కవికాకి కోగిర జై సీతారామ్ రచించిన పుస్తకం ఇది. పిల్లల పాటల పేరుతో ఎన్నో పుస్తకాలు వచ్చి ఉండవచ్చు. కానీ జై సీతారామ్ పాటలు మాత్రం పిల్లలు, పిల్లల్ని ప్రేమించే వారి హృదయాలలో చిరకాలం ఉండి పోతాయి. ఈ పాటలలో అనంతపురం జిల్లా మాండలికం గుభాళిస్తుంది. ఇక్కడి భాషను ఇంత సృజనాత్మకంగా, ఇంత లయబద్ధంగా మరో రచయిత తీర్చిదిద్దలేదంటే అతిశయోక్తి కాదు.
అనంతపురం జిల్లా లోని కోగిర గ్రామంలో జై సీతారామ్ జన్మించారు. ఆయన ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటవ తరగతి ఉపాధ్యాయుడు గాను, ఏకోపాధ్యాయుడు గాను పని చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు పొందారు. రాష్ట్ర ప్రభుత్వానికి తెలుగు వాచకాలు, పాఠాలు రాశారు. అష్టావధానాలు, శతావధానాలలో పాల్గొన్నారు.
జై సీతారామ్ పాటలు పిల్లలు, పెద్దల నోట విస్తృతంగా ప్రచారం పొందినా ఈనాటికీ ఆయనకు తగినంత గుర్తింపు రాలేదు. చదువు చెప్పటమంటే పిల్లల్ని కొట్టడమనే అర్థం ఉన్న రోజుల్లోనే ఆట, పాటలతో కూడిన చదువును ఆయన ప్రవేశపెట్టారు. స్వయంగా పాటలు రాసి పిల్లలతో ఆడి పాడేవారు. పాటలకు, పుస్తకాలకు తగిన రీతిలో బొమ్మలు వేసేవారు. తిట్టకుండా, కొట్టకుండా అపారమైన ప్రేమ, స్నేహాలతో పిల్లలను పెంచటం ఎలాగో తల్లిదండ్రులకూ, ఉపాధ్యాయులకూ తెలియాలి. జీవితానికీ, నేర్చుకొనే విద్యకూ సంబంధం లేకుండా పిల్లల్ని యంత్రాలుగా కాకుండా సృజనశీలురుగా, చైతన్యమూర్తులుగా తయారు చేసే ప్రయత్నాలకు జై సీతారామ్ పాటలు స్ఫూర్తినిస్తాయి.
'మేం పిల్లలం' పుస్తకాన్ని పిల్లల పుస్తక ప్రచురణ సంస్థ 'పాల పిట్ట' ప్రచురించింది. వెల వంద రూపాయలు.
0 comments:
Post a Comment