తట్టింది. వంటవాడి దగ్గరకొచ్చి-
''మీకు పనిలో సాయపడమని షావుకారు నన్ను పంపించాడయ్యా'' అన్నాడు వినయంగా. షావుకారు తనకు సహాయంగా ఒక మనిషిని పంపినందుకు సంతోషిస్తూ వంటవాడు-
''చూడు! లడ్డూలన్నీ ఈ బుట్టలో వెయ్యి! అలాగే పొయ్యిలో బూడిదని ఈ బుట్టలో వేసి బయట పారేసిరా!'' అంటూ రెండు బుట్టల్నీ అక్కడ పెట్టి బయటికి వెళ్ళాడు. భుజంగం 'ఇదే మంచి సమయం' అనుకుని, లడ్డూలన్నీ ఓ బుట్టలో పేర్చి, వాటిపైన కాగితం పెట్టి, కాగితం పైన కాస్త బూడిదను పోశాడు. అదే విధంగా ఇంకో బుట్టనిండా బూడిద నింపి, పైన కొన్ని లడ్డూలు పేర్చాడు. ఇప్పుడు లడ్డూలున్న బుట్ట బూడిద బుట్టలా, బూడిదబుట్ట లడ్డూలున్న బుట్టలా కన్పిస్తోంది. అటూ ఇటూ చూసి వంటవాణ్ణి పిలిచి-
''మర్చిపోయా! షావుకారు ఓ తేనెసీసా ఇమ్మన్నాడు. వెళ్తూ షావుకారుకు ఇచ్చి వెళ్తా'' అన్నాడు.
వంటవాడు ఇచ్చిన తేనెసీసాను బట్టపై పెట్టుకుని, బుట్టను ఎత్తుకుని బయటికి బయలుదేరాడు.
భుజంగం చేసేదంతా 'మధు' అనే కుర్రాడు చూడనే చూశాడు. మధు మెల్లిగా భుజంగం వెనకే బయలుదేరాడు. కొద్దిదూరం వెళ్ళిన తర్వాత-
''బాబుగారు! నేను ఆ బుట్టను మోస్తాను. ఓ రూపాయి ఇప్పించండి. పొద్దుటి నుంచీ ఏమీ తిన్లేదు'' అన్నాడు దీనంగా ముఖంపెట్టి. భుజంగానికి జాలికలిగి 'సరే' అంటూ బుట్టను మధు తలపై పెట్టాడు. ఇద్దరూ ఒకరిపక్క ఒకరు నడవసాగారు.
'బుట్టలో ఏమున్నాయండి?' మధు అడిగాడు.
'తేనెగుడ్లు' సమాధాన మిచ్చాడు భుజంగం.
'తేనెగుడ్లా!' ఆవేంటిబాబూ! అన్నాడు తెలియనట్లు ముఖంపెట్టి.
'వెధవా! తేనెగుడ్లు అంటే తెలీదా! ఆగుడ్లు పిల్లలవుతాయి' అన్నాడు చికాకుగా.
'మరి సీసాలో ఏముందండి?' మళ్ళీ ప్రశ్నించాడు.
'విషం' అన్నాడు కోపంగా.
మధు మౌనంగా కొద్దిదూరం నడిచి హఠాత్తుగా పరుగెత్తడం మొదలెట్టాడు. అది చూసి భుజంగం-
''ఒరేయ్! పారిపోవాలని ప్రయత్నిస్తే ఏంచేస్తానో చూడు' అని అరిచాడు.
మధు పరుగెడుతూ వెనక్కి తిరిగి
''నేను టీకొట్టు దగ్గరుంటా. మీరక్కడికిరండి అన్నాడు.
''అక్కడే ఆగకపోయావో నాచేతిలో చచ్చావన్నమాటే జాగ్రత్త'' అన్నాడు భుజంగం.
మధు తొందర తొందరగా పరుగెత్తి రోడ్డు పక్కనే ఉన్న చెట్ల గుబుర్లోకి వెళ్ళి, కాగితంపైన ఉన్న బూడిదను కింద పారబోసి లడ్డూలన్నీ కాగితంపైన వేశాడు. తేనె సీసాను మాత్రం ఖాళీ బుట్టలో పెట్టుకుని టీకొట్టు దగ్గరికి వచ్చి బుట్ట నేలపై పెట్టి ఏడవటం మొదలెట్టాడు. అదిచూసి అందరూ గుమికూడారు. మధు ఏడుస్తూనే-
''బుట్టలో తేనెగుడ్లు ఉండేవి. అవి ఒక్కొక్కటి తేనెటీగలై ఎగిరిపోయాయి. మా అయ్యగారికి ఈ విషయం తెలిస్తే నన్ను చంపేస్తాడు.'' అన్నాడు.
''వీడికేమైనా పిచ్చిపట్టిందా? తేనెగుడ్లు ఉండటమేంటి?'' అన్నారు అందరు. కొద్ది సేపటికి భుజంగం అక్కడికి రానే వచ్చాడు. భుజంగాన్ని చూసి మధు ఇంకా గట్టిగా ఏడుస్తూ - 'అయ్యగారూ! ఈ బుట్టలో తేనెగుడ్లు ఉన్నాయని చెప్పారా లేదా?'' అన్నాడు. ''అవును చెప్పాను'' అన్నాడు భుజంగం.
''నేను ఆ గుడ్లు పట్టుకుని వస్తుంటే అవి అన్నీ తేనెటీగలై ఎగిరిపోయాయి'' అన్నాడు.
భుజంగం మధు తెలివికి ఆశ్చర్యపోయాడు. బుట్టలో తేనెసీసా మాత్రం ఉంది. అదైనా మిగిలింది కదా అనుకుని సీసా తీసుకునేందుకు భుజంగం ముందుకు వంగాడు. అదే క్షణంలో మధు ఆ సీసా అందుకుని-''ఇంటికెళ్ళిన తర్వాత మీరు నన్ను ఎలాగూ చావబాదుతారు. అక్కడ చచ్చే బదులు ఈ విషం తాగి ఇక్కడే చస్తాను'' అంటూ సీసా లోని తేనె అంతా గడగడా తాగేశాడు. అది చూసి భుజంగానికి ఒక్కసారిగా తల తిరిగి పోయింది. -
పూర్వం ఒక హరిదాసు నవాబు దర్శనం చేసుకుని, రసవత్తరంగా హరికథ చెప్పి నవాబును మెప్పించాడు. నవాబు వెంటనే హరిదాసు వంటినిండా మల్లెమాలలు చుట్టి ఏనుగుపై ఊరేగించి వెయ్యి వరహాలు బహుమానం ఇవ్వమని ఆజ్ఞాపించాడు. భటులు దాసును పక్క గది లోకి తీసుకువెళ్ళి మల్లెమాలలు వంటినిండా చుట్టారు. కాని దాసుకు బట్టతల ఉండటం వలన తలమీద మల్లెమాలలు జారి పోయాయి. భటులు రాజు వద్దకు వచ్చి ప్రభువు చెప్పినట్లు చేయలేకపోతున్నామని కారణం వివరించారు. తన మాటకు ఎదురు ఉండటం నవాబు సహించలేకపోయాడు. ''జారి పోతున్నాయి అనే సాకుతో బట్టతల మీద మల్లెమాలలు చుట్టడం మానేస్తారా? దాసుగారి గుండు మీద మేకులు కొట్టి మాలలు చుట్ట బెట్టండి.'' అని కోపంగా అన్నాడు. ఈ మాటలు విన్న దాసుగారు కిటికీలో నుంచి దూకి పారిపోయాడు. తల మీద మేకు కొట్టించుకోవడం అంటే ఎంతటి ధైర్యవంతుడికైనా సాధ్యమయ్యే పనికాదు. నేను చెప్పే గమ్మత్తు అచ్చంగా ఇటువంటిదికాదు.
తలమీద 10 సెం.మీ. మందం కలిగిన దేవదారు కర్రముక్క ఉంచి, ఆ కర్రలోకి 8 సెం.మీ. పొడవు ఉన్న మేకును సుత్తితో కొట్టి దిగగొట్టాలి. అమ్మో! ఆ అదురుకి బుర్ర ఉంటుందా అసలు? బుర్రకు అదురు తగల కుండా కర్ర దిమ్మలోకి మేకును దిగ్గొట్టే సులభ పద్ధతి ఒకటి ఉంది.
చాలా లావుగా ఉన్న గ్రంథాలు మూడు నాలుగు తెచ్చి తలమీద దొంతరగా పెట్టి, వాటి మీద కర్ర దిమ్మ పెట్టి అప్పుడు ఆ కర్రలోకి మేకు కొడితే అతి సులభంగా తలకి అదురు తగలకుండా పని జరిగిపోతుంది. దీనికి కారణం ఏమిటో తెలుసా?
వస్తువులన్నింటికీ ఒక విధమైన 'జడత్వం' ఉంది. అది ఎటువంటిదంటే స్థిరంగా ఉన్న వస్తువు కదలదు. అంతేకాదు. కదులుతున్న వస్తువు ఆగదు. ఈ సంగతి మొట్టమొదటిసారిగా ఐజాక్ న్యూటన్ ఊహించి తన గతిశాస్త్ర సూత్రాలలో ఒకటిగా పేర్కొన్నాడు. వస్తువు బరువు ఎక్కువైన కొద్దీ ఈ జడత్వం కూడా ఎక్కువ అవుతుంది. లావుపాటి పుస్తకాలకున్న జడత్వం వల్ల సుత్తి దెబ్బ మేకు మీద పడినపుడు మేకు కదులుతుందే గాని కింద ఉన్న పుస్తకాలు అంతగా కదలవు. కనుక తలకి అదురు అంతగా ఉండదు. అదీ సంగతి! -
ఒక అడవిలో ఒక సింహం బాగా తిని చెట్టుకింద పడుకొంది. అటుగా వెళ్తున్న ఒక దోమ పడుకున్న సింహాన్ని చూసింది.అడవిలో జంతువులన్నీ సింహాన్ని రాజుగా గౌరవిస్తాయి కదా! ఈ సింహం గొప్ప ఏమిటి? ఇది నా కంటే గొప్పదా? దీని గొప్ప తనమేమిటో చూస్తా?'' అనుకొంటూ సింహం చుట్టూ 'జుయ్' మని శబ్దం చేస్తూ తిరిగింది. దోమ చేసిన శబ్దానికి సింహానికి మెళుకువ వచ్చింది. సింహం నిద్ర చెడిపోయినందుకు దోమ సంతోషిస్తూ సింహం ముందు వాలి-
''మృగరాజా!మృగరాజా!! అడవిలో నీవే బలమైనదానివని అందరూ అంటుంటారు కదా! నేను నీకంటె గొప్పదానిని తెలుసా?'' అంది దోమ సగర్వంగా-
దోమ మాటలకు సింహానికి చాలా కోపం వచ్చింది. వెంటనే అది దోమను చంపబోయింది. కానీ దోమ ఠక్కున తప్పించుకుని పైకి ఎగిరి-
''చూశావా! నీవు నన్ను పట్టుకోలేక పోయావు'' అంది నవ్వుతూ - సింహానికి కోపం మరీ ఎక్కువైంది. దోమ, సింహం చుట్టూ తిరుగుతూ సింహం ముక్కుపై వాలింది. సింహం తన పంజాతో ఒక్కటి కొట్టింది. దోమ 'జయ్' మంటూ గాలిలోకి ఎగిరింది. పంజా తన ముక్కుపైనే పడి రక్తం చిమ్మింది. ఈ విధంగా దోమ, సింహం కన్నుపై, చెవులపై వాలుతూ సింహాన్ని బాధించసాగింది. అలా గర్వంతో సింహాన్ని బాధిస్తున్న దోమ హఠాత్తుగా పక్కనే చెట్టుకి ఉన్న సాలె గూడులో చిక్కుకు పోయింది. సాలె పురుగు తన గూడులో చిక్కుకుపోయిన దోమను లటుక్కున మింగింది.
'అన్నింటికంటే నేనే గొప్పదానిననుకొని గర్వ పడ్డాను. నాకంటే గొప్పవి కూడా ఉన్నాయని ఇప్పుడు తెలిసింది. నాగర్వమే నా చావుకు కారణమైంది'' అనుకుంటూ దోమ ప్రాణం విడిచింది. -
The world of children finds in Children’s Educational Academy an institution dedicated to the all-round development of children, by complimenting their curricular activities and making their life merrier. Parents come to see in Children’s Educational Academy an assured future for their wards and productive way of spending their spare time.
It is now widely accepted fact that schools and academics can not fully draw out a child’s talents or satisfy his or her intelligence. For that an all round training is required.
Children’s Educational Academy (CEA) is a resource centre supporting various educational institutions for holding workshops and training programmes by providing material help, information and guidance in the field of literature, Fine Arts, Games and Sports to enrich their knowledge with the developments in educational and related fields. CEA also is into spreading awareness related to Consumer Rights, Environmental Education, Right to Information and Human Rights Education. CEA strives to increase awareness and knowledge of key target groups (school children, youth, woman, local communities, and voluntary organizations etc) about various aspects of Children’s Rights.
Keeping in view the growing demand for new and dynamic children’s writing Children’s Educational Academy introduced the unique concept of publishing books and magazines in Telugu. “Bala Chelimi” a Monthly Magazine published by CEA initiates a process whereby more and more children are exposed to international trends in Literature, Science and Technology, Arts and an interest in general knowledge and Current Affairs.