-
భాషకు మూలం అక్షరాలని, చదవగల్గిన, రాయగల్గిన విద్యార్థులు
ఆత్మవిశ్వాసంతో విద్యాభ్యాసం చేస్తారని ప్రముఖ విద్యాసంస్థల అధినేత
నల్లమల్లారెడ్డి పేర్కొన్నారు. అక్షరాలు దిద్దుతూ పలకాలని, పలుకుతూ
దిద్దాలని, శిశు తరగతిలోనే విద్యార్థులకు గట్టి పునాది పడాలన్నారు.
బాలసాహిత్యం - నా అనుభవాలు - సూచనలు అనే అంశంపై బాలచెలిమి పిల్లల వికాస
పత్రిక, చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో శనివారం
ఆక్స్ఫర్డ్ గ్రామర్ స్కూల్లో 'బాలచెలిమి ముచ్చట్లు' 13వ కార్యక్రమాన్ని
నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మల్లారెడ్డి
మాట్లాడుతూ నేడు 95శాతం మంది విద్యార్థులకు అక్షరాలు దిద్దడం, రాయడం
రావట్లేదని పలు సర్వేలు చెప్పడం ఆందోళనకరం అన్నారు. కానీ వాళ్లను సరైన
మార్గంలో పెట్టే ఆలోచన చేయకపోవడం బాధకరం అన్నారు. పాఠశాలల్లో 10వ తరగతి
లోపు పిల్లలకు సొంత వాక్యాల్లో రాయడం, చదవడం నేర్పించాల్సిన అవసరం ఎంతైనా
ఉందన్నారు. పిల్లలకు ఎక్కడ పునాది వేయాలో అక్కడ పునాది వేస్తే
విద్యార్థి కెరీర్ అభివృద్ధి చెందుతుందన్నారు. పిల్లలకు మంచి పుస్తకాలు
చదివేలా ప్రోత్సహించాలన్నారు. విద్యార్థులకు విద్యాభోజనం పెట్టాలని,
పిల్లల్లో సృజనాత్మకత పెంపొందించాల్సిన బాధ్యత విద్యాసంస్థలపై వుందన్నారు.
టీచర్లకు భాషతో పాటు సబ్జెక్టు వుండాలన్నారు. పిల్లలతో పాటు టీచర్లు కూడా
నేర్చుకోవాలని సూచించారు.
సభాధ్యక్షులు, బాలచెలిమి సంపాదకులు మణికొండ వేదకుమార్ మాట్లాడుతూ
అందమైన అక్షరాలు రాయగల్గినప్పుడు పిల్లలకు మంచి నాలెడ్జ్ వస్తుందన్నారు.
మంచి అక్షరాలు మనసుని ఉల్లాసంగా ఉంచుతాయని అక్షరాలు ఎంత నేర్చుకుంటే అంత
జ్ఞాన సంపద పెరుగుతుందన్నారు. పిల్లలు చిన్నప్పుడే భాషపై పట్టు
సంపాదించుకొని భవిష్యత్తుకు పునాది వేసుకోవాలన్నారు.
డాక్టర్ వి.ఆర్. శర్మ మాట్లాడుతూ తన బాల్యంలో అక్షరాలను ఇసుకలో
రాసుకొనేవాళ్ళమని అన్నారు. పిల్లలకు చదవడం రాయడం అభ్యసించడం రావడం లేదని
దానికి కారణం ఉపాధ్యాయులే అంటూ నెపం నెట్టుతున్నట్లు తెలిపారు. కానీ అది
సరైంది కాదన్నారు. పిల్లలకు అక్షర జ్ఞానం వస్తే ఎన్ని పుస్తకాలైనా, ఎంత
జ్ఞానమైనా సంపాదించు కోవచ్చన్నారు. రిటైర్డ్ టీచర్ డా. జి లచ్చయ్య, రచయిత
చైతన్య పింగళి, చేతివ్రాత నిపుణులు వై. మల్లిఖార్జునరావు, ఉపాధ్యాయురాలు
ఫాతిమా ఖాజిమ్, కె. ప్రభాకర్,
కో-ఆర్డినేటర్ తదితరలు తమ అనుభవాలను పంచుకున్నారు.