-
ఒక చిన్న ఎలుక బయట ప్రపంచం ఎలా ఉంటుందో ఒకసారి చూసి వద్దామని సరదాగా బయటికి వెళ్ళి తిరిగి తిరిగి తన తల్లి దగ్గరికి వచ్చి సంతోషంగా తను చూసిన విశేషాలు చెప్పటం ప్రారంభించింది.
'అమ్మా! అమ్మా! ఈ ప్రపంచం ఎంత సుందరంగా ఉందో' అంది ఆనందంగా చప్పట్లు చరుస్తూ.
బిడ్డ ఆనందానికి తల్లి ఎలుక సంతోషిస్తూ - 'ఇంతకీ ఏమేం చూశావ్' అంది.
'మరేమో, నేను రెండు జంతువుల్ని చూశాను. అందులో ఒకటి భయంకరంగా ఉంది. రెండోదేమో చాలా చక్కగా ఉంది' అంది.
'ఇంతకీ అవి ఎలా ఉన్నాయో చెప్పు' అంది తల్లి ఎలుక.
'ఒకదానికి నల్లని కాళ్ళు, తలపై ఎర్రటి కుచ్చు, వాడిగా ఉండే ముక్కు ఉన్నాయి. శరీరమంతా ఈకలతో నిండి ఉంది. నేను దగ్గరికి వెళ్ళగానే గట్టిగా అరిచింది. నాకు భయమేసి పరుగెత్తుకొచ్చా' అంది.
'అది కోడిపుంజు, దాన్ని చూసి భయపడనవసరం లేదు. మరి రెండవది ఎలా ఉంది?' అని ప్రశ్నించింది తల్లి.
'రెండో జంతువుకి తెల్లమెడ, మెత్తని పాదాలు ఉన్నాయి. శరీరమంతా దూదిలా ఉంది. ముక్కుపైన మీసాల్లాంటి వెంట్రుక లున్నాయి. అది నావైపే తేరిపార చూసింది. అబ్బా అది ఎంత బాగుందో' అని చెప్పింది.
అది విని వెంటనే తల్లి ఎలుక కంగారు పడుతూ-
'ఓసి వెర్రిదానా! అది పిల్లి. అదే మన శత్రువు. ఎప్పుడైనా ఆకారాన్ని బట్టి మంచిది. చెడ్డది అని నిర్ణయించుకోవద్దు తెలిసిందా. ఇంకా నయం అది నిన్ను తినలేదు' అంటూ అక్కున చేర్చుకుంది అమాయకపు చిట్టి ఎలుకను.
-- లియో టాల్స్టాయ్ కథ. -
స్టేజిపైన మెజీషియన్ ఒక గ్లాసులోని షర్బత్ను ఇంకో ఖాళీ గ్లాసులోని పోశాడు. ఆశ్చర్యం! షర్బత్ నీళ్ళుగా మారిపోయింది. అందరూ ఆనందంతో చప్పట్లు కొట్టారు.
ఈ మేజిక్ చెయ్యడానికి రెండు గాజు గ్లాసులు, ఎర్రసిరా, చిటికెడు బ్లీచింగ్ పౌడరు కావాలి. మొదటి గ్లాసులో సగం వరకు ఎర్రసిరా కలిపిన నీళ్ళు పోసి ఉంచు. పది చుక్కల నీళ్ళల్లో చిటెకెడు బ్లీచింగ్ పౌడరు (ఇది మెడికల్ షాప్లో దొరుకుతుంది) కరిగించి రెండవ గ్లాసులో పోసి ఉంచు. పైకి చూడటానికి రెండవ గ్లాసు ఖాళీగా కనిపిస్తుంది. మొదటి గ్లాసులో ఉన్న సిరా నీళ్ళను చూపించి, అది కొత్త రకం రోజ్ షర్బత్ అని మీ స్నేహితులకు చెప్పు. వాళ్ళు చూస్తూ ఉండగా మంత్రం వేస్తున్నట్లు నటించి ఆ షర్బత్ను రెండవ గ్లాసులో పొయ్యి. అంతే రంగు మాయమై షర్బత్ నీళ్ళలా మారి పోతుంది.
ఈ రకమైన మేజిక్ మీలో చాలామంది చాలాసార్లు చేసే ఉంటారు. కాని అది మేజిక్ అని గమనించి ఉండరు. బట్టలకయిన సిరా మరకుల పోగొట్టడానికి ఇదే పద్ధతి అవలంబిస్తారు.
అయితే ఈ మేజిక్ ఎలా జరుగుతుంది? బ్లీచింగ్ పౌడర్లో 'క్లోరిన్' అనే ధాతువు ఉంది. నీటి అణువులలో ఆక్సిజన్, హైడ్రోజన్ అనే పరమాణువులు ఉన్నాయి. క్లోరిన్ వెళ్ళి నీటిలో ఉన్న హైడ్రోజన్తో కలుస్తుంది. మిగిలిపోయిన ఆక్సిజన్ పరమాణువులు బహు చురుకైనవి. అవి వెళ్ళి రంగులతో కలిసి, వాటిని వెలిసి పోయేటట్లు చేస్తాయి. బ్లీచింగ్ పౌడర్ రంగు పోగొట్టింది అనడం కంటే ఆక్సిజన్ పరమాణువులు రంగు పోగొట్టాయనడం సబబుగా ఉంటుందేమో!
-- మహీధర నళినీ మోహన్ -
''తమపై తమకు నమ్మకమున్న కొందరు వ్యక్తుల చరిత్రే, ఆ దేశ చరిత్ర అవుతుంది'' అని స్వామి వివేకానంద ఒక సందర్భంలో చెప్పారు. ఆ కోవకు చెందిన వ్యక్తి దుర్గాబాయ్ దేశ్ముఖ్.
దుర్గాబాయ్ దేశ్ముఖ్ ఒక ఆదర్శ వనిత. స్వాతంత్య్ర సమర యోధురాలు. ఆమె జీవిత కాలం ఒక ఉత్తేజపూరితమైన వనితగా జీవించారు. ఇప్పటికీ ఆమె జీవితం యువతరాన్ని ఉత్తేజపరుస్తూనే ఉంది. బాల్యంలో ఆమె పేరు దుర్గ. పెద్దయ్యాక దుర్గాబాయమ్మ గాను, వివాహం జరిగిన తర్వాత దుర్గాబాయ్ దేశ్ముఖ్ గాను మారింది. చిన్ననాట దుర్గ బాగా అల్లరి చేసేది. ఆటపాటలందు శ్రద్ధ చూపేది. చేసే ప్రతి పని లోను పట్టుదల చూపేది. పని పూర్తయ్యే వరకు ఆ పని కొనసాగించేది. అదే శ్రద్ధ, అదే పట్టుదల ఆమె జీవితాంతం కొనసాగించారు. రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో కీర్తి ప్రతిష్టలను ఆమె పొందారు. భారత మహిళకు ఆమె ఒక గుర్తింపు కల్పించారు. ఉపాధి అవకాశాలను కల్పించారు. వ్యక్తిత్వం కల్పించారు. అంతటి ప్రతిభాశాలి ఆమె.
'సాహస వనిత దుర్గాబాయ్ దేశ్ముఖ్' పుస్తకం ఆమె జీవితాన్ని సంక్షిప్తంగా మన ముందు ఆవిష్కరిస్తుంది. తేలికయిన భాష, మృదువైన రీతిలో వ్రాసిన ఈ పుస్తకం ఆ మహోన్నత వనిత జీవితగాధను మన ముందుంచుతుంది.
మాదిరాజు గోవర్థన రావు సాధారణ ప్రజానీకానికి, ముఖ్యంగా పిల్లల కోసం అనేక పుస్తకాలను రచించారు. 'సాహస వనిత దుర్గాబాయ్ దేశ్ముఖ్' పుస్తకాన్ని ఆయన కేవలం పిల్లల కోసమే రచించారు.
ఈ పుస్తకాన్ని పబ్లికేషన్స్ డివిజన్, సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ప్రచురించింది. పుస్తకం వెల 70 రూపాయలు. -
ఎదపై ఎర్రని గులాబి పువ్వు
పెదవుల చెరగని చిరునవ్వు
ఆ మహనీయుడు ఎవరనుకున్నావు?
అతడే అతడే చాచా నెహ్రూ!
చాచానెహ్రూ చేతుల లోనిది
శాంతికి చిహ్నం తెల్లపావురం!
ప్రపంచ శాంతికి ...... శ్రమించిన
మన నెహ్రూజి మహామనీషి!
సమతా మమతా పెంచెను మనలో
చాచా లక్ష్యం దేశాభ్యుదయం
ఔన్నత్యంలో హిమగిరి అతడు
చిన్నారులకూ నేస్తం అతడు
కులం మతం అను కుటీలత్వాన్నీ
తొలగించాడీ 'భారతరత్న'!
ఆ మహనీయుడు ఎవరనుకున్నావు
అతడే అతడే మన చాచాజీ!
'చాచా చెప్పిన మాటలు మరువం,
తూచా తప్పక పాటిస్తాం' అని
మన నెహ్రూజి పుట్టిన రోజున
మనమందరమూ ప్రతినలు చేద్దాం!
-ఈదుపల్లి వెంకటేశ్వరరావు - వాతావరణ మార్పుల వల్ల 2050 నాటికి ఆర్కిటిక్ సముద్రంలో మంచు ఇక కనిపించదని రష్యా నిపుణులు అందోళన వ్యక్తం చేస్తున్నారు. ''మరో 30-40 ఏళ్లలో ఉత్తర ధ్రువం సహా ఆర్కిటిక్ సముద్రవ్యాప్తంగా వేసవికాలంలో మంచు జాడలు కనిపించకపోవచ్చు'' అని రష్యా వాతావరణ కేంద్రం డైరెక్టర్ అలెగ్జాండర్ ఫ్లోరోవ్ తెలిపారు. వాతావరణ మార్పులపై ప్రభుత్వ నివేదికను ఆయన ఉటంకిస్తూ 2007 సమాచారంతో పోలిస్తే 2010లో మంచు పరిమాణం తగ్గిందని అన్నారు. ''మంచు సగటు స్థాయి తగ్గుతోంది. గతంలో 11 మిలియన్ చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఆవరించి ఉన్న మంచు ప్రస్తుతం 10.8 మిలియన్ చదరపు కిలోమీటర్లకు తగ్గింది. ఉపగ్రహ చిత్రాల ద్వారా ఈ విషయం తేలింది'' అని తెలిపారు.
- 'మంచుయుగంలోనూ మనిషి బతికాడు' అనేందుకు ఆధారాలు లభించాయి.మానవుడు తీవ్రస్థాయి ప్రతికూల వాతావరణంలోనూ మనుగడ సాగించాడని తాజా అధ్యయనం వెల్లడించింది. మంచుయుగంలో ఉండే అతి శీతల వాతావరణాన్ని తట్టుకుని మనిషి జీవించాడని గుర్తించారు. ఆఫ్రికా దక్షిణ కోస్తా ప్రాంతంలోని గార్డెన్ ఆఫ్ ఈడెన్ లో భూమి తేలిన ప్రాంతంలో ప్రాచీన మానవుడి అవశేషాలు లభ్యమయ్యాయి. దక్షిణాఫ్రికా నగరం కేప్టౌన్కు 240 మైళ్ల దూరంలోని సంచారం లేని గుహల్లో ప్రాచీన మానవుడికి సంబంధించిన ఆధారాలు లభ్యమయ్యాయి. మంచుయుగం కాలంలో అదొక నివాస ప్రాంతం కావచ్చని పరిశోధకులు భావిస్తున్నారు.
-
సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ, ఎన్సిఇఆర్టి అఖిల భారత ఫోటోగ్రఫీ పోటీలను బాలల కోసం నిర్వహిస్తోంది. 12 నుంచి 18 సంవత్సరాల వయస్సులో వున్న బాలలు ఈ పోటీలలో పాల్గొనవచ్చు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు ఎవరైన పోటీల్లో పాల్గొనేందుకు అర్హులే.
పోటీలకు పంపిన అన్ని ఫోటోలను సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ వెబ్సైట్లో ప్రదర్శిస్తారు. ఉత్తమంగా ఉన్న 100 ఎంట్రీలకు మెరిట్ సర్టిఫికెట్ను ఇస్తారు.
ఎంట్రీలను పంపించేందుకు చివరి తేదీ 30 సెప్టెంబర్ 2010. పోటీలలో పాల్గొనేందుకు ఎటువంటి ఫీజు చెల్లించనవసరం లేదు. ఎంట్రీలను పంపించవలసిన చిరునామా:
జాయింట్ డైరెక్టర్
సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ,
ఎన్సిఇఆర్టి
చాచా నెహ్రూ భవన్, శ్రీ అరబిందో మార్గ్
న్యూ ఢిల్లీ 110 016