-
కేంద్ర ఔషధాలు, ప్రమాణాల నియంత్రణ సంస్థ(సీడీఎస్సీవో) ఇటీవల దేశవ్యాప్తంగా ఔషధాలు, సౌందర్య సాధనాల నమూనాలను సేకరించి నాణ్యతను పరిశోధించగా 8 శాతం మందులు నకిలీవి లేదా నిర్ణీత ప్రమాణాల్లో లేనివని తేలింది. దాంతో ఈ సంస్థ దేశవ్యాప్తంగా నకిలీ మందుల ఏరివేతకు శ్రీకారం చుట్టింది. ఆంధ్రప్రదేశ్లో ఈ సమస్య తీవ్రంగా ఉండటంతో శంషాబాద్లో ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటుచేసింది. సీడీఎస్సీఓ ప్రాంతీయ పర్యవేక్షక అధికారి ఆధ్వర్యంలో రాష్ట్రంలో నకిలీ మందుల ఏరివేత జరుగుతుంది. ఇందులో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచేందుకు నకిలీ మందుల్ని పట్టించే వారికి బహుమతుల పథకాన్ని ప్రవేశపెట్టారు. ఏడుగురు ప్రభుత్వ శాఖల అధికారులు, ఒక స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి కలిసి బహుమతులను నిర్ధరిస్తారు. సాధారణ ప్రజలకు సీజ్ చేసిన మందులు/వైద్య పరికరాల విలువలో 20 శాతాన్ని రివార్డుగా ఇస్తారు. గరిష్ఠ పరిమితి రూ.25 లక్షలు. ప్రభుత్వోద్యోగులకు గరిష్ఠ పరిమితి రూ.5 లక్షలు. ఉద్యోగి సర్వీసు కాలంలో రివార్డుల మొత్తం గరిష్ఠ పరిమితి రూ.30 లక్షలు. రివార్డు మొత్తాన్ని విడతల వారీగా ఇస్తారు. తొలివిడత 25% ఛార్జిషీటు దాఖలైన వెంటనే, మలివిడత 25% కోర్టులో సాక్ష్యాధారాలు నిరూపణ అయ్యాక, తుదివిడత 50%తీర్పు వచ్చాక ఇస్తారు.
ఎవరికి సమాచారం ఇవ్వాలి?
ఎ.సి.ఎస్.రావు, సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ సబ్జోనల్ కార్యాలయం, యూనిట్ నెం.18, రెండో అంతస్తు, కార్డో శాటిలైట్ బిల్డింగ్, రాజీవ్గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, శంషాబాద్
ఫోన్ నెంబర్లు: 91-40- 24008270, 24008236
మొబైల్ నెంబరు: 94401 15452, 96187 27439
ఫ్యాక్స్ : 040- 24008270
మెయిల్: adchyderabad@gmail.com
-
పర్యావరణానికి, ప్రజల ఆరోగ్యానికి హాని చేసే కార్బన్ డై ఆక్సైడ్ (సీఓ2) నుంచి సూర్యరశ్మి సహాయంతో పెట్రోలును తయారు చేసే పరిజ్ఞానాన్ని శాస్త్రవేత్తలు అభివృద్ధి పరుస్తున్నారు. ఈ పరిజ్ఞానం ప్రపంచ ఇంధన అవసరాలు తీర్చడంలో ఉపయోగపడటంతోబాటు కార్బన్ ఉద్గారాలను కనిష్ఠ స్థాయికి తీసుకురావడంలో సహకరిస్తుందని వారు పేర్కొంటున్నారు. న్యూమెక్సికోలో అల్బుక్యుర్క్యూలోని శాండియా జాతీయ పరిశోధనశాలకు చెందిన శాస్త్రవేత్తల బృందం ఈ బృహత్తర ఆవిష్కరణకు కృషి చేస్తోంది. ఈ ఇంధనం ప్రస్తుతం కార్లు, ఇతర ఇంజిన్లు వంటి వాటిలో వినియోగిస్తున్న ఇంధనాలకు సరి సమానమైన దని పరిశోధకులు చెబుతున్నట్టు 'న్యూ సైంటిస్ట్' పత్రిక పేర్కొంది. కాలుష్య ఉద్గారాలతో భూతాపం పెరిగిపోతోందంటున్న వారికి కొంత ఉపశమనం కలిగే ఆవిష్కరణ అవుతుంది ఇది.
-
చైనా జనాభా అంతకంతకూ పెరిగి రాబోయే ఐదేళ్లనాటికి 139 కోట్లకు చేరుతుందని తాజా అధ్యయనంలో తేలింది. పెరుగుతున్న పట్టణ జనాభానే దీనికి కారణం. ఆశ్చర్యకరంగా మొదటిసారిగా గ్రామ జనాభాలో తగ్గుదల కనిపిస్తోంది. 2015 ముగిసేసరికి దేశ జనాభా 139 కోట్లకు చేరుతుందని, వీరిలో60 ఏళ్లకు మించి వయసున్న వారి సంఖ్య 20 కోట్లకుపైగా ఉంటుందని చైనాలోని ప్రధాన జనాభా సేకరణ సంస్థ తెలిపింది. చైనా అధికారిక లెక్కల ప్రకారం 2008లో ఆ దేశ జనాభా 132 కోట్లు. జనాభాకు అడ్డుకట్ట వేయడానికి చైనా 1970ల్లో 'ఒక్కరు చాలు' విధానాన్ని ప్రవేశపెట్టింది. దీన్ని కఠినంగా అమలుచేయడం ద్వారా 1949-1978తో పోలిస్తే 1978-2008 మధ్య చైనాలో 40% తక్కువ పెరుగుదల నమోదైంది.