-
Google announced Google Code-in, an open source development and outreach contest targeted at 13-18 year old students around the world.
Be sure to check out Frequently Asked Questions about the contest for answers to your questions about participating.Google is hopes to get pre-university students from all over the world involved. Google will announce the mentoring organizations that are participating on November 5. The contest starts on November 22, 2010! -
కాలుష్యం కోరల్లో భాగ్యనగరం చిక్కుకొంది. రోజురోజుకూ తగ్గుతున్న గాలి నాణ్యత ప్రజల ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపుతోంది.వాయు కాలుష్యం హైదరాబాద్లో విపరీతంగా పెరిగిపోతున్నదని సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరానిమెంట్ (సీఎస్ఈ) పేర్కొంది. నగరంలోని వాయు నాణ్యతతోపాటు, రవాణ గణాంకాలను సీఎస్ఈ విశ్లేషించింది. చిన్నపాటి ధూళి కణాలు (పీఎం) ఎక్కువగా ఉన్నాయని గుర్తించింది. కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ వాయు నాణ్యత ప్రమాణాల ప్రకారం హైదరాబాద్లో వాయు నాణ్యత అధమ స్థాయికి చేరిందని సీఎస్ఈ పేర్కొంది. ''పాత నిబంధనల ప్రకారం నగరంలోని కొన్ని ప్రాంతాలు ఒక మోస్తరు స్థాయి కాలుష్య ప్రాంతాలుగా వర్గీకరించారు. మారిన నిబంధనల నేపథ్యంలో ఇవి తీవ్రమైన కాలుష్య ప్రాంతాలుగా మారిపోయాయి. తక్కువ కాలుష్యం ఉన్న ప్రాంతాలు అధిక కాలుష్య స్థాయికి చేరాయి'' అని నివేదిక వివరించింది. అక్టోబర్ 7 గురువారం నాడు జరిగిన ఒక రౌండ్టేబుల్ సమావేశంలో సీఎస్ఈ ఈ మేరకు ఒక నివేదికను విడుదల చేసింది. 2003లో సరాసరి వార్షిక పీఎం10 స్థాయి 66 ఎంజీ/సీయూఎం మేర ఉండేది. 2009లో అది 80 ఎంజీ/సీయూఎంకు పెరిగిందని నివేదిక వెల్లడించింది. అత్యధిక కాలుష్య ప్రాంతంలో ఉండాల్సిన ప్రమాణం కన్నా ఇది 1.3 రెట్లు ఎక్కువని సీఎస్ఈ అసోసియేట్ డైరెక్టర్ అనుమితా రాయ్ చౌధరి తెలిపారు. ప్రస్తుతం నగరంలో 26లక్షల వాహనాలు ఉన్నాయి. ఏటా 2లక్షల కొత్త వాహనాలు రోడ్లపైకి వస్తున్నాయి. దానితో నగరంలో సరాసరి ప్రయాణ వేగం కూడా తగ్గుతోందని చెప్పారు. 1981లో గంటకు 17 కిలోమీటర్ల మేర వేగం ఉండేదని, 2006లో అది 12 కిలోమీటర్లకు పడిపోయిందని వివరించారు. వాహనాల సంఖ్య పెరగడం వల్లే నగరంలో కాలుష్యం పెరుగుతోందని తెలిపారు.
-
ఆర్కిటిక్లో మంచు పొర తగ్గుతోంది. ఆర్కిటిక్ సముద్ర మంచు వేసవిలో కరుగుతుంది. శీతాకాలంలో మళ్లీ పేరుకోవటం సాధారణమే. అయినా, గత 30 ఏళ్లుగా ప్రమాదకర స్థాయిలో మంచు పొర తగ్గుతోందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఈ వేసవిలో మూడో అత్యల్ప స్థాయికి చేరింది. రాబోయే 20-30 ఏళ్లలో వేసవి సమయంలో ఆర్కిటిక్ మంచురహిత ప్రాంతంగా మారే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ ప్రాంతంలో వేసవి సీజన్లో మంచు కరిగే ముప్పు పెరుగుతోందని కొలరాడోలోని జాతీయ మంచు గణాంక కేంద్రం శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. -
పట్టాలపై ఎదురెదురుగా వస్తున్న రైళ్లు ఢీకొనకుండా నిరోధించే పరికరం సిద్ధమైందని రైల్వేశాఖ మంత్రి మమతా బెనర్జీ తెలిపారు. త్వరలో దానిని అందుబాటులోకి తేనున్నామని మమతా బెనర్జీ తెలిపారు. దీంతోపాటు అత్యాధునిక సిగ్నలింగ్ వ్యవస్థనూ ప్రవేశపెట్టబోతున్నామని చెప్పారు. ఇవి రెండూ అందుబాటులోకి వస్తే రైలు ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని అక్టోబర్ 7 వ తేదీన ఆమె ఒక సమావేశంలో వెల్లడించారు. - చంద్రుడిపైకి చైనా మరో ఉపగ్రహాన్ని పంపింది. ఛాంగే-2 అనే ఈ ఉపగ్రహాన్ని సిచువన్ ప్రాంతంలోని జిచాంగ్ ఉపగ్రహ ప్రయోగ కేంద్రంనుంచి ప్రయోగించారు. ఉపగ్రహం ప్రయోగించిన 20 నిమిషాల్లో కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశించినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. ఇది ఐదు రోజుల్లో చంద్రుని కక్ష్యా వేగాన్ని అందుకుంటుందన్నారు. ఉపగ్రహాన్ని 54.84 మీటర్ల పొడవు, 345 టన్నుల బరువున్న 3సీ రాకెట్తో ప్రయోగించినట్లు చెప్పారు. 2013లో చంద్రుడిపైకి మానవుడిని పంపాలని చైనా లక్ష్యంగా నిర్ణయించింది.
-
మూడేళ్లలో 31 కోట్ల మొక్కల్ని నాటాలన్న లక్ష్యంతో, రూ.500 కోట్లతో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్ని పచ్చగా మార్చడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికను సిద్ధంచేసింది. మూడేళ్లలో ప్రతి గ్రామ పంచాయితీలో 17 వేల మొక్కలను నాటే కార్యక్రమం కార్యరూపం దాల్చబోతోంది. మొత్తంమీద 31 కోట్ల మొక్కల్ని నాటే కార్యక్రమాన్ని అటవీ, గ్రామీణాభివృద్ధి శాఖలు చేపట్టబోతున్నాయి. రాష్ట్రంలోని 65 లక్షల హెక్టార్ల అడవుల్లో దాదాపు 30 లక్షల హెక్టార్లలో అడువులు అంతరించిపోయే పరిస్థితి ఏర్పడి పర్యావరణ సమతుల్యత దెబ్బతినే ప్రమాదం ఏర్పడింది. ఈ నేపథ్యంలో వచ్చే మూడేళ్లలో భారీగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని మొదలుపెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. పచ్చని వనాలను పెంపొందించేందుకు గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద అటవీ శాఖకు రూ.500 కోట్లను కేటాయించారు. మహాత్మాగాంధీ గ్రామీణ నర్సరీ పేరిట ప్రతి మండలంలో నాలుగు నర్సరీల చొప్పున మొత్తం 4,604 నర్సరీలను ఏర్పాటుచేస్తారు. ప్రతి నర్సరీలో 70 వేల నుంచి 80 వేల మొక్కల్ని పెంచుతారు. టేకు, నీలగిరి, వెదురు, నేరేడు, తుమ్మ, ఎర్రచందనం, ఉసిరి, కానుగ, వేప, సుబాబుల్ మొక్కలను పెంచుతారు. ప్రతి నర్సరీకి ఒక వనసేవక్, 20 నర్సరీలకు ఒక పోగ్రాం అసిస్టెంటెంట్లను నియమించనున్నారు. నిర్ణయించిన కొలతలతో గొయ్యి తీసి బంజరు భూముల్లో గానీ, రోడ్డు పక్కన గానీ మొక్కలు ఎవరు నాటినా ఉపాధి హామీ పథకం కింద నిధులను వీరికి అందజేయనున్నారు. చెరువుల పూడికతీతతో పాటు ఇతరత్రా ఉపాధి పనుల్లాగే దీన్ని కూడా ఉపాధి పథకంలోకి తీసుకువచ్చి మొక్కలను నాటే కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. మొక్కలు నాటాక వీటి సంరక్షణ బాధ్యతను డివిజనల్ ఫారెస్టు అధికారులతో పాటు జిల్లా నీటిపారుదల యాజమాన్య సంస్థ అధికారులు చేపడతారు.
-
భారత రాష్ట్రపతి ప్రతిభాపాటిల్, బ్రిటన్ యువరాజు చార్లెస్ చేతుల మీదుగా కామన్వెల్త్ క్రీడల ఆరంభ వేడుకలు ప్రారంభమయ్యాయి. ఈ అద్భుత ఘట్టానికి ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియం వేదికగా నిలిచింది. 28 ఏళ్ల కింద ఆసియా క్రీడలను నిర్వహించిన భారత్ ఇపుడు కామన్వెల్త్ క్రీడల ప్రారంభ వేడుకల్ని అట్టహాసంగా నిర్వహించింది. ౩ అక్టోబరు సాయంత్రం వేళ జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో రూ.44 కోట్లతో ఏర్పాటుచేసిన బెలూన్ ఆకారపు ఏరోస్టాట్ తెరను ఆకాశంలోకి ఎత్తగానే ప్రాంగణమంతా స్వర్ణకాంతులు పరచుకున్నాయి. కామన్వెల్త్ దేశాల అధినేత ఎలిజబెత్ రాణి తరఫున బ్రిటన్ యువరాజు ఛార్లెస్, భారత రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ స్టేడియంలోని 60 వేలమంది ప్రేక్షకుల సమక్షంలో ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ఆరంభించారు. ఈ క్రీడల్ని బ్రిటిష్ రాణి ప్రారంభించకపోవడం గత 44 ఏళ్ల కాలంలో ఇదే మొదటిసారి. యువరాజు ఛార్లెస్, రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ ఏకకాలంలో ఈ క్రీడల్ని ప్రారంభించాలన్న దౌత్యపరమైన ఒప్పందం మేరకు ఆదివారం ఒకే వేదికపై నుంచి ఇరువురూ క్రీడల ప్రారంభ సూచకంగా ప్రకటన చేశారు.
ప్రధాని మన్మోహన్సింగ్, కేంద్ర మంత్రులు, మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రాహుల్గాంధీ, ముఖ్యమంత్రి షీలాదీక్షిత్, అంతర్జాతీయ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు జాక్విస్ రోగ్, భారత్ ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు సురేశ్ కల్మాడీ, వివిధ దేశాధినేతలు హాజరయ్యారు. సంస్కృతి, ఆధునికత కలగలిసిన కార్యక్రమాలు 2 గంటలపాటు ప్రేక్షకుల్ని కట్టిపారేశాయి. 70 వేల కోట్ల రూపాయల ఈ మెగా కార్యక్రమం ఇది. పన్నెండు రోజులపాటు జరిగే క్రీడా పండుగలో 71 దేశాలకు చెందిన ఏడువేల మంది క్రీడాకారులు పోటీ పడుతున్నారు.
1050 మంది పాఠశాల విద్యార్థుల నమస్తే నృత్య ప్రదర్శనను 23 భారతీయ భాషల్లో ఏరోస్టాట్లో ఆవిష్కరించారు. క్రీడాకారుల పెరేడ్ 71 మంది మహిళలతో ప్రారంభమైంది. అంతా చీరలు కట్టుకొని భారతీయతను, చీరల రంగుల్లో వారివారి దేశాల పతాకాలను ప్రతిబింబించారు. ఒలింపిక్ పతకాన్ని గెలుచుకున్న అభినవ్ బింద్రా సారథ్యంలో 619 మంది సభ్యుల భారత బృందం ప్రాంగణంలోకి వచ్చినపుడు కేరింతలు కొట్టారు. 71 దేశాల క్రీడాకారుల మార్చ్ సాగింది. హైదరాబాద్ బ్యాడ్మింటన్ తార సైనా నెహ్వాల్, బాక్సింగ్ వీరుడువిజేందర్సింగ్, కుస్తీ యోధుడు సుశీల్ కుమార్లు బ్యాటన్ను మోసిన వారిలో ఉన్నారు. అనంతరం అన్ని దేశాల పతాకాలు ప్రాంగణంలోకి రాగా, భారత కెప్టెన్ బింద్రా ప్రమాణస్వీకారం చేశారు. 816 మంది ప్రదర్శనకారులు చేసిన సూర్య నమస్కారాలు, క్లిష్టమైన ఆసనాలు అలరించాయి.