-
మారుతున్న కాలానుగుణంగా పిల్లల ఆలోచనా విధానంలో కూడా వస్తున్న
మార్పులను గమనిస్తూ బాలలకు సంబంధించిన రచనలను చేయాల్సిన అవసరం ఎంతో ఉందని
ప్రముఖ కవి, గాయకులు, ముఖ్యమంత్రి కార్యాలయ ప్రత్యేక అధికారి దేశపతి
శ్రీనివాస్ అన్నారు. బాలసాహిత్య వికాసం - మనం, మన ఆలోచనలు అన్న అంశంపై
శనివారం సాయంత్రం హిమయాత్నగర్ ఆక్స్ఫర్డ్ గ్రామర్ స్కూల్లో
చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ అకాడమి ఆధ్వర్యంలో జరిగిన 'బాలచెలిమి ముచ్చట్లు'
కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. పిల్లలో మానసిక పరిణతిని
పెంపొందిస్తూ ప్రజాస్వామిక భావాలను, వైజ్ఞానిక దృష్టిని కల్గించే రచనలు
రావల్సిన అవసరం ఉందని చెప్పారు. వెలుగు సోకని ప్రపంచంపై సూర్యకిరణాలు
ప్రసరించినట్లు బాలల ఆలోచనా పరంపరను రచయితలు ప్రభావితం చేసి ముందుకు
నడిపించాలని సూచించారు. అవసరమైన, అర్థవంతమైన రచనలను పిల్లలకు అందిస్తే
సామాజిక సంస్కారం పెంపొంది ఉత్తమ పౌరులుగా వారు ఎదుగుతారని తెలిపారు.
పిల్లల మనసుమీద ముద్రపడి చిరకాలం గుర్తిండిపోయేవి కథలు, పాటలని చెబుతూ ఆ
దిశగా ప్రయత్నాలను రచయితలు ముమ్మరం చేయాలని చెప్పారు. దుర్భర పరిస్థితిని
బాల్యం ఎదుర్కోకుండా అండగా నిలిచి కాపాడేది సాహిత్యమేనని తెలిపారు.
పిల్లలకు సంబంధించిన పలు గేయాలను దేశపతి పాడి వినిపించారు.
కార్యక్రమానికి అధ్యక్షత వహించిన చిల్డ్రన్స్ అకాడమి ఛైర్మన్ యం.
వేదకుమార్ మాట్లాడుతూ పిల్లల గుండెను తాకే సాహిత్యాన్ని అందించి తద్వారా
సమాజానికి మంచి పౌరులను అందించే కృషిలో భాగంగా రచయితలను, అనుభవజ్ఞులతో
బాలచెలిమి ముచ్చట్లను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. తెలంగాణ ప్రాంతం నుండి
నిష్ణాతులైన కవులు, రచయితలు ప్రమాణాలతో కూడిన బాల సాహిత్యాన్ని ఇటీవలి
కాలంలో ఎక్కువగా అందిస్తున్నారని అన్నారు.
ప్రముఖ రచయిత్రి గోగు శ్యామల మాట్లాడుతూ.. బాల్యాన్ని ప్రతిబింబించే
రచనలు కనుమరుగవకుండా చూడాల్సిన బాధ్యత రచయితలపై ఉందని చెప్పారు. మారుతున్న
పిల్లల భావజాలానికి అనుగుణంగా అంతరాలను గమనిస్తూ రాయడం కూడా రచయితలకు
ఇప్పుడు సవాలే నని అభిప్రాయపడ్డారు. ప్రముఖ రచయిత వాణిశ్రీ మాట్లాడుతూ..
వికాస పరిణామాన్ని బాలల్లో పెంపొందించే రచనల అవసరం ఇప్పుడుందని చెప్పారు.
ప్రముఖ చిత్రకారులు ఆనంద్ మాట్లాడుతూ అద్భుతమైన కథలకు అలరించే బొమ్మలు
తోడైతే బాలలకు దక్కే ఆనందాన్ని మాటల్లో వర్ణించలేమని అన్నారు. ఐఏఎస్
అధికారి, ప్రముఖ రచయిత దాసరి శ్రీనివాసులు మాట్లాడుతూ పెరుగుతున్న సాంకేతిక
ప్రపంచంలో పిల్లల అభిరుచులు, అలవాట్లు వేగవంతంగా మారుతున్న స్థితిని
గమనిస్తూ మార్గదర్శనం అందించే రచనలను రచయితలు చేయాలని చెప్పారు. ప్రముఖ
బాలల రచయిత తిరునగరి వేదాంత సూరి మాట్లాడుతూ పిల్లల కోసం రచనలు చేయడమంటే
వారితో మమేకమవ్వడమేనని అన్నారు. బాల సాహిత్యంలో జీవిత ప్రతిబింబం ఉండాలని
చెప్పారు.
ఈ కార్యక్రమంలో ప్రముఖ రచయితలు డా.నాళేశ్వరం శంకరం, డా. ఎస్.రఘు,
డా.వి.ఆర్.శర్మ, సామిడి జగన్రెడ్డి, కూరెళ్ల శ్రీనివాస్, అనిల్ బత్తుల,
తిరునగరి శ్రీనివాస్, రాజా వాసిరెడ్డి మల్లీశ్వరి, యం. ప్రార్థన,
రామాంజుల, సబిత, విజయ, వెంకటమ్మ, మీనా, మోసిన్, బాల్రాజ్ గౌడ్, బాల
సాహిత్య అభిమానులు హాజరయ్యారు.