-
కత్తులు, బల్లేలు పోయి
బాంబులు తుపాకులు
పదునెక్కిన చాకుల వలె
వున్నవిపుడు ఆకులు!
రాజ్యకాంక్షతోటి జరిపి
క్రూర దండయాత్రలు
రక్తంతో నింపారోయ్
మన చరిత్ర పాత్రలు!
క్లాసు పుస్తకాల్లో కాదు
కళ్ళముందే దారుణం
జరుగుతుంది చూడండోయి
''ఇరాకు''లోయ మరణం!
యుద్ధంలో నశించేది
పేదలు, సామాన్యులు
పదిలంగా వుండగలరు
ధనవంతులు - ధన్యులు!
మానవజాతికి పట్టిన
యుద్దజ్వరం తగ్గి
చల్లారితే మంచిదోయ్
ఈ పెట్రోల్ అగ్గి!
ప్రపంచాన యెక్కడైన
పసిమొగ్గలె పిల్లలు
లోకశాంతి కోరుకోండి
మరచిపోయి ఎల్లలు!
-దేవిప్రియ అంకుల్
(నేటి పరిస్థితికీ అద్దం పడుతున్న ఈ కవిత బాలచెలిమి డిసెంబర్ 1990లో
ప్రచురితమైంది. పత్రిక సంపాదకులు
వేదకుమార్ అభ్యర్థన మేరకు కవి
ప్రపంచశాంతిని వస్తువుగా తీసుకొని ఈ కవిత రాశారు. కవి వాక్కు నేటికీ అక్షర
సత్యం.)
-
ఒక చిన్న ఎలుక బయట ప్రపంచం ఎలా ఉంటుందో ఒక సారి చూసివద్దామని సరదాగా బయటికి
వెళ్ళి తిరిగి తిరిగి తన తల్లి దగ్గరికి వచ్చి సంతోషంగా తను చూసిన
విశేషాలు చెప్పడం ప్రారంభించింది.
'అమ్మా! అమ్మా! ఈ ప్రపంచం ఎంత సుందరంగా ఉందో' అంది ఆనందంగా చప్పట్లు చరుస్తూ.
బిడ్డ ఆనందానికి తల్లి ఎలుక సంతోషిస్తూ - 'ఇంతకీ ఏమేం చూశావ్'
అంది.'మరేమో, నేను రెండు జంతువుల్ని చూశాను. అందులో ఒకటి భయంకరంగా ఉంది..
రెండోదేమో చాలా చక్కగా ఉంది' అంది.
'ఇంతకీ అవి ఎలా ఉన్నాయో చెప్పు' అంది తల్లి ఎలుక.
'ఒకదానికి నల్లని కాళ్ళు, తలపై ఎర్రటి కుచ్చు, వాడి ముక్కు ఉన్నాయి.
శరీరమంతా ఈకలతో నిండిఉంది. నేను దగ్గరికి వెళ్ళ గానే గట్టిగా అరిచింది.
నాకు భయమేసి పరుగెత్తుకొచ్చా' అంది.
'అది కోడిపుంజు. దాన్నిచూసి భయపడనవసరం లేదు. మరి రెండవది ఎలా ఉంది?' అని ప్రశ్నించింది తల్లి.
'రెండో జంతువుకి తెల్లమెడ, మెత్తని పాదాలు ఉన్నాయి. శరీరమంతా దూదిలా
ఉంది. ముక్కపైన మీసాల్లాంటి వెంట్రుకలున్నాయి. అది నావైపే తేరిపార చూసింది.
అబ్బా అది ఎంత బాగుందో' అని చెప్పింది.
అదివిని వెంటనే తల్లి ఎలుక కంగారు పడుతూ -
'ఓసి వెర్రిదానా! అది పిల్లి. అదే మన శత్రువు. ఎప్పుడైనా ఆకారాన్ని
బట్టి మంచిది, చెడ్డది అని నిర్ణయించుకోవద్దు తెలిసిందా. ఇంకానయం అది
నిన్ను తినలేదు' అంటూ అక్కున చేర్చుకుంది అమాయకపు చిట్టి ఎలుకను.
-
లియో టాల్స్టాయ్ కథ
(బాలచెలిమి డిసెంబర్ 1990)