-
వీడియోగేమ్లతో పిల్లల్లో చలాకీతనం పెరుగుతుందా? అవుననే అంటున్నారు న్యూయార్క్ పరిశోధకులు. వీడియోగేమ్లతో పిల్లలు సమయాన్ని వృథాచేస్తున్నారని పెద్దలు అనటం మనకు తెలిసిన విషయమే. వీడియోగేములు వారి చదువులు పాడుచేస్తున్నాయని నిందలున్నా, పిల్లలు సకాలంలో సరైన నిర్ణయం తీసుకునే శిక్షణ సాధనంగా అవి ఉపకరిస్తున్నాయని ఒక పరిశోధనలో వెల్లడయింది.
ముఖ్యంగా పోరాట సన్నివేశాలుండే వీడియోగేమ్లు ఆడే పిల్లల్లో తమ చట్టూ ఏం జరుగుతుందో సునిశితంగా పసిగట్టే నైపుణ్యం, కచ్చితమైన, వేగవంతమైన నిర్ణయం తీసుకునే సామర్థ్యం పెరగడానికి అవి దోహదం చేస్తున్నట్లు న్యూయార్క్లోని రోచెస్టర్ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు కనుగొన్నారు.
-
చౌమొహల్లా ప్యాలెస్కు యునెస్కో హెరిటేజ్ మెరిట్ అవార్డు లభించింది. హైదరాబాద్ రాజధానిలోని చారిత్రక చార్మినార్ సమీపంలోని
'చౌమొహల్లా ప్యాలెస్' మరోమారు అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జించింది. ఈ రాజప్రాసాదానికి 'యునెస్కో ఆసియా పసిఫిక్ హెరిటేజ్
మెరిట్ అవార్డు' లభించింది. ఆసఫ్జాహీ పాలకుల అధికార భవనంగా చరిత్రకెక్కిన ఈ ప్యాలెస్ను దేశ విదేశాల ప్రముఖులు సందర్శించి ముగ్ధులయ్యారు. మూడు నెలల క్రితం ప్యాలెస్ అధికారులు ఈ అద్భుత కట్టడ విశిష్టత, పరిరక్షణ ఫొటోలను యునెస్కో హెరిటేజ్ అవార్డు నిమిత్తం కమిటీకి పంపారు. మరో 13 దేశాలు కూడా పోటీపడ్డాయి. కాగా చౌమొహల్లా ప్యాలెస్కు అవార్డు వరించింది. బ్యాంకాక్లోని పది మంది సభ్యుల కమిటీ ఈ అవార్డును ప్రకటించింది.
-
పదో తరగతి మార్కుల ధ్రువీకరణ పత్రంలో తల్లి పేరును కూడా ముద్రించాలని విద్యాశాఖ నిర్ణయించింది. మాధ్యమిక విద్యాశాఖ మంత్రి మాణిక్య వరప్రసాదరావుకు అందిన విజ్ఞప్తులపై పరిశీలన జరిపిన ముఖ్య కార్యదర్శి డి.సాంబశివరావు ఈ మేరకు ఉత్తర్వులు జారీచేశారు. మార్కుల ధ్రువీకరణ పత్రంలో ప్రస్తుతం తండ్రి పేరును మాత్రమే ముద్రిస్తున్నారు. కొత్త విధానం ప్రకారం తండ్రి పేరుతోపాటు తల్లి పేరును కూడా అదనంగా ముద్రిస్తారు. తల్లిపేరు మాత్రమే ఉండాలని కోరుకున్నా కూడా అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటారు. తండ్రి పేరు మాత్రమే ఉండాలని కూడా విద్యార్థి కోరుకోవచ్చు.
వచ్చే ఏడాది జరిగే పదవ తరగతి పరీక్షల కోసం దరఖాస్తు చేసే విద్యార్థులు తమ దరఖాస్తుల్లో తల్లి పేరు కావాలా, తండ్రి పేరు కావాలా లేక ఇద్దరి పేర్లు కావాలా అన్నది స్పష్టంగా పేర్కొనాలి. ఈ విషయంలో విద్యార్థికి పూర్తి స్వేచ్ఛ ఉంటుంది.