-
బాలల మానసిక పరిణితిని పెంచే విలువలున్న అంశాలను రచనలుగా తీసుకు రావల్సిన బాధ్యత బాలల రచయితలపై ఉందని టీఎస్పీఎస్సీ ఛైర్మన్ ఘంటా చక్రపాణి అన్నారు. బాలసాహిత్యం ప్రభావం అనే అంశంపై బాలచెలిమి పిల్లల వికాస పత్రిక, చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో శనివారం ఆక్స్ఫర్డ్ గ్రామర్ స్కూల్లో నిర్వహించిన 'బాలచెలిమి ముచ్చట్లు' కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. అభూత కల్పనలు, అవాస్తవాలు లేని మంచి కథలు పిల్లల కోసం రావాలని చెప్పారు. పిల్లల్ని పెంచే పద్దతిలోనే అభివృద్ధి దిశను సూచించే స్థితి కనిపించాలని అభిప్రాయపడ్డారు. అత్యంత వెనుకబడిన దేశాలలో కూడా అద్భుతంగా పిల్లల మానసిక స్థితిని పెంచే సాహిత్యం వస్తున్నదని తెలిపారు. బాలల రచయితలు వాస్తవాలను ప్రతిబింబించే స్ఫూర్తివంతమైన రచనలకే ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు. పిల్లలలో స్థిరమైన శక్తులను పెంచే రచనలను తల్లిదండ్రులు, సమాజం ప్రోత్సహించాలని సూచించారు.
పిల్లల స్థాయిలో ఆలోచించి వారి భావోద్వేగాలను గమనిస్తూ రాబోయే పరిణామాలు, ప్రభావాలను బేరీజు వేసుకొని రచనలను చెయ్యవల్సిన అవసరాన్ని బాలల రచయితలు గమనించాలని ప్రముఖ రచయిత డా. దేవరాజ్ మహారాజ్ సూచించారు. మానవీయ విలువలను పెంపొందించే లక్ష్యంగా రచనలు ఉంటే పిల్లల్లో గుణాత్మకమైన అభివృద్ధి సాధ్యమవుతుందని అభిప్రాయపడ్డారు. సాంకేతిక సాధనాలు పెరిగిన ప్రస్తుత తరుణంలో మారిన అభిరుచులను రచయితలు గమనంలోకి తీసుకోవాలని ఆయన చెప్పారు. ప్రముఖ రచయిత్రి కందేపి రాణీప్రసాద్ మాట్లాడుతూ.. ఆట పాటల ద్వారా మానసిక తృప్తిని, పరిణితిని పిల్లల్లో పెంచేందుకు తాను చేస్తున్న కృషిని వివరించారు. రచనలు చేసే ముందే ఆ రచన ప్రభావం చదివే పిల్లలపై ఏమేరకు ఉంటుందో ఊహించి ముందుకు సాగాల్సిన బాధ్యత బాలల రచయితలపై ఉందని తెలిపారు. ఉస్మానియా విశ్వవిద్యాలయ కోఠి మహిళా కళాశాల తెలుగు విభాగం అధ్యక్షులు డా. ఎస్.రఘు మాట్లాడుతూ.. పిల్లల హృదయాలని అంతర్గతంగా ఆలోచించ గల్గినప్పుడు రచనల్లో ప్రత్యేకత ఏర్పడుతుందని అన్నారు. పిల్లల స్థాయికి దిగి రాసే రచయితలు తమ అనుభవాలను అతి సరళంగా అందించ గల్గినప్పుడు బాలసాహిత్యం లక్ష్యం నెరవేరుతుందని చెప్పారు. ప్రముఖ చిత్రకారులు, రచయిత రమణ జీవి మాట్లాడుతూ.. పిల్లల కోసం రాసే ముందే వారికి సంబంధించిన అనేక అంశాలపై రచయితల్లో స్పష్టమైన ప్రణాళిక ఏర్పడి ఉండాలని అన్నారు. పిల్లల కోసం రాయడం ఒక గొప్ప సృజనాత్మక కార్యక్రమని తెలిపారు.
కార్యక్రమానికి అధ్యక్షత వహించిన చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ సొసైటీ ఛైర్మన్ వేదకుమార్ మణికొండ మాట్లాడుతూ బాల సాహిత్య రంగంలో నిష్ణాతులైన ప్రముఖులు పాల్గొంటున్న బాల చెలిమి ముచ్చట్లు కార్యక్రమాన్ని ప్రింట్, ఎలక్ట్రానిక్ రూపాలలో అందించేందుకు సొసైటీ ద్వారా సిద్ధమవుతున్నామని చెప్పారు. బాలల సంపూర్ణ వికాసమే లక్ష్యంగా బాలచెలిమి కొనసాగుతుందని తెలిపారు. కార్యక్రమానికి రామానందతీర్థ ఇనిస్టిట్యూట్ డైరెక్టర్ కిశోర్, సాహితీవేత్తలు ఉదారి నారాయణ, తిరునగరి శ్రీనివాస్, అనిల్ బత్తుల, సునీత, లక్ష్మి శైలజ, టిటిఎఫ్ ప్రభాకర్, ప్రమోద్, ధనుంజయ , కె. ప్రభాకర్, కో-ఆర్డినేటర్ తదితరులు పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో బాల సాహిత్యాభిమానులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పిల్లల కోసం ఫ్రెంచ్ భాషలో 1956లో రూపొందిన ఫాంటసీ షార్ట్ ఫిల్మ్ 'ది రెడ్ బెలూన్, చిల్డ్రన్ ఫిల్మ్ సొసైటీ ఆఫ్ ఇండియా' రూపొందించిన సురభి షార్ట్ ఫిల్మ్ను ప్రదర్శించగా, జరిగిన ఓపెన్ ఫోరంలో విద్యార్థులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేయగా, అనిల్ బత్తుల సమన్వయ కర్తగా వ్యవహరించారు.