-
బ్రాండెడ్ సెల్ఫోన్లతో అయినా అన్బ్రాండెడ్ మొబైల్తో అయినా 5 నిమిషాలు మాట్లాడినా చెవి దగ్గర వేడెక్కితే , ఫోన్ నుంచి అధిక రేడియేషన్ వెలువడటమే కారణం. అందుకే సెల్ఫోన్ కొనేటప్పుడు ఫీచర్లతో పాటు రేడియేషన్ ఎంత వెలువరిస్తుందో కూడా తెలుసుకోవాలి.
మొబైల్ ఫోన్ రేడియో తరంగాలను ప్రసారం చేయడంతో పాటు గ్రహిస్తుంది కూడా. అందుకే ఫోన్ నిర్దిష్ట శోషణ సూచి (ఎస్ఏఆర్) అంటే రేడియో తరంగాల నుంచి ఎంత శక్తిని మన శరీరం గ్రహిస్తుందో కూడా తెలుసుకోవాలి.
'కిలోగ్రాముకు 2 వాట్ల కంటే తక్కువ రేడియేషన్ వెలువరించేవి మంచి ఫోన్లు' అని స్వతంత్ర సాంకేతిక సంస్థ ఇంటర్నేషనల్ కమిషన్ ఆన్ నాన్ అయొనైజింగ్ రేడియేషన్ ప్రొటెక్షన్ (ఐసీఎన్ఐఆర్పీ) తేల్చింది. 10 గ్రాముల కణజాలాన్ని సగటుగా తీసుకుని లెక్కించారు. దీనినే అంతర్జాతీయంగా అనుసరిస్తున్నారు. అయితే చెవి దగ్గర ఫోన్ ఉంచి మాట్లాడేందుకు ఎస్ఎఆర్ 1.29 వాట్లు/కిలోగ్రామ్ ఉండాలని ఐసీఎన్ఐఆర్పీ నిర్దేశించింది.
ఎస్ఏఆర్ పరిమాణం నిర్ధరించిన అత్యధిక విలువ కంటే తక్కువే ఉండాలి. ఎందుకంటే నెట్వర్క్ను చేరేందుకు మాత్రమే సెల్ఫోన్ తన బ్యాటరీ నుంచి శక్తిని వినియోగించాల్సి ఉంటుంది. నెట్వర్క్ బేస్ స్టేషన్ నుంచి మనం ఎంత దూరాన ఉన్నాం అనే అంశంపై సెల్ఫోన్ శక్తి వినియోగం ఆధారపడుతుంది.
ఈ జాగ్రత్తలు పాటిస్తే సరి * ఎస్ఏఆర్ తక్కువగా ఉండే సెల్ఫోన్లు కొనాలి. * సాధ్యమైన చోట్ల ఫోన్ చెవి దగ్గరకు చేర్చకుండా, స్పీకర్ ఆన్ చేసి మాట్లాడాలి * హెడ్సెట్ (ఇయర్ఫోన్లు) వినియోగించినా సెల్ఫోన్ రేడియేషన్ ప్రభావం పూర్తిగా పోదు * అవసరమైన కాల్స్ మాత్రమే మాట్లాడి, మిగిలిన వాటికి టెక్ట్స్ మెసేజ్ (ఎస్ఎంఎస్) వినియోగించాలి * సెల్ఫోన్ తీసుకెళ్లేటప్పుడు మన శరీరానికి కనీసం అంగుళం దూరాన ఉండేలా చూసుకోవాలి * నెట్వర్క్ బలహీనంగా ఉన్నచోట, సిగ్నల్ కోసం ఫోన్లు అత్యధిక రేడియేషన్ను వెలువరించే అవకాశముంది. అలాంటి ప్రదేశాల్లో ఫోన్ వినియోగం తగ్గించాలి * నిద్రించేటప్పుడు తలగడ వద్ద ఫోన్ ఆన్చేసి ఉంచవద్దు. -
''రాణక్కా! రోజూ ఒక మంచిపనయినా చెయ్యాలని మా టీచరు చెప్పారు.'' అన్నాను పాలుతాగుతూ.
''ఒక ముసలతన్ని రోడ్డు దాటించిన పిల్లాడి కథను మీ టీచర్ ముందుగా చెప్పారు కదా!'' అని అడిగింది రాణక్క. అక్కకి పాలలో మీగడ గొంతు దిగదు. అందుకే పాలమీద తేలిన మీగడను తీసేయటంలో మునిగి ఉంది.
''నీకెలా తెలుసు?'' ఆశ్చర్యంగా అడిగాను.
''మా టీచర్ కూడా చెప్పారులే. ఒక మంచి పని చేసి, దాని గురించి రాసి చూపించ మన్నారు.''
''అయితే ఈ రోజే ఇప్పుడే, మొదలు పెడదామా'' పాలు తాగేసి ఉత్సాహంగా అన్నాను.
'ఊ' అంటూ ఒప్పుకుంది రాణక్క.
''నేను కూడా మంచి పనులు చేస్తాను'' అంటూ చిట్టి తమ్ముడు రాము తయారయ్యాడు.
అయ్యో! వీడి ముందు చెప్పకుండా ఉంటే బాగుండేది! ఇప్పుడు తుమ్మబంకలా పట్టుకుని వదలడు. మనం ఎక్కడికెళితే అక్కడికి తోక లాగా వస్తాడు. మనం ఏది చెయ్యబోతే అది తనూ చెయ్యాలంటాడు'' నాకు చాలా కోపం వచ్చేసింది.
రాము రెండవ తరగతి చదువుతున్నాడు.'' వాళ్ళ టీచరు మంచి పనులు చెయ్యమని చెప్పలేదాయె. వాడేమో చిన్నవాడు, మేమేమొ పెద్దవాళ్ళం. రోడ్డును మా అంతట మేము దాటగలం. వాడు దాటలేడు. మరి రోడ్డును దాటడానికి ముసలివాళ్ళకు ఎలా సహాయ పడగలడు?''
ఇదంతా వివరించి నచ్చచెప్పాలని చూశాం. కాని వింటే కదా! మంచిగా చెబితే ఎప్పుడూ అర్థం చేసుకోడు. మా వెంటనే తిరగటం మొదలు పెట్టాడు. ఎవరికైనా రోడ్డు దాటటంలో సహాయ పడటంతో మంచి పనులు మొదలు పెడదామనుకున్నాం. కాని ఎంత సేపున్నా రోడ్డు దాటడానికి ఒక ముసలావిడగానీ, ముసలాయన గానీ రాలేదు. విసుగొచ్చి ఇంటికి వెళదామనుకుంటుండగా ఒక పెద్ద మనిషి కనపడ్డాడు. మరీ అంత ముసలాయన కాదు. రోడ్డు దాటాలను కున్నట్లే ఉన్నాడు.
మేము పరిగెత్తుకుంటూ అతని దగ్గరికి వెళ్ళాం. రావద్దని చెప్పేలోగా రాము మా వెనక పడి రానే వచ్చాడు. అతని దగ్గరకు వెళ్ళి నిలుచోగానే మా వైపు తేరిపార చూడసాగాడు. రోడ్డు దాటించమని అడగటానికి తటపటాయిస్తున్నాడేమో అనిపించింది.
''రోడ్డు దాటబోతున్నారా?'' రాణి అడిగింది.
'ఊ' అని విసురుగా బదులిచ్చి, మరో మాట మాట్లాడకుండా రాము చెయ్యీ గభాలున దొరకపుచ్చుకుని రోడ్డు దాటసాగాడు. రాణి మా వెనుకనే వస్తోంది. మేము అతనికి సహాయ పడేదిపోయి అతనే మాకు సహాయపడుతున్నాడని నాకు అర్థమైంది. నేను రాణివైపు చూశాను. అక్క నవ్వుతోంది. నేను కూడా నవ్వు ఆపుకోలేకపోయాను. ఇద్దరం ఒక్కసారే పెద్దగా నవ్వేశాం. ఏం జరుగుతుందో అతను గ్రహించే లోపునే మా చేతులను వదిలించుకుని ఇంటికేసి పరుగుతీశాం. దారిపొడుగునా నవ్వుతూనే ఉన్నాం. అలా నవ్వుతూ మా ఇంటి తోటలోని కొలను దగ్గరికి వచ్చాం.
''నీటిలో పడిన పురుగుల్ని రక్షిద్దామా'' రాణి అడిగింది. 'ఇదయినా మంచి పనే కదా!' అని మునుగుతున్న పురుగుల కోసం వెదికా. కాని ఆ క్షణంలో నీటిలో మునుగుతున్న పురుగులేవి లేవు. రాము కూడా మాతో చేరి వెదకసాగాడు. వాడు నీటి మీదికి మరీ వంగి ఉండటం చూసి -
''ఓరే రాము! నీటిలో పడతావు. నువ్వు ఇంట్లోకి పో'' అని కసురుకున్నాను.
రాము కొంచెం వెనక్కి జరిగాడు కాని ఇంట్లోకి వెళ్ళలేదు. అక్కని పురుగుల కోసం వెతకమని చెప్పి నేను రాము చెయ్యి పట్టుకుని ఇంట్లోకి ఈడ్చుకు వెళ్ళాను. వాడు ఎంతగా తన్నుకున్నా, అరుస్తున్నా లక్ష్యపెట్టలేదు. అమ్మ దగ్గరికి తీసికెళ్ళి తమ్ముడు విసిగిస్తున్నాడని చెప్పాను. కాని అమ్మ తమ్ముడిని ఏమీ అనకుండా నన్నే కోప్పడింది.
నేను అలిగి ఒక మూల కూర్చున్నాను. రాము నన్ను మాట్లాడించాలని, బ్రతిమాలు కోవాలని చాలా ప్రయత్నాలు చేశాడు. నేను మాత్రం మూతి బిగించి, ముఖం ముడుచుకుని అలాగే కూర్చున్నాను.
అంతలోనే తోటలోంచి అక్క అరుపులు వినపడ్డాయి. ''మణీ! తొందరగా రావే. నీటిలో రెండు చీమలు పడ్డాయి.''
నా అలకా, విచారం మరిచిపోయి తోటలోకి పరిగెత్తాను. ఇద్దరం కొలను పక్కకు చేరాం. నీటిలో రెండు ఎర్ర చీమలు పడి కొట్టు కుంటున్నాయి. నేను రెండు ఎండిన ఆకులు ఏరి ఒకటి రాణికి ఇచ్చాను. అక్క చీమ పక్కగా ఆకును ముంచి మెల్లిగా పైకి తీసింది. చీమ ఆ ఆకును పట్టుకుని బయటకు వచ్చింది. నేను కూడా అలాగే చేశాను. ఇద్దరం ఆకులను నేలమీద పెట్టాం. నీటిలో తడిసిన చీమలు నీళ్ళు వదిలించుకుని, మీసాలు సవరించుకుంటుంటే ఊపిరి తీసుకోవటం కూడా మరిచి చూడసాగాం. ఒకటి రెండు నిమిషాల తర్వాత చీమలు ఒళ్ళు సవరించుకుని కదిలాయి.
''చూడండి! నేను కూడా ఒక చీమను రక్షించాను.'' అంటూ రాము అరిచాడు. వాడి చేతిలో ఉన్న ఆకు మీద తడిసిన చీమ ఒకటి నీళ్ళు వదిలించుకుంటూంది.
''ముందు నువ్వు చీమని నీళ్ళల్లో పడేశావు కదూ?'' రాణి కోపంగా అడిగింది.
రాము ఏం మాట్లడలేదు కానీ వాడే చీమని నీటిలో పడేసి రక్షించాడని తెలిసిపోతోంది.
''చీమని రక్షించి మంచి పనిచేశావు. కాని ముందుగా దానిని నీటిలో పడెయ్యటం వల్ల దానికెంతో బాధ కలిగించావు. కాబట్టి నువ్వు చేసిన మంచి పనికి ఉపయోగం లేదు.'' అని రాణక్క చెప్పింది.
ఒక నిమిషం పాటు రాము తలవంచుకొని ఏమి మాట్లాడలేదు. తరువాత తలెత్తి మా వైపు సూటిగా చూస్తూ ''మీ మాటేమిటి? మీరు నన్ను ఎన్నోసార్లు బాధ పెట్టారు. నన్ను మీతో ఆడుకోనివ్వరు. ఎప్పుడూ తిడుతుంటారు. మీరు చేసే మంచి పనుల వల్ల ఏమైనా ఉపయోగముంటుందా?' అని అన్నాడు.
మేమిద్దరం ఒకరి ముఖాలు ఒకరం చూసుకున్నాం. ఇక నుంచి రాముతో మంచిగా ఉండాలనుకున్నాం.
''ఈ చీమల్ని ఇక్కడే వదిలేస్తే ఎవరైనా తొక్కేస్తారు. వీటిని గోడ దగ్గర వదిలిపెడదామా?'' అన్నాను.
రాణి తలూపి తన ఆకును పట్టుకుంది. ముగ్గురం ఆకుల్ని పట్టుకొని గోడ దగ్గరకు తీసుకెళ్ళి వదిలిపెట్టాం. మూడు చీమలు వరుసలో గోడ ఎక్కుతుంటే ముగ్గురం చూడసాగాం.
--- అనిల్ ఎక్బోటే
అనువాదం:సురేష్
(బాల రచయితల వర్క్షాప్ సౌజన్యంతో) -
అది ఒక చిన్న ఊరు! ఆ ఊరి పేరు కొండపాక!!
ఆ ఊర్లో రాజయ్య అనే ఒక బాలుడు ఉండేవాడు. ఆ ఊరికి చాలా దూరంలో ఒక అడవి ఉంది. ఊర్లోని చాలామంది అడవికి వెళ్ళి పళ్ళు, కట్టెలు తెచ్చుకునేవారు. ఒకరోజు రాజయ్య అడవికి వెళ్ళి పండ్లు తెచ్చుకుందామని ఒక సంచి తీసుకుని అడవికి బయలుదేరాడు. పండ్లు అన్నీ చెట్ల చివరన ఉండటం వలన కోసుకోవటానికి వీలుకాలేదు. అలా తిరిగి తిరిగి అలసిపోయి ఒకచెట్టు కిందికి వచ్చి సంచీ పక్కన పెట్టుకుని పడుకున్నాడు. కాసేపటికి బాగా నిద్రపట్టింది. కొంతసేపటికి కోతులగుంపు ఒకటి అటుగా వెళ్తూ చెట్టుకింద పడుకున్న రాజయ్యను చూశాయి. అతని పక్కన ఉన్న ఖాళీ సంచిని చూసి ఒక కోతి ఇలా అంది-
''పాపం అడవిలో పండ్ల కోసం వచ్చినట్లున్నాడు. మనం అతనికి సహాయం చేద్దాం'' అంది. అన్ని కోతులూ కూడా 'సరే' అని చెట్లపై ఉన్న పండ్లను కోసి రాజయ్య సంచి నింపాయి.
''అతను నీరసంగా ఉన్నట్లున్నాడు. మనమందరం కలిసి అతన్నీ మోసుకుపోయి అతని ఊరి పొలిమేరల్లో వదిలేద్దాం'' అని ఇంకో కోతి అంది.
కోతులన్నీ అందుకు ఒప్పుకుని రాజయ్యను జాగ్రత్తగా మోసుకుంటూ అతని ఊరి పొలిమేరల్లో వదిలిపెట్టి, నిండుగా ఉన్న పండ్ల సంచీని అతడి పక్కన పెట్టాయి. కొద్దిసేపటికి రాజయ్యకు మెలుకువ వచ్చింది. తను ఊరి పొలిమేరల్లో ఉండటం, తన సంచి పండ్లతో నిండి ఉండటంచూసి ఆశ్చర్యంతో అటూ ఇటూ చూశాడు. దూరంగా వెళ్తున్న కోతుల గుంపును చూసి అవే తనను ఇక్కడ వదిలిపెట్టాయని తెలుసుకుని ఆశ్చర్యపోయాడు.
సంతోషంగా తన ఊరికి వెళ్ళి జరిగిందంతా చెప్పాడు. ఊర్లో అందరూ వింతగా చెప్పుకోవడం ప్రారంభించారు. అది విని సోమయ్య అనే ఒక సోమరిపోతు తను కూడా అలా వెళితే కోతులు తన సంచీనిండా పండ్లు నింపుతాయనే దురాశతో ఒక పెద్ద సంచి తీసుకుని అడవికి బయలు దేరాడు.
అడవిలో ఒక చెట్టు కింద సంచి తన పక్కన పెట్టుకుని పడుకున్నట్లుగా నటించాడు, కోతులు ఎప్పుడు వస్తాయా! అని ఆలోచిస్తూ. కాసేపటికి కోతుల గుంపు చెట్టు కింద పడుకున్న సోమయ్యను చూశాయి.
కోతులన్నీ పండ్లు తెంపి సంచిలో వేసి సోమయ్యను మోసుకుంటూ ఊరి పొలిమేర వైపు వెళ్ళసాగాయి. నిద్ర నటిస్తున్న సోమయ్య కోతులు తన సంచీని పళ్ళతో నింపాయో లేదో గమనించడానికి ఒక కన్ను తెరిచాడు. ఒక పిల్ల కోతి ఈ విషయాన్ని గమనించి మిగతా కోతులకు చెప్పింది. వెంటనే అవి సోమయ్య మోసంతో తమ సహాయం తీసుకుంటున్నాడని తెలుసుకున్నాయి.
సోమయ్యను దబ్బున కింద పడేసి పండ్ల సంచితో సహా పారిపోయాయి.
'దురాశ దుఃఖమునకు చేటు' అనుకుంటూ, సంచిపోవడమే గాక, నడుం విరిగినందుకు బాధపడుతూ ఊరివైపు బయలు దేరాడు సోమరిపోతు సోమయ్య.
- సెల్ఫోన్ల మీద హానికారక సూక్ష్మజీవులు కూడా ఉంటాయని మీకు తెలుసా? అది కూడా మీ బాత్రూమ్లోని ఫ్లష్ హ్యాండిల్ మీద ఉండే బ్యాక్టీరియా కన్నా సగటున 18 రెట్లు ఎక్కువంటే నమ్ముతారా? నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజమని చెబుతున్నారు బ్రిటన్ పరిశోధకులు. ప్రస్తుతం వాడకంలో ఉన్నవాటిల్లో నాలుగోవంతు సెల్ఫోన్లు బాగా మురికిపట్టినవేనని తాజా అధ్యయనంలో వెల్లడి అయింది. అధ్యయనం కోసం తీసుకున్న ఫోన్లల్లో అన్నింటికన్నా మురికిపట్టిన దాని మీద మన పెద్దపేగుల్లో కనిపించే బ్యాక్టీరియాతో పాటు సాల్మోనెల్లా వంటి క్రిముల స్థాయి ఏకంగా 39 రెట్లు అధికంగా ఉంది కూడా. ఆహారాన్ని కలుషితం చేసే బ్యాక్టీరియా సైతం ఎక్కువగానే ఉంటోంది. ''సెల్ఫోన్ను చేత్తో పట్టుకున్నప్పుడు దాని నుంచి అంటుకున్న బ్యాక్టీరియా వృద్ధి చెంది, తిరిగి ఫోన్ మీదికి చేరుతోంది. ఇలా పెరిగి పెరిగి చివరికి అనారోగ్యానికి కారణమవుతోంది'' అని పరిశోధకులు వివరించారు. ఇలాంటి సూక్ష్మక్రిములతో తీవ్రమైన కడుపునొప్పి వంటి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. మనకు బ్యాక్టీరియా ఎంత తేలికగా అంటుకుంటోందనటానికి ఈ సెల్ఫోన్లే మంచి ఉదాహరణ.
-
జపాన్ శాస్త్రజ్ఞులు మనుషుల్ని అనుకరించే రోబోను తయారు చేసారు. ఒక వ్యక్తి మాటలు, కదలికలను వీడియోలో చూసి ఉన్నదున్నట్లుగా మళ్లీ చేసి చూపించగల రోబోను వారు తయారు చేశారు. టెలినాయిడ్ ఆర్1 అనే ఈ రోబో దూరంలో ఉన్న మన సహచరులను దగ్గరగా ఉన్న భావనను కలిగిస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. మన పక్కనుండే టెలినాయిడ్ ఆర్1కు దూర ప్రాంతంలో ఉన్న వ్యక్తి మాటలు, కదలికలు ఒక సెన్సర్ ద్వారా అందుతాయి. అది అచ్చు గుద్దినట్లు వాటిని అనుకరించి చూపుతుంది. నిజ జీవితంలో వృద్ధాశ్రమాల్లో వృద్ధులకు ఇది ఎంతో ఉపయోగకారిగా ఉంటుందని పరిశోధకుల అంచనా. ఇది చూడ్డానికి అచ్చు మనిషి లాగే ఉంటుంది. అలాగే ఆడ, మగ, చిన్న పెద్దా వయసున్న వారిలాగా కూడా కనపడే విధంగా ఈ రోబోను తయారు చేయొచ్చు.
-
మీ ఇంటి కరెంట్ బిల్లు ఎంత వస్తుంది నెలకు? సాధారణంగా మధ్య తరగతి ఇంటి కరెంట్ బిల్లు నెలకు మూడు నుంచి నాలుగు వందలు ఉంటుంది. మరి రాష్ట్రపతి భవన్, ప్రధాని నివాసం, కార్యాలయాల్లో ఏటా విద్యుత్ వినియోగానికి ఎంత వెచ్చిస్తున్నారో తెలుసా? అక్షరాలా రూ. 16 కోట్లకు పైనే. సమాచార హక్కు చట్టం దరఖాస్తు ద్వారా వెల్లడైన సమాచారమిది. ప్రధాని, రాష్ట్రపతి నివాసాలు, కార్యాలయాల్లో విద్యుత్ కోసం ఎంత ఖర్చు చేస్తున్నారనే సమాచారం కావాలంటూ ముంబైకి చెందిన చేతన్ కొఠారి అనే ఆర్టీఐ ఉద్యమ కార్యకర్త అడిగారు. గత నాలుగేళ్లుగా ఇందుకు సంబంధించిన లెక్కలను తెలపాలని కోరారు.
2009కి ప్రధాని నివాసం, పీఎంవో, రాష్ట్రపతి భవన్లో విద్యుత్ వినియోగానికి ఖర్చయిన మొత్తం రూ. 16.33 కోట్లుగా వెల్లడయ్యింది. అయితే, 2008 కన్నా ఇది 2 కోట్లు ఎక్కువని తెలిసింది. ఒక్క రాష్ట్రపతి భవన్లోనే 2009లో కరెంట్ కోసం 6.67 కోట్లు, పార్లమెంటు భవనం ఆవరణలో 8.9 కోట్లు వెచ్చించారు. 2008లో సుప్రీంకోర్టులో 2.47 కోట్లు, 2009లో 2.18 కోట్లు విద్యుత్ కోసం చెల్లించారు. -
అగ్ని పర్వతాలు బద్ధలు కావటం, భూకంపాలు రావటం, సునామీ తీర ప్రాంతాలను ముంచెత్తటం వంటి ప్రకృతి ఉత్పాతాల గురించి మనం వింటూనే ఉన్నాం. మరి మనిషి చేసే పనుల వలన ఇంతే తీవ్రత ఉన్న ఎన్నో ప్రమాదాలు కూడా సంభవిస్తున్నాయి. సముద్రాల లోనికి మనం కావాలనో, ప్రమదావశాత్తూనో చమురును వదలటం ఇటువంటిదే. సముద్రంలో చమురు తెట్టలుతెట్టలుగా పైన పేరుకొంటే మనకేమవుతుంది? అని అందరూ అనుకొంటూ ఉంటారు. కాని ఇది వాస్తవం కాదు. ఒక్కసారి చమురు సముద్రపు నీటిలోకి చేరితే అది నీటి పైన పొరలాగా వ్యాప్తి చెందుతుంది. గాలి వీచే దిక్కుకు అనుగుణంగా ఈ చమురు పొర కూడా విస్తరిస్తుంది. దాంతో పైనుంచి పడే కాంతి తగ్గిపోయి, నీటి లోపల ఉండే వృక్ష జాతులలో కిరణ జన్య సంయోగ క్రియ జరగటం తగ్గుతుంది. నీటిలో నివసించే జంతుజాతులలో శ్వాస సంబంధ సమస్యలు తలెత్తుతాయి. వాటి ఆహారంపైన ఈ చమురు పేరుకు ఉంటుంది కనుక వాటి జీర్ణ వ్యవస్థకూ ఇబ్బంది తప్పదు. జంతువుల శరీరంపైన చమురు పేరుకుని కొత్త సమస్యలను సృష్టిస్తుంది. అలాగే పక్షుల రెక్కలు, ఈకలలో నూనె చేరి అవి తగిన విధంగా ఎగరలేక పోతాయి. సముద్రం మధ్యలో పడిన చమురు అతి తక్కువ కాలంలోనే తీర ప్రాంతాలకు కొట్టుకువచ్చి తీర ప్రాంతాలూ కలుషితమవుతాయి.
భూమి మీద పడిన చమురు వాన నీటితో పాటు కొట్టుకు పోయి సముద్రాలలో కలవటం, భూమి పొరల్లోకి ఇంకి సముద్ర జలాల్లో కలవటం, సముద్రయానం ద్వారా చమురును ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి తరలిస్తున్నప్పుడు ప్రమాదవశాత్తూ నీటిలో కలవటం వంటివి సముద్ర జలాల కాలుష్యానికి కారణంగా నిలుస్తున్నాయి.
ఒకసారి సముద్రం లోకి చమురు చేరిన తర్వాత, దానిని శుభ్రపర్చటం ఎంతో కష్టం. కొన్ని రకాల రసాయనాలను ఉపయోగించటం, చమురును సముద్రం మధ్యలోనే తగలబెట్టటం, కలుషితమైన నీటిని సేకరించి ప్రత్యేక విధానాల ద్వారా వడబోయటం వంటి పద్ధతులు ఉన్నప్పటికీ, ఎంతో కొంత హాని మాత్రం అప్పటికి జరిగిపోయే ఉంటుంది. -
జీవితాన్ని కాసేపు మరిపింపజేయడానికే కళలు ఉన్నాయి. అలాంటి కళతో పసిప్రాయంలోనే ప్రపంచ చిత్ర ప్రేమికులను ఆకట్టుకుంటున్నాడు బ్రిటన్కు చెందిన ఏడేళ్ల కిరోన్ విలియంసన్. తాజాగా ఈ బాలుదు గీసిన చిత్రాలు రెండు కోట్ల రూపాయలకు అమ్ముడయ్యాయి. కేవలం అరగంట వ్యవధిలోనే మొత్తం 33 చిత్రాలను అభిమానులు సొంతం చేసుకోవడం విశేషం. అతడి చిత్రాలను కొనుగోలు చేసేందుకు ఇంకా ఎందరో వెయిటింగ్ లిస్టు లో ఉన్నారట. తీర ప్రాంతాలు, ప్రముఖ కట్టడాల సౌందర్యాన్ని చిత్రాలుగా తీర్చిదిద్దడంలో కిరోన్ది అందెవేసిన చెయ్యి. ''సాధారణంగా వీలైనంత త్వరగా నిద్ర లేస్తా. చిత్రాలు గీసిన తర్వాత బడికి వెళ్తా.సెలవు రోజు మాత్రం రోజంతా చిత్రకళపైనే దృష్టిపెడతా'' అని కిరోన్ చెప్పాడు.
- ఒత్తిడికి ఉపశమనం కోసం గుప్పెడేసి మాత్రలు మింగక్కర్లేదని చెబుతున్నారు పరిశోధకులు. .. యోగా, ధ్యానాలతో అంతకన్నా పనిలేదని చెబుతున్నారు పరిశోధకులు. తాము అభివృద్ధి చేసే టీకా ఒత్తిడికి దివ్యౌషధమని స్టాన్ఫర్డ్ వర్సిటీ శాస్త్రవేత్తలు భరోసా ఇస్తున్నారు. 30 ఏళ్లుగా శ్రమించి ప్రపంచంలోనే తొలిసారిగా ఒత్తిడి నిరోధక టీకాను తయారుచేస్తున్నామని చెప్పారు. ఈ టీకా ఒక్క మోతాదుతో ఎంతో ప్రయోజనం ఉంటుందని వివరించారు. దీర్ఘకాలంగా ఒత్తిడికి గురవుతున్నవారు మధుమేహం, గుండెజబ్బుల బారిన పడుతున్నారని హెచ్చరించారు. ఇలాంటివారికి ప్రత్యేక ఉపశమన థెరపీలు, మాత్రలు అవసరం లేకుండా జన్యు సాంకేతిక విధానంలో ఈ టీకాను రూపొందిస్తున్నట్లు స్టాన్ఫర్డ్ న్యూరోసైన్స్ ప్రొఫెసర్ రాబర్ట్ సపోల్స్కై వివరించారు.
-
బుజ్జిగాడికి అయిదేళ్ళు. గారాబం వల్ల మొండితనం వచ్చింది. అమ్మ చెప్పిన మాట వినడు. స్నానం చేయడానికి రోజూ మారాం చేసేవాడు. మరి అమ్మమ్మ ఐడియా బుజ్జిలో ఏమైనా మార్పు తీసుకు వచ్చిందా? చొక్కాపు వెంకట రమణ కథనానికి గంగాధర్ బొమ్మలతో ఈ కామిక్ ని చదవండి.
-
హన్ని మగ కోతి. పేరుకు తగ్గట్టుగానే దీనివన్నీ కోతి బుద్ధులు. ఎప్పుడూ ఎదుటి వారిని ఏడిపిస్తుంది. వాళ్లు బాధ పడుతుంటే తను సంతోషిస్తుంది. బిక్కి అనే ఆడ కోతి ఎక్కడి నుండో ఒక అరటి పండు సంపాదించుకొని తినబోతుంటే, దాన్ని లాక్కొని ఏడిపించాలని చూసింది. అప్పుడేమయిందంటే... .. తర్వాత కథ బొమ్మలు చూస్తే మీకే తెలుస్తుంది.
-
పాప తెలివి
రచన: చొక్కాపు వెంకట రమణ
బొమ్మలు: గంగాధర్
-
పింక్ సిటీ జైపూర్ లోని జంతర్ మంతర్ను యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది. బ్రెసీలియాలో సమావేశమైన యునెస్కో ప్రపంచ వారసత్వ సంపద కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. భారత్లో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన 28వ కట్టడం జంతర్ మంతర్. 1727-34 మధ్య కాలంలో మహారాజా జైసింగ్-2 దీన్ని నిర్మించారు. ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా ఏడు చారిత్రక కట్టడాలకు యునెస్కో ఈ గుర్తింపు నిచ్చింది. దీనితో జైపూర్ కీర్తి కిరీటంలో మరో కలికితురాయి చేరింది.
-
రోడ్డుమీద కారు డ్రైవ్ చేసుకుంటూ వెళుతున్నపుడు ఉన్నట్టుండి రోడ్డుకు అడ్డంగా ఎవరైనా వస్తే, బ్రేకు వేయడం కష్టం కదూ. ఇలాంటి ఇబ్బందులు, ప్రమాదాలు ఇకముందు లేకుండా చేసేందుకు ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ నిస్సాన్ ప్రత్యెక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసింది. కారుకు అడ్డంగా వస్తువులు గానీ, మనుషులు గానీ వస్తే రాడార్లు, సోనార్ సెన్సర్ల సాయంతో గుర్తుపట్టి, వెంటనే తనంతట తానే బ్రేకులు వేస్తుంది. ఆటో మొబైల్ వాహనాలు అన్నింటికి ఈ సదుపాయం అందుబాటు లోకి వస్తే రోడ్డు ప్రమాదాలు కనుమరుగు అవుతాయని భావించవచ్చు.