-
సమాజాన్ని మార్చేది నేటి పిల్లలేనని,
ప్రస్తుత సమాజంలో బాలల కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉందని
తెలంగాణ రాష్ట్ర బీసీ కమీషన్ ఛైర్మన్ జూలూరీ గౌరీశంకర్ పేర్కొన్నారు.
బాలసాహిత్యం - నా అనుభవాలు - సూచనలు అనే అంశంపై బాలచెలిమి పిల్లల వికాస
పత్రిక, చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో శనివారం
ఆక్స్ఫర్డ్ గ్రామర్ స్కూల్లో 'బాలచెలిమి ముచ్చట్లు' 12వ కార్యక్రమాన్ని
నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ
సమాజంలో పిల్లలు పావు వంతు ఉన్నారని, వాళ్ళకు బంగారు భవిష్యత్తు
ఉందన్నారు. పిల్లలను సమర్థులను చేస్తేనే తెలంగాణ రాష్ట్రం
పురోగమిస్తుందన్నారు. జ్ఞాన తెలంగాణనే బంగారు తెలంగాణను
ప్రతిష్టిస్తుందన్నారు. ఏప్రిల్ మాసం నుంచి చందమామ లాంటి చిన్న పిల్లల
మాసపత్రిక 'బాలచెలిమి' రానుండటం గర్వకారణం అన్నారు. చిల్డ్రన్స్
ఎడ్యుకేషనల్ అకాడమి ఛైర్మన్ మణికొండ వేదకుమార్ నేతృత్వంలో 'బాలచెలిమి'
మాసపత్రిక రావటాన్ని అభినందిస్తున్నట్లు తెలిపారు. పెద్దల కోసం ఎన్నో
పత్రికలు ఉన్నాయని, కానీ పిల్లలకు విరివిగా పత్రికలు రావల్సి ఉందన్నారు. ఆ
మార్గంలో బాలచెలిమి పిల్లల మాసపత్రిక రావడం శుభసూచికం అన్నారు. బాలచెలిమి
చర్చా వేదిక ఒక సంవత్సర కాలం పూర్తి చేసుకోవడం గర్వకారణం అన్నారు.
కవి, రచయిత యాకూబ్ మాట్లాడుతూ బాల్యం ఎంతో అందమైనదని, మనిషిని ఎలా
ప్రేమించాలో బాల్యంలోనే నేర్పించాల్సిన బాధ్యత తల్లిదండ్రులు, ఉపాధ్యాయులపై
ఉందన్నారు. కవి, రచయిత, నేషనల్ బుక్ ట్రస్ట్ చైర్మన్ పత్తిపాక మోహన్
మాట్లాడుతూ చిన్నప్పుడు చదివిన బాల సాహిత్యమే పెద్దవాళ్లు అయిన తరువాత మంచి
జీవితాన్ని ప్రసాదిస్తుందన్నారు. రచయిత, ఫోటోగ్రాఫర్ కందుకూరి రమేష్
బాబు మాట్లాడుతూ పిల్లలను రచయితలుగా అంగీకరించాల్సిన బాధ్యత పెద్దలపై
ఉందన్నారు. 'బాల చెలిమి' 12 నెలలు పూర్తి చేసుకున్న సందర్భంగా సంవత్సరం
కాలంలో కార్యక్రమాల ముచ్చట్లను పుస్తక రూపంలో తీసుకొచ్చి సమావేశంలో ప్రదానం
చేశారు. కార్యక్రమంలో యు. విజయశేఖర రెడ్డి, డా.సిరి, అహోబిలం ప్రభాకర్,
కె. ప్రభాకర్, కో-ఆర్డినేటర్ తదితరులు పాల్గొన్నారు.
-
బాలలను మార్చేది బాల సాహిత్యమేనని తెలంగాణ
రాష్ట్ర బీసీ కమీషన్ ఛైర్మన్ బి.ఎస్.రాములు పేర్కొన్నారు. బాలసాహిత్యం -
నా అనుభవాలు - సూచనలు అనే అంశంపై బాలచెలిమి పిల్లల వికాస పత్రిక,
చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో శనివారం ఆక్స్ఫర్డ్
గ్రామర్ స్కూల్లో నిర్వహించిన 'బాలచెలిమి ముచ్చట్లు' 11వ కార్యక్రమానికి
ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
చిన్నతనంలో తండ్రి లేకపోవడంతో తల్లి సంరక్షణలో పెరిగానని తద్వారా స్వేచ్ఛ
ఎక్కువగా ఉండేదన్నారు. దీంతో చందమామ, బాలమిత్ర వంటి కథల పుస్తకాలు చదవడంతో
బాల సాహిత్యంపై అవగాహన పెరిగిందన్నారు. తాను 1967లో జగిత్యాల కథను
రాశానని, ఈ కథ బాల మిత్రలో అచ్చు అయినట్లు తెలిపారు. తొమ్మిదవ తరగతి నుండే
రచనలు, ఉపన్యాసాలు ఇవ్వడంతో పెన్నులు, పెన్సిల్ల్లాంటి బహుమతుల నుండి
అవార్డుల వరకు అనేకం వచ్చినట్లు వివరించారు. పిల్లలను తల్లిదండ్రులు
ప్రోత్సహిస్తేనే వాళ్లలోని సృజనాత్మకత వెలుగులోకి వస్తుందన్నారు. పిల్లలు
రాస్తున్నప్పుడు వారిని ప్రోత్సహించాలని లేకపోతే వారిలోని నైపుణ్యం మరుగున
పడుతుందన్నారు.
చిల్డ్రన్స్ ఎడ్యుకేషనల్ అకాడమి ఛైర్మన్ మణికొండ వేదకుమార్
మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తరువాత జరిగిన ప్రపంచ తెలుగు మహాసభల్లో
బాల సాహిత్యంపై ప్రత్యేక చర్చ నిర్వహించినట్లు తెలిపారు. అందులో భాగంగా
పిల్లలకోసం 'బాల చెలిమి' పత్రికను తిరిగి ప్రారంభించాలని చర్చించడంతో ఈ బాల
చెలిమి ముచ్చట్లు కార్యక్రమం ప్రతి నెల రెండవ శనివారం నిర్వహిస్తున్నట్లు
తెలిపారు. దక్కన్ ల్యాండ్ మాసపత్రిక ప్రారంభించినప్పుడు కొంచెం
వెనుకాడాము కానీ నేడు 77 సంచికలు తీసుకొచ్చి ధైర్యంగా ముందుకు
వెళ్తున్నట్లు తెలిపారు. అదే ఉత్సాహంతో బాల చెలిమి పత్రికను కూడా త్వరలోనే
తీసుకు రాబోతున్నట్లు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రముఖ రచయిత
కల్లూరి ప్రభాకర్ చారి రచించిన 'చిరుదీపం' పిల్లల పుస్తకాన్ని
ఆవిష్కరించారు.
కార్యక్రమంలో కవి, రచయిత్రి డా|| శిలాలోలిత, రచయిత్రి శ్రీమతి దాసరి
శాంతకుమారి, పత్తిపాక మోహన్, గుడిపూడి సుబ్బారావు, జుగాష్విలీ, నాళేశ్వరం
శంకరం, సయ్యద్ షాబీర్, పద్మావతి, బాల్రాజ్, ఖైజర్, కె. ప్రభాకర్,
కో-ఆర్డినేటర్ తదితరులు పాల్గొన్నారు.
-
బాల సాహిత్యం సృష్టించబడాలని డాక్టర్ ఏనుగు
నర్సింహారెడ్డి పేర్కొన్నారు. బాలసాహిత్యం - నా అనుభవాలు - సూచనలు అనే
అంశంపై బాలచెలిమి పిల్లల వికాస పత్రిక, చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ అకాడమీ
సంయుక్త ఆధ్వర్యంలో శనివారం ఆక్స్ఫర్డ్ గ్రామర్ స్కూల్లో నిర్వహించిన
'బాలచెలిమి ముచ్చట్లు' 10వ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై
మాట్లాడారు. పిల్లలకు అద్భుతాలు చెబితే ఆసక్తిగా ఉంటుందని తద్వారా వారు
భిన్నమైన కోణంలో కొత్తగా ఆలోచించడానికి అవకాశం ఉంటుందన్నారు. బాలలకు
సాహిత్యంతోపాటు కళలు, పెయింటింగ్ మొదలైన వాటిపై ఆసక్తి ఉంటుందని
తల్లిదండ్రులు పిల్లలును ఆ దిశగా ప్రోత్సహించాలన్నారు. పిల్లలకు గ్రహణశక్తి
ఎంతో ఉంటుందని చెప్పారు. బాల సాహిత్యంపై నేటి పిల్లలకు అవగాహన
కల్పించాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపై అన్నారు. ఈ సందర్భంగా ఆయన బాలలపై
వచ్చిన పలు పుస్తకాలపై ముచ్చట్ల రూపంలో వివరించారు.
తెలంగాణ సారస్వత పరిషత్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ జె. చెన్నయ్య
మాట్లాడుతూ ప్రపచం, భారతదేశంలో బాలల సాహిత్యానికి సుదీర్ఘమైన చరిత్ర ఉందని
పేర్కొన్నారు. గతంలో ఎన్నో పత్రికలు ఆకాశవాణి వంటి, బాలానంద వంటి ఎన్నో
అద్భుతమైన కార్యక్రమాలు నిర్వహించి పిల్లలకు చేరువ అయినట్లు తెలిప్పారు.
విద్యావిధానంలో తెలుగుకు స్థానం తగ్గిపోవడం వల్ల బాలల సాహిత్యంపై పెద్దగా
పుస్తకాలు రాకపోవడం బాధాకరం అన్నారు.
ముక్తా ఫౌండర్ మెంబర్ కటికనేని
విమల, ప్రజా సైన్స్ వేదిక రాష్ట్ర అధ్యక్షులు సి.ఎ.ప్రసాద్ మాట్లాడుతూ
సాహిత్య కారులు, ఆర్టిస్టులు బాలల ప్రపంచంలోకి వెళ్లితేనే వారు అందమైన
చిత్రాలు గీయగలరని తెలిపారు. సాహిత్యంలోకి వెళ్లితే ఎన్నో అందమైన అద్భుతాలు
ఆవిష్కృతమవుతాయన్నారు. అద్భుతాన్ని చూపించేది ఏదైనా బాల సాహిత్యమే
అన్నారు.
కార్యక్రమానికి అధ్యక్షత వహించిన డా. పత్తిపాక మోహన్ మాట్లాడుతూ
చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ అకాడమీ చైౖర్మన్ మణికొండ వేదకుమార్ బాలల కోసం
ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించడం గర్వకారణం అన్నారు.
కార్యక్రమంలో కళాకారుడు, చిత్రకారుడు బాబు దుండ్రపల్లి, ఆర్టిస్ట్
సిరిస్వామి, డాక్టర్ వి.ఆర్.శర్మ, నాళేశ్వరం శంకరం, జుగాష్విలీ,
ప్రార్థన, సయ్యద్ షాబీర్, వెంకటమ్మ, బాల్రాజు, ఖైజర్, కె. ప్రభాకర్,
కో-ఆర్డినేటర్ తదితరులు పాల్గొన్నారు.
డైరెక్టర్ గోళం రెజా రమేజాని దర్శకత్వం హించిన 'హయత్' హిందీ షార్ట్ ఫిల్మ్ను ఈ సందర్భంగా ప్రదర్శించారు.