ప్రపంచం వేగంగా మారిపోతోంది. మారే ప్రపంచంతో పాటే మనమూ మారాలి. అడవిలో జంతువులన్నీ ఒకసారి ఇలానే అనుకొన్నాయి. అలా అనుకొని ఒక బడి పెట్టాలని నిర్ణయించాయి.
పరిగెత్తటం, ఎగరటం, ఈదటం, పాకటం - ఇలాంటివన్నీ జంతువులకు అవసరమని నిపుణులైన జంతువులు తేల్చి చెప్పాయి. వీటిని నేర్పేందుకు పాఠ్య పుస్తకాలు కూడా సిద్ధమయ్యాయి. ఈ విషయాలన్నిటినీ అన్ని జంతువులూ తప్పని సరిగా నేర్చుకోవాలి. ఉత్తీర్ణులవ్వాలి. ఇక బడి మొదలయ్యింది.
బాతు ఈదటంలో సిద్ధహస్తురాలు. నిజం చెప్పాలంటే, ఉపాధ్యాయురాలి కన్నా మిన్నగా ఈదేది. కానీ పరుగు పెట్టటంలో మాత్రం అందరి కంటే ఎంతో వెనుకపడింది. దాంతో బడి అయిపోయిన తర్వాత కూడా పరుగుల తరగతిలో ప్రాక్టీసు చేస్తూ ఉండాల్సి వచ్చింది. రోజులు గడుస్తున్నా పరిస్థితిలో మార్పు రాలేదు. ఈతకు వెళ్లటం కూడా మానేసి, పరుగుకే ఆ సమయాన్ని కూడా వెచ్చించటం మొదలు పెట్టింది. పరుగు పెట్టీ పెట్టీ, తెడ్ల లాంటి బాతు పాదాలు చీలి పోయాయి. కాళ్లు వాచి పోయాయి. ఇపుడు ఈతలో కూడా బాతు వెనుకబడింది.
ఇక కుందేలుకు కూడా ఇటువంటి కష్టమే వచ్చి పడింది. పరుగుల రాణికి ఈత అంటే వణుకు పుట్టుకొచ్చేది. ఈతలో వెనుకబడిన వారి కోసం ఏర్పాటు చేస్తున్న ప్రత్యేక తరగతులకు కుందేలు హాజరవుతోంది ఇపుడు.
ఉడుత చెట్లు ఎక్కటంలో నేర్పరే కానీ నేరుగా పక్షిలా ఎగరటం మాత్రం దానికి వల్ల కాలేదు. కొమ్మ మీద నుంచి కొమ్మకు దూకటం కాకుండా నేరుగా నేల మీద నుంచి పైకి ఎగరాలని ఉపాధ్యాయురాలు చెప్పింది. అలా నేర్చుకోవటం ఉడుతకు కుదరటం లేదు. చివరికి పరీక్షల్లో తప్పి కూర్చుంది ఉడుత.
ఇక ఇది ఇలా జరుగుతూ ఉండగా, ఎలుకల్లో అలజడి మొదలయింది. పాఠాల్లో ఎక్కడా బొరియలు తవ్వటాన్ని గురించి నేర్పక పోవటం అన్యాయమని అవి ఆందోళనకు దిగాయి. వాటికి పందికొక్కులు తోడయ్యాయి. ఇక ఈ బడిలో ఈ చదువులు తాము చదవలేమని అవి నిర్ణయించేశాయి. ప్రత్యామ్నాయ విద్య పేరుతో మరొక పాఠశాలను తెరిచాయి. ఇపుడు ఆ బడిలో కేవలం 'బొరియలు తవ్వటం' మాత్రమే నేర్పుతున్నారు.