-
బాలల సంపూర్ణ వికాసం కోసం బాల సాహిత్యాన్ని దృశ్యశ్రవణ పద్ధతిలో అందించడం
ఎంతో అవసరమని టి.శాట్ సీఈవో శైలేష్రెడ్డి అభిప్రాయపడ్డారు. 'బాలసాహిత్యం
దృశ్యశ్రవణ మాధ్యమాలు - ప్రసారాలు' అనే అంశంపై బాలచెలిమి పిల్లల వికాస
పత్రిక, చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో శనివారం
ఆక్స్ఫర్డ్ గ్రామర్ స్కూల్లో నిర్వహించిన 'బాలచెలిమి ముచ్చట్లు' 7వ
కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రెండు దశాబ్ధాల క్రితం
టెలివిజన్ విస్తృతంగా కుటుంబ వ్యవస్థలోకి రావడంతో తల్లిదండ్రులు టీవీ
సీరియల్స్ వంటి వాటికి ప్రాధాన్యత ఇచ్చి చూడడంతో పిల్లల ప్రచురణకు
ప్రాధాన్యత తగ్గిపోవడమే కాక అలాంటి కార్యక్రమాల రూపకల్పన కూడా జరగలేదని
చెప్పారు. తల్లిదండ్రుల అభిరుచుల్లో మార్పులు జరిగి బాల సాహిత్యంలోని అనేక
అంశాలు దృశ్యశ్రవణ రూపంలోకి మారితే పిల్లల విషయంలో అద్భుతాలు
ఆవిష్కృతమవుతాయని తెలిపారు. వినోదమే కాకుండా విజ్ఞానాన్ని భవిష్యత్తుకు
ప్రగతిని చూపే దృశ్యశ్రవణ ప్రసారాల రూపకల్పనకు ముమ్మర కృషి ప్రస్తుతం జరగడం
ఎంతో అవసరమని ఆయన సూచించారు.
వక్తగా పాల్గొన్న మంచి పుస్తకం నిర్వాహకులు కె. సురేష్ మాట్లాడుతూ
సమాజంలో తాము ఒకరుగా పిల్లలు నిత్యం నేర్చుకునే గొప్ప లక్షణాన్ని కలిగి
ఉంటారని అలాంటి వారికి పుస్తకాలతోపాటు దృశ్య శ్రవణ మాధ్యమాల ద్వారా ఉత్తమ
ప్రసారాలను అందిస్తే ప్రయోజకులుగా మారుతారని చెప్పారు. నిజమైన బాల
సాహిత్యాన్ని అందించే కృషి రచయితలు చేస్తే అందుకు అనుగుణమైన దృశ్యశ్రవణ
పద్ధతులు రూపొందుతాయని తెలిపారు.
కార్యక్రమానికి అధ్యక్షత వహించిన చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ సొసైటీ
ఛైర్మన్ వేదకుమార్ మణికొండ మాట్లాడుతూ రచనే అన్నింటికి మూలమని అన్నారు.
బాలల మనో వికాసాలను ఆకాంక్షిస్తూ వెలువడే రచనల నుండి దృశ్య శ్రవణ ప్రసారాలు
రూపొందితే అవి ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని తెలిపారు. ఎపి లైబ్రరీ అసోసియేషన్
కార్యదర్శి డాక్టర్ రావి శారద, ప్రముఖ రచయిత్రి పైడిమర్రి గిరిజ, బాల
సాహిత్య పురస్కార గ్రహీత నారంశెట్టి ఉమామహేశ్వరరావు ప్రసంగించారు.
కార్యక్రమంలో ప్రముఖ రచయితలు డాక్టర్ నాళేశ్వరం శంకరం, డాక్టర్
పత్తిపాక మోహన్, జుగాష్విలీ, కందేపీ రాణీప్రసాద్, అనిల్ బత్తుల,
తిరునగరి శ్రీనివాస్, బాల్రాజ్, పలువురు బాల సాహిత్య అభిమానులు
పాల్గొన్నారు. డైరెక్టర్ వినోద్ ఘణత్ర దర్శకత్వం వహించిన 'హెడా హోడా'
హిందీ షార్ట్ ఫిల్మ్ను ప్రదర్శించగా బాలలు పెద్ద సంఖ్యలో హాజరై చూసి
ఆనందించారు.