-
'1999 ఆర్క్యూ36' అనే భారీ గ్రహశకలం 2182లో భూమిని ఢీకొట్టనుందని, దీని తాకిడితో తీవ్ర వినాశనం కలుగుతుందని స్పెయిన్ శాస్త్రవేత్తలు హెచ్చరించారు. '1999 ఆర్క్యూ36' గ్రహశకలం భూమిని ఢీకొట్టే అవకాశం వెయ్యిలో ఒక వంతు మాత్రమే అయినప్పటికీ.. ఇది 2182లోనే సంభవించే అవకాశం అధికంగా ఉందని తెలిపారు. సుమారు 1,800 అడుగుల వ్యాసం గల ఈ శకలాన్ని 1999లో గుర్తించారు. ప్రస్తుతం సూర్యుడి వెనక ఉన్న దీనిని 2011లో మాత్రమే చూడగలం. ఇలాంటి భారీ శకలాన్ని దారి మళ్లించి భూమిని కాపాడేందుకు చేసే ఎలాంటి ప్రయత్నమైనా.. అది భూమిని ఢీకొట్టే సమయానికన్నా 100 సంవత్సరాల ముందే ప్రారంభించాల్సి ఉంటుంది. ఒకవేళ దీనిని 2080 వరకు గుర్తించకుండా ఉన్నట్టయితే అలాంటి ప్రయత్నాలేవీ ఫలించి ఉండేవి కావని శాస్త్రవేత్తలు చెప్పారు.
-
ప్రభుత్వ కార్యాలయాల్లో ఇకపై కాంపాక్ట్ ఫ్లోరసెంట్ లాంప్లను మాత్రమే ఉపయోగించాలంటూ తమిళనాడు ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. పాతకాలం నాటి ఇన్కాండెసెంట్ బల్బులను (గుబ్బ బల్బు) రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, సహకార సంస్థలు, స్థానిక సంస్థలు, ప్రభుత్వ సహాయం పొందుతున్న సంస్థల కార్యాలయాలలో ఉపయోగించరాదని ఉత్తర్వులు జారీ అయ్యాయి.
నాలుగు కోట్ల 60 వాట్ల ఇన్కాండెసెంట్ బల్బులకు బదులుగా 14 వాట్ల సిఎఫ్ఎల్లను ఉపయోగించటం వలన ఒక్క గంటకు 1840 మెగావాట్ల విద్యుత్తును ఆదా చేయవచ్చునని తమిళనాడు ప్రభుత్వం పేర్కొంటోంది. నాలుగు కోట్ల 60 వాట్ల ఇన్కాండెసెంట్ బల్బులను గంట సేపు వాడటం వలన 2400 మెగావాట్ల విద్యుత్ వ్యయం అవుతుంది. కాగా అదే సంఖ్యలో 14 వాట్ల సిఎఫ్ఎల్లను వాడటం వలన కేవలం 560 మెగావాట్ల విద్యుత్తు మాత్రమే ఖర్చు అవుతుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.