-
మనం ఏదైనా సైకిల్ను కొంటే దానికి మహా అయితే ఏడాది గ్యారంటీ ఇస్తారు. కానీ దీనికి భిన్నంగా, 25 ఏళ్లు పాటు సైకిల్కు గ్యారంటీ ఇస్తానంటూ ఓ కంపెనీ ముందుకు వచ్చింది. ఈ తరహా గ్యారంటీ దేశంలోనే ప్రప్రథమం. అయితే ఇందుకు కొంత అదనంగా చెల్లించాలని చెప్తోంది. ఈ కంపెనీ 'బుల్పవర్' పేరుతో కొత్త సైకిళ్ల శ్రేణిని మార్కెట్లోకి తీసుకువచ్చిన హై బర్డ్. ఇది లూధియానా కేంద్రంగా పనిచేస్తున్న కంపెనీ.
''సాధారణ శ్రేణికి చెందిన సైకిళ్ల ధరలు రూ.2,500 నుంచి రూ.3,000 మధ్య ఉంటాయి. బుల్పవర్ సైకిల్ ధర రూ.4,000 ఉంటుంది. సైకిల్లో కీలకమైన భాగాలైన ఫ్రేమ్, ఫోర్క్లకు ఈ గ్యారంటీ వర్తిస్తుంది. ఈ సైకిల్ను కొనుగోలు చేసిన తరువాత 25 సంవత్సరాల్లో ఎపుడైనా ఫ్రేమ్, ఫోర్క్లలో లోపం తలెత్తితే మేం వాటిని మార్చి కొత్తవి వేసి ఇస్తాం. ఈ మోడల్కు వాడిన ముడిపదార్థాలను ప్రత్యేక క్వాలిటీ లోహంతో రూపొందించాం. భారీ బరువును తట్టుకొనేటట్లు దీనికి విశిష్ట డిజైన్ను అందించాం.'' అని కంపెనీ ఛైర్మన్ అంటున్నారు. -
సబ్బు బుడగలను తయారు చేసే పద్ధతి అందరికీ తెలిసినదే. చిక్కని సబ్బు ద్రవంలో బొబ్బాసి గొట్టం ముంచి, గొట్టపు రెండో కొన నోట్లో పెట్టుకొని నెమ్మదిగా ఊదితే సబ్బు బుడగలు తయారవుతాయి. ఈ బుడగల చేత నాట్యం చేయించే కిటుకు ఒకటి ఉంది. అదిప్పుడు మీకు చెపుతాను.
లోతైన విశాలమైన గాజు గిన్నెలో నాలుగైదు చెమ్చాల కార్బన్ టెట్రా క్లోరైడ్ ద్రవం పోసి, ఆ గిన్నెను వేడి నీళ్ళు పోసిన పళ్ళెంలో ఉంచాలి. అయిదు, పది నిమిషాలు పోయాక ఆ గాజు గిన్నెలోకి మూడు, నాలుగు సబ్బు బుడగలు నింపాదిగా విడిచి చూడండి. ఆ సబ్బు బుడగలు పైకీ, కిందికీ తమాషాగా నాట్యం చేస్తాయి. సబ్బు బుడగలు తేలిక అయినప్పటికీ గాలి కన్నా బరువైనవి కావడం చేత నిశ్చలమైన గాలిలో నెమ్మదిగా కిందికి దిగుతాయి. కానీ, కార్బన్ టెట్రాక్లోరైడ్ ఆవిరి గాలి కన్నా సుమారు ఐదు రెట్లు బరువైనది కావడం చేత గాలితో నిండిన సబ్బు బుడగలు ఈ ఆవిరిలో పైకి తేలుతాయి, హైడ్రోజన్ నింపిన రబ్బరు బుడగలు గాలిలో పైకి తేలినట్లే. అయితే గాజు గిన్నెలో మట్టు దగ్గర ఈ ఆవిరి ఎక్కువ దట్టంగాను, పైకి వెళ్ళిన కొద్దీ పలుచ గానూ ఉండటం చేత సబ్బు బుడగలు కిందికి దిగుతూ మట్టు దగ్గరకి రాగానే కనిపించని చిత్రమైన 'కుషన్' ఏదో ఉన్నట్లు పైకి గెంటబడుతాయి. బుడగలు పైకి వెళ్ళిన కొద్దీ వాటి బరువును నిలబెట్ట గలిగినంత దట్టమైన ఆవిరి లేకపోవడం చేత అవి మళ్ళీ కిందికి దిగుతాయి.
గాజు గిన్నెలోని కార్బన్ టెట్రా క్లోరైడ్ పూర్తిగా ఆవిరి అయిపోయేదాకా సబ్బు బుడగలు చూస్తున్న వారికి ఈ విధంగా నృత్య వినోదంతో కాలక్షేపం కలిగిస్తాయి. -
అడవిలో ఒక ఉడుత ఉండేది. అది రోజూ అడవిలో దొరికే పండ్లు, లేత చిగుళ్ళు తిని ఆనందంగా ఒక చెట్టు మీది నుండి ఇంకో చెట్టు మీదికి దుముకుతూ ఉండేది.
ఒక రోజు ఉడుత ఒక చెట్టు మీది నుండి ఇంకో చెట్టు మీదికి దుముకుతూ పట్టు తప్పి ఆ చెట్టు కింద నిద్రిస్తున్న తోడేలుపై పడింది. తోడేలుకు నిద్ర చెడింది.
వెంటనే అది కోపంగా ఉడుతను పట్టుకుని ''నా నిద్ర చెడగొడతావా? నిన్నిప్పుడు ఏం చేస్తానో చూడు. నమలకుండా, గుటుక్కున మింగేస్తాను'' అంది.
''దయచేసి నన్ను ఒదిలిపెట్టు'' అని బతిమాలింది ఉడుత.
''సరే నిన్ను ఒదిలిపెడతాను. కానీ నేనడిగే ప్రశ్నకు జవాబు చెప్పు'' అంది తోడేలు.
''సరే'' అన్నది ఉడుత.
'మీరు ఇంత ఆనందంగా ఎలా ఉండగలుగుతున్నారు. ఆడుతూ, గంతులేస్తూ ఏ చీకూ చింత లేకుండా ఉంటున్నారు. మేము ఎప్పుడూ ఏదో అశాంతితో చికాకుగా ఉంటాము. ఎందుకో చెప్పు' అంది
దానికి ఉడుత....
'నిన్ను చూస్తుంటే భయమేస్తుంది. నన్ను ఒదిలిపెట్టు. చెట్టుపైకి వెళ్ళి చెబుతా' అంది.
'సరే'నని తోడేలు ఉడుతను ఒదిలిపెట్టింది.
ఉడుత వెంటనే చెట్టు కొమ్మ పైకి వెళ్ళి 'మా మనసులో ఎలాంటి చెడ్డ ఆలోచనలుండవు. ఎవరికీ హాని చేయాలనే తలంపే రాదు. మనసులో ఎలాంటి చెడు ఆలోచనలు లేకుంటే సంతోషంగా ఉండొచ్చు. మీ మనసులో ఎప్పుడూ ఏవో చెడ్డ ఆలోచనలుంటాయి. అవి మీ మనస్సుకు శాంతి లేకుండా చేస్తాయి. అందుకే మీరు ఎప్పుడూ అలా అశాంతితో ఉంటారు' అంది.
అది విని తోడేలు నిజం తెలుసుకొని సిగ్గు పడింది.
(లియో టాల్స్టాయ్ కథ ఆధారంగా) -
కరుణ పుస్తకాల దుకాణం ముందు ఆగింది. దుకాణం రద్దీగా ఉంది. అయినప్పటికీ కరుణ ఆగడానికి లేదు. ఇంటికి త్వరగా వెళ్ళవలసి ఉంది.
అయిదు రూపాయల నోటును దుకాణదారుడికి ఇచ్చి, ''రెండు వందల పేజీల రూళ్ళ నోటు పుస్తకం ఇవ్వండి'' అంది.
దుకాణదారుడు అయిదు రూపాయల నోటు తీసుకున్నాడు. కరుణ అడిగిన నోటుపుస్తకం ఇచ్చి గళ్ళాపెట్టె వెతికి, మిగతా చిల్లర ఇవ్వబోయాడు.
మరో కొనుగోలుదారుడు అతడికి పది రూపాయల నోటు ఇచ్చి తనకి కావలసిన పుస్తకాల జాబితా చెప్పాడు.
దుకాణదారుడు ఓర్పుగా అతడికి కావలసిన పుస్తకాలను ఎంచి ఇచ్చాడు. ఆ కొనుగోలుదారుడు వెళ్ళిపోయాడు.
''నాకు చిల్లర ఇవ్వలేదండి'' అంది కరుణ
దుకాణదారుడు ఒక్కక్షణం పాటు గుర్తుకు తెచ్చుకుని, కరుణ చేతిలో ఆరు రూపాయలుంచాడు.
కరుణ బిత్తరపోయింది.
తాను ఇచ్చింది అయిదు రూపాయల నోటే! తనకు తిరిగి ఒక రూపాయి మాత్రమే ఇవ్వవలసిన దుకాణదారుడు పొరబాటు పడ్డాడు.
రద్దీలోంచి ఇవతలికి వచ్చింది కరుణ.
ఆమెలో ఒక్క పక్క ఆనందం, మరోపక్క గాభరా...దుకాణదారుడు తన తప్పు గ్రహించి తిరిగి పిలవడు కదా!
త్వరత్వరగా ఇల్లు చేరుకుంది కరుణ.
తనకి అయిదు రూపాయల లాభం ఎంత అదృష్టం. అయిదు రూపాయలతో ఎన్నో కొనుక్కోవచ్చు.
ఆ రాత్రంతా కరుణకు నిద్ర పట్టలేదు.
మరుసటి రోజు కరుణ ఆ దుకాణం ముందు నుండి వెళ్తోంది. దుకాణదారుడిని చూసి అనుకోకుండా వణికింది. ఆ రోజు సాయంకాలం పాఠశాల నుండి తిరిగి వస్తూంటే అదే వణుకు.
దుకాణదారుడు తన కొడుకును దండిస్తున్నాడు.
కరుణకు క్రమంగా అర్థమవుతోంది.
నిన్న కొడుకు దుకాణంలో కొద్దిసేపు మాత్రమే కూర్చున్నాడట. ఉండవలసిన సొమ్ములో అయిదు రూపాయలు తగ్గాయి.
కరుణకు తెలుసు.
దుకాణదారుడి పరాకు వల్ల తగ్గిపోయిన డబ్బే అది. ఆ డబ్బు తన వద్ద ఉంది.
కరుణ చప్పున ఇంటికి పరుగెత్తి అయిదు రూపాయల నోటుతో తిరిగి వచ్చింది. సంగతి చెప్పి దుకాణదారుడికి ఆ నోటుని అందించింది. ఆమెలో కొత్త సంతృప్తి కలిగింది.
అయిదు రూపాయలతో అనుభవించే సంతృప్తి కన్నా ఆ డబ్బు తిరిగి దుకాణదారుడికి ఇవ్వడం వల్ల ఎక్కువ సంతృప్తి కలిగింది. అంతేకాదు. ఆమెలో అటు తర్వాత వణుకు పుట్టలేదు.
- ఎం.వి.వి సత్యనారాయణ -
జ్యోతికి చాలా కోపంగా ఉంది!
బుంగమూతి పెట్టి కుర్చీలో కూర్చుంది. తన పక్కన కూర్చుని తన వైపే తోక ఆడిస్తూ కూర్చున్న కుక్కపిల్లను అకారణంగా ఒక్కటి కొట్టింది. అది కుయ్మంటూ బయటకు పరిగెత్తింది. తన ఎదురుగా టేబుల్పై ఉన్న రిబ్బన్లను, బూట్లను చూస్తుంది కోపంగా.
జ్యోతికి ఆరేళ్ళ వయస్సు ఉంటుంది. స్కూలుకు వెళ్తుంది. బుద్ధిగా చదువుకుంటుంది. ఈ రోజు మాత్రం తనపై తనకే చాలా కోపంగా ఉంది. ఎవరితోనూ మాట్లాడడం లేదు.
'నిన్నటి నుండి రిబ్బన్తో కుచ్చులు వేయడం నేర్చుకోవాలని ప్రయత్నిస్తుంది కానీ రావటం లేదు. తనకు రిబ్బనుతో ముడి వేయవచ్చును. కాని కుచ్చు వేయటమే రావటం లేదు.'' ఇదే జ్యోతి కోపానికి కారణం. ప్రొద్దుటి నుండి మాట్లాడక కుర్చీలో కూర్చున్న జ్యోతిని చూసి వాళ్ళ నాన్న
''మళ్ళీ ఓసారి ప్రయత్నించమ్మ' అన్నాడు.
'సాధన చెయ్యి అదే వస్తుంది' అంది అమ్మ.
'ఇది చాలా సులువు' అన్నాడు వాళ్ళ అన్నయ్య.
జ్యోతికి వాళ్ళందరు ఎగతాళి చేస్తున్నట్లు అనిపించింది. మళ్ళీ టేబుల్ పైన ఉన్న రిబ్బను తీసుకొని కుచ్చులు వేయటం ప్రారంభించింది. ఉహు! రావట్లేదు. కాసేపటికి అలసిపోయింది. కుచ్చులు వేయటం మాత్రం రాలేదు. సాయంత్రం వాళ్ళ నాన్న బయటి నుంచి వచ్చి
'కొద్దిగా టైమ్ తీసికొని నిదానంగా వెయ్యి' అన్నాడు.
'మళ్ళీ ప్రారంభించు' అంది వాళ్ళ అమ్మ.
'కుచ్చులు వేయడం చాలా సులువు' అన్నాడు నవ్వుతూ వాళ్ళ అన్నయ్య. తను అలాగే ప్రయత్నిస్తే కుచ్చు వేయగలుగుతాననుకుంది. మరుసటి రోజు స్కూల్లో తన బూట్లకున్న దారాలు విప్పి సాధన చేసింది. అయినా రాలేదు. చాలా కోపం వచ్చింది. ముందున్న బెంచిని అసహనంగా ఒక్క తన్ను తన్నింది.
సాయంత్రం ఇంటికి రాగానే మళ్ళీ ప్రారంభించింది.
'నీవు అలసిపోయినట్టున్నావ్' అంది వాళ్ళ అమ్మ.
'రేపు మళ్ళీ ప్రయత్నించు' అన్నాడు వాళ్ళ నాన్న.
'ఇది చాలా సులువు' అన్నాడు వాళ్ళ అన్నయ్య.
జ్యోతికి వాళ్ళ మాటలు పట్టుదలను పెంచాయి. కోపంగా రిబ్బన్లు తీసికొని మంచం పైకి వెళ్ళింది.
ఆ రాత్రి చాలా సేపటివరకు కుచ్చులు వేసేందుకు ప్రయత్నించింది.
ఆ ప్రొద్దున్నే జ్యోతి వాళ్ళ అమ్మ, నాన్న, అన్నయ్యలు లేచి చూసి ఆశ్చర్యపోయారు. గదంతా కుచ్చులు వేసి ఉన్నాయి. కుర్చీలకు, టేబుల్కు, వాళ్ళ నాన్న, అన్నయ్యల బూట్లకు, కుక్క పిల్ల మెడకు అన్నింటికీ కుచ్చులు వేసి ఉన్నాయి. జ్యోతి అలసిపోయినట్లుగా మంచం పైన పడుకుని ఉంది.
''నాకు తెలుసు జ్యోతికి తప్పకుండా కుచ్చులు వేయడం వస్తుందని'' అన్నాడు వాళ్ళ నాన్న.
''సాధన చేస్తే ఏ పనైనా సులువుగా చేయవచ్చు. మన జ్యోతి చాలా కష్టపడింది'' అంది వాళ్ళ అమ్మ.
అప్పుడే లేచిన జ్యోతి - 'ఇది చాలా సులువు' అంది వాళ్ళ అన్నయ్య వైపు నవ్వుతూ ఆనందంగా చూస్తూ.
-డా|| కృష్ణకుమారి -
పరీక్ష హాలు నుండి బయటికి వచ్చిన హెడ్మాస్టర్, అనిల్, సునీల్ పోట్లాడు కోవడం చూశారు.
హెడ్మాస్టర్: మీరిద్దరు ఎందుకు పోట్లాడుకుంటున్నారు.
అనిల్: సార్ ఇతను నా పేపరు చూసి కాపీ కొట్టాడు.
హెడ్మాస్టర్: ఏది కాపీ గొట్టాడు
అనిల్: నేను తెల్లపేపరిస్తే వీడు కూడా అలాగే ఇచ్చాడు.
----
గోపి: నాన్నా గోల్కొండ ఎక్కడుంది?
తండ్రి: హైదరాబాద్లో.
గోపి: అలాగా! అది బొంబాయిలో ఉంటే ఎంత బావున్ను.
నాన్న: ఎందుకురా?
గోపి: మరి నేను బొంబాయిలో ఉందని రాశాగా!
---
మాష్టారు: తాజ్మహల్ ఎక్కడుందిరా?
సంతోష్: తెలియదండి.
మాష్టారు: అయితే బెంచీ ఎక్కు.
సంతోష్: బెంచీ ఎక్కితే కనిపిస్తుందాండి.
---
సతీష్: (ఏడుస్తూ...) నాన్నా నా బుడగను రాము పైకి వదిలేశాడు.
నాన్న: ఏరా రాము ఎందుకు వదిలేశావ్
రాము: నిన్న మా టీచర్ చెప్పింది. భూమికి ఆకర్షణ శక్తి ఉందని. నాకేం తెలుసు భూమి బుడగలను ఆకర్షించదని. -
అనగా అనగా ఒక అడవి. ఆ అడవికి ఒక సింహం రాజు. నక్క ఆ సింహానికి మంత్రిగా ఉండేది. అది గుంటనక్క. జిత్తులమారి కూడా. అది కపటోపాయంతో మాయమాటలు చెప్పి రోజుకో జంతువును రాజుగారికి ఆహారంగా తీసుకుని వస్తుండేది. ఆ జంతువును చంపి సింహం తినగా మిగిలిన మాంసాన్ని నక్క తింటుండేది. ఇలా తింటుండగా కొన్ని రోజుల తరువాత అడవిలో జంతువులన్నీ అయిపోయాయి. సింహానికి ఆహారం దొరకకపోతే తననే చంపేస్తుందని నక్కకు భయం పట్టుకుంది. చిన్న ఉపాయం ఆలోచించింది.
'మృగరాజా ఈ అడవిలో జంతువులన్నీ అయిపోయి అటు చివర ఒక పులి మాత్రమే ఉంది. అది మీ దగ్గరకి రానంటుంది. మీరే వెళ్ళి దాన్ని చంపి తినండి' అంది.
కూర్చున్న దగ్గరికే ఆహారం వస్తుంటే తిని సోమరిగా తయారైంది సింహం. తనిప్పుడు పులితో పోట్లాడి జయించలేదు. ఈ విషయం తెలిసే నక్క కుట్ర పన్నింది.
సింహానికి నక్క కుట్ర అర్థమైంది.
''పులి సంగతి రేపు చూస్తాను. ఇవ్వాల్టికి నువ్వున్నావుగా'' అని నక్క పైకి దూకి గుటకాయస్వాహా చేసింది.
(పిల్లలూ... ఇది పాతకథ. ఎన్నో సార్లు విని ఉంటారు. అందుకే దీన్ని 'అనగా అనగా ఒక కథ' అందాం. ఇలాంటి కథలు మీరు రాసి పంపించవచ్చు. మీ ఫోటో, పేరుతో ప్రచురిస్తాం.) -
ఆ రోజు ఆదివారం!
పాఠశాలకు సెలవు.
పొద్దున్నే లేచి స్నానం చేసి తయారయ్యాను. ఆ రోజు నాకు చాలా ఆనందంగా ఉంది. నాన్న కూడా ఇంటి దగ్గరే ఉన్నారు.
తొందరగా తయారయి, అమ్మ టిఫిన్ తినమని పిలుస్తున్నా వినక పరిగెత్తుకొచ్చి దొడ్లో ఉన్న సైకిల్ తీశాను.
నేను ఈ మధ్యనే సైకిల్ తొక్కడం నేర్చుకున్నాను. సైకిల్ తొక్కడం కొద్దిగా వచ్చు. నడిచేటప్పుడూ లేదా ఏదైనా వాహనం నడిపేటప్పుడు 'ఎడమ నుండి వెళ్ళాలని' మాష్టారు చెప్పిన మాటలు నాకు చాలా గుర్తు.
సైకిల్ తీసి రోడ్డుపైకి వచ్చి తొక్కడం ప్రారంభించాను. ''నాకు సైకిల్ తొక్కడం వచ్చు'' అని పక్క వీధిలోని మా మామయ్యకు చూపెట్టేందుకు నా తొందర. మెల్లిగా రోడ్డుకు ఎడమ వైపు నుండి సైకిలు తొక్కుతూ ఎలాగైతేనేం మా మామయ్య ఇంటికి వెళ్ళాను.
''నాకు సైకిల్ తొక్కడం వచ్చు'' అని చెప్పగానే మా మమయ్య, అత్తమ్మ చాలా సంతోషించారు. నాకు కాస్త గర్వం అనిపించింది. వాళ్ళింట్లో టిఫిన్ చేసి మళ్ళీ సైకిల్పై మా ఇంటికి బయలుదేరాను. నాకు ఎదురుగా ఓ వ్యక్తి సైకిల్ పై వస్తున్నాడు.
'రోడ్డుకు ఎడమ వైపు నుండి వెళ్ళండి' అని అన్నాను.
ఆ వ్యక్తి నా వైపు వింతగా చూసుకుంటూ వెళ్ళాడు. కాసేపటికి ఇంకో వ్యక్తి అలాగే రావటం చూసి మళ్ళీ అదే మాట అన్నాను.
అతను కూడా నావైపు అదోలా చూసి వెళ్ళిపోయాడు. నాకేం అర్థం కాలేదు.
ఎదురుగా మా నాన్నగారు సైకిల్పై వస్తున్నారు.
మళ్ళీ అదే మాట అన్నాను.
మా నాన్న సైకిల్ ఆపి ''ఏరా నీ కుడిచేయి, ఎడమ చేయి మరిచిపోయావా. కుడిచేయి వైపు వస్తూ నాకే చెపుతున్నావ్'' అని అడిగారు.
అప్పుడు గానీ నాకు అర్థం కాలేదు.
నేను వెళ్ళేటప్పుడు ఎడమ వైపే వెళ్ళాను. కానీ మళ్ళీ వచ్చేటప్పుడు అదే ఎడమవైపు అనుకుని అలాగే వస్తున్నాను.
---- (గోదావరి ఖని నుంచి వంశీకృష్ణ పంపిన కథ) -
సూర్యుడు ప్రపంచానికి వెలుగును, వేడిని ఇస్తాడు. అంత వేడి వెలుగు సూర్యునిలో ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా? అణుశక్తి, పరమాణు శక్తి, అణుబాంబు, హైడ్రోజన్ బాంబు గురించి మీరు విన్నారు కదా. చిన్నదిగా ఉండే అణువులో ఎంతో శక్తి దాగి ఉంటుంది. అణువును ఛేదించగలిగితే ఆ శక్తి బయటకు వస్తుంది. అలా అణువును ఛేదించి విపరీతమైన శక్తిని వెలువరించే పరికరమే అణుబాంబు. అణువుల్లో చిన్నది పరమాణువు. ఇందుకు ఉదాహరణ హైడ్రోజన్ పరమాణువు. ఇందులో మరింత శక్తి ఉంటుంది. అందుకే హైడ్రోజన్ బాంబు అణుబాంబు కన్నా శక్తివంతమైంది. అణువును ఛేదించడం చాలా కష్టమైన పని. దానికి ఎంతో శాస్త్రవిజ్ఞానం, సున్నితమైన శాస్త్రపరికరాలు కావాలి. ఇవన్నీ ఉన్నా కూడా అణువును ఛేదించడం చాలా కష్టం.
మనం ఇక్కడ ఇంత కష్టపడినా సాధ్యం కాని అణువిచ్ఛేదనం సూర్యునిలో దానంతట అదే జరుగుతుంది. మండే సూర్యునిలో ఉన్న మూలకాలు గాలి రూపంలో ఉంటాయి. వాటిలో హైడ్రోజన్ పరమాణువులు ఎల్లప్పుడు విడిపోతూ ఎంతో వేడిని, వెలుతురును వెదజల్లుతుంటాయి. ఆ వేడి, వెలుతురులే భూమిపైకి కాంతికిరణాల రూపంలో ప్రసరిస్తున్నాయి. ఇందులోని వేడిని మొక్కలు కిరణజన్య సంయోగక్రియ ద్వారా తమలో నిల్వ చేసుకుంటాయి. ఆ మొక్కల భాగాలను జీవకోటి స్వీకరించడం ద్వారా ఆ వేడిని మనుషులతో సహా ఇతర జంతువులు కూడా వినియోగించుకొంటున్నాయి.
మనుషుల్లో జంతువుల్లో జరిగే జీవన వ్యాపారాలన్నింటికి సూర్యశక్తే మూలాధారం అన్నది అర్థమైంది కదా. మొక్కల్లో ఆహారం సూర్యరశ్మి వలన ఉత్పన్నమవుతుందని, సూర్యకిరణాల సాయంతో మానవ శరీరంలో 'డి' విటమిన్ ఉత్పత్తవుతుందని శాస్త్రజ్ఞులు కనిపెట్టారు. అందుకే వైద్యులు చంటిపిల్లల్ని లేత ఎండలో పడుకోబెట్టాలని చెప్తుంటారు. ప్రకృతి వైద్యులు సూర్యరశ్మిని అనేక చర్మ వ్యాధులను నయం చేయడానికి వినియోగిస్తున్నారు. విదేశాల్లో సూర్యరశ్మి కోసం 'సూర్య స్నానాలు' (సన్బాత్) చేస్తారు. మన దేశంలో ఆరోగ్యపరంగా సూర్య నమస్కారాలని అనాదిగా ఉన్నాయి. ఇన్ని రకాలుగా సూర్యుడు మన జీవితంలో ముడిపడి ఉన్నాడు.
భూమి నుండి చూస్తే సూర్యుడు ఫుట్బాల్ అంత పరిమాణంలో కనిపిస్తాడు. కాని సూర్యగ్రహం భూమి కన్నా కొన్ని వందల రెట్లు పెద్దదిగా ఉంటుంది. దాని వ్యాసం 14 లక్షల కిలోమీటర్లు. ఇది భూమి వ్యాసం కన్నా 109 రెట్లు ఎక్కువ. భూమి నుంచి 15 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు కాబట్టి ఇక్కడి నుండి చూస్తే అంత చిన్నగా కన్పిస్తున్నాడు. అంత దూరంనుండే నిప్పులు కురిపించే ఎండను వెదజల్లుతున్నాడు. అక్కడికి వెళితే ఎంత వేడి ఉంటుందో ఊహించండి. అమ్మో! మాడి మసైపోము! ఊహించడానికే భయం వేయటం లేదూ...?!
సూర్యుడి కన్నా భూమి చిన్నది. భూమి కన్నా చందమామ మరింత చిన్నది. చందమామ కురిపించే చల్లని వెన్నెల వెలుతురు కూడా సూర్యుడిదే. ఇది ఎట్లాగంటే సూర్య కిరణాలు చంద్రుని మీద పడి అవి పరావర్తనం చెంది భూమి పైకి వస్తాయి. ఈ క్రమంలో ఆ కిరణాలలోని వేడిని కాస్త చంద్రుడు భరిస్తాడు. మనకు చల్లని కిరణాలను ఇస్తాడు. అందుకే చందమామ మంచివాడు. పిల్లలకు మామ వాడు. -
మాస్టారు ఆ రోజు హాఫియర్లీ పరీక్ష పేపర్లు ఇస్తున్నారు. పిల్లలంతా ఆసక్తిగా మార్కుల కోసం ఎదురుచూస్తున్నారు. మూడు సబ్జెక్టుల్లో మహేష్, మిగిలిన మూడు సబ్జెక్టుల్లో గోపి ఫస్ట్ వచ్చారు. మాస్టారు వారిద్దరిని పిలిచి అభినందించారు.
''మీరు చదువు విషయంలో ఇలా పోటీ పడటం నాకు చాలా ఆనందంగా ఉంది.ఏ విషయంలోనైనా పోటీ ఉన్నప్పుడే రాణిస్తారు.మీరిద్దరూ ఇలాగే శ్రద్ధగా చదువుకోండి.'' అన్నారు మాస్టారు.
'అలాగే' అన్నారు మహేష్, గోపి. మూడు సబ్జెక్టుల్లో ఫస్ట్ వచ్చినందుకు గోపి మహేష్ను అభినందించాడు. మహేష్ మాత్రం ముఖం అదోలా పెట్టి వెళ్ళిపోయాడు.
వాళ్ళిద్దరు కేవలం చదువులోనే కాకుండా క్విజ్,వ్యాసరచన పోటీ, చదరంగం లాంటి అన్ని విషయాల్లోను పోటిపడతారు. మహేష్ తనకు రాని ఆటల్లో కూడా గోపికి పోటిగా ఉండేవాడు. గోపీకి బహుమతి వస్తే సహించేవాడు కాదు.
వారం రోజుల తర్వాత జరిగే ఈతపోటిల్లో పాల్గొనేందుకు పేరు ఇచ్చాడు గోపి. గత రెండేళ్ళుగా గోపి ఈత పోటీల్లో ఫస్ట్ వస్తున్నాడు. మహేష్ కూడా తన పేరు ఇచ్చాడు. అది చూసి గోపి-
''మహేష్! నీకు ఈత రాదుకదా ఎలా ఈదుతావ్'' అన్నాడు.
''ఏం పరవాలేదు. వారం రోజుల్లో ఈత నేర్చుకుని ఈదుతా. నేను పాల్గొంటే నీకు భయంగా ఉందా?'' అన్నాడు మహేష్ ఎగతాళిచేస్తూ.
ఈతపోటీల రోజు రానే వచ్చింది. అందరూ ఒకరికొకరు 'విష్ యూ ఆల్ ది బెస్ట్' అని చెప్పుకున్నారు. మహేష్ మాత్రం గోపికి చెప్పలేదు.
పోటీి ప్రారంభమయ్యింది. పిల్లలందరు గమ్యం వైపు ఈదుతూ వెళుతున్నారు. కొంత దూరం తనతో సమానంగా వచ్చిన మహేష్ వెనకబడటం గమనించాడు. గోపి తనను దాటి వెళ్ళడంతో మహేష్ రొప్పుతూ ఈదబోయాడు. ఈలోగా దమ్ము పట్టడం కష్టమవడంతో నీళ్ళలో మునిగిపోయాడు.
ఒడ్డున ఉన్న వాళ్ళంతా 'మహేష్' అంటూ అరవసాగారు. ముందు వెళ్తున్న గోపి వెనకకు తిరిగి మహేష్ నీళ్ళలో మునిగి పోవడం చూసి తొందరగా మహేష్ దగ్గరికి వచ్చి అతడిని ఒడుపుగా పట్టుకుని ఒడ్డుకు చేర్చాడు. కాసేపు ప్రథమ చికిత్స చేసేసరికి మహేష్ మెల్లిగా తెప్పరిల్లాడు.
మహేష్ గోపికి కనీసం 'థాంక్స్' అయినా చెప్పకుండా వెళ్ళిపోయాడు. ఆ మర్నాడు జిల్లా జడ్జి విజేతలకు బహుమతులు అందచేశాడు. సాహసంతో మహేష్ను రక్షించినందుకు గోపికి ప్రత్యేక బహుమతిని ఇచ్చి మెచ్చుకున్నాడు.
గోపి మైక్ వద్దకువెళ్ళి 'మిత్రులారా! నేను చదువులో, ఆటల్లో శ్రద్ధ వహించడానికి మహేష్ పరోక్ష ప్రేరణ, అటువంటి మహేష్ వారం రోజుల్లో ఈత నేర్చుకుని నాకు పోటిగా ఎంతో సాహసంగా ఈదాడు. అతని పట్టుదల చూసి, నా ఈ బహుమతిని మహేష్కు ఇవ్వాలనిపిస్తున్నది. అంటూ మహేష్ను స్టేజి పైకి పిలిచి బహుమతిని మహేష్కు అందించాడు.
గోపి మాటలకు మహేష్ మనసు కదిలిపోయింది. 'తను ఈర్షతో గోపికి పోటిగా నిలబడితే గోపి దాన్ని మెచ్చుకుని తన బహుమతిని నాకు ఇస్తున్నాడు. దేనికైనా పోటీ పడాలి. కాని ఎదుటివాడిని కించ పరచేలా ఉండకూడదు. అలాగే పోటీలో గెలిచిన, ఓడిన సరదాగా తీసుకోవాలి. ఒకవేళ ఓడితే తర్వాత గెలిచేందుకు పట్టుదలతో కృషి చేయాలి. అంతేగాని ఈర్ష్య పడొద్దు' అనుకుంటూ స్టేజిపైన ఆనందంతో గోపిని కౌగిలించుకున్నాడు మహేష్.
-- యన్.యస్.శర్మ -
పొడవైన పెద్ద ముక్కు, దానిపై టోపి లాంటి అమరిక, ముక్కును మించిన పొడవుతో తోక, నలుపు తెలుపు రంగుల పెద్ద ఈకలు, పెద్ద శబ్దంతో కూతవేస్తూ, చిత్ర విచిత్రమైన అలవాట్లతో,గమ్మత్తుగా అనిపించే హార్న్బిల్ అనే పక్షి అస్సాం అడవుల్లో కనిపిస్తుంది. ఇది గద్దకన్నా కొంచెం పెద్దది.ఇది 30 సెంటీమీటర్ల బలమైన ముక్కుతో కలిపి దాదాపు 5 అడుగుల పొడవు ఉంటుంది. ముక్కు ముదురు పసుపు రంగులో దానిపై టోపిలాంటి అమరిక నలుపు పసుపు రంగుల్లో ఉంటుంది. తోక తెలుపు రంగులో ఉండి కింద అడ్డంగా చిన్నపట్టీ ఉంటుంది. పొట్ట భాగంలో ఈకలు తెలుపుగా ఉంటాయి. ఈ పక్షి దట్టమైన అడువుల్లోనే నివసించడానికి ఇష్టపడుతుంది. పెద్ద చెట్ల కున్న చిన్న తొర్రల్లో ఉంటుంది. చిన్న గింజలున్న పండ్లు, పురుగులు, ఎలుకలు,బల్లులు, చిన్న పాములను ఇది ఇష్టంగా తింటుంది. ఇది ఎగురు తుంటే రెక్కల శబ్దం గమ్మత్తుగా వస్తుంది.
ఆడ మగ హార్న్బిల్ పక్షులు కలిసి ఒక చెట్టు తొర్రను ఇంటిగా చేసుకొంటాయి. అందులో ఆడపక్షి రెండు నుండి నాలుగు గుడ్లను పెడుతుంది. తర్వాత గుడ్లమీద పొదగడానికి కూర్చుంటుంది. అప్పుడు మగపక్షి ముక్కును తాపీలా ఉపయోగించి రెట్టా, మట్టితో చెట్టు తొర్ర ద్వారాన్ని మూసి వేస్తుంది. దానికి ఒక చిన్న కన్నం మాత్రం ఉంచుతుంది. దీని నుంచి మగపక్షి ఆడపక్షికి ఆహారం అందిస్తుంది.
గుడ్లు పొదిగి పిల్లలు బయటికి వచ్చి రెండు నెలల వయస్సు వచ్చేవరకు ఆడపక్షి ఆ గూటిలోనే ఉంటుంది.
అంటే దాదాపు నాలుగు నెలలు ఆ గూటిలోనే ఎటూ కదలకుండా ఉంటుంది.
పిల్లలు ఎదిగి వాటంతట అవే ఆహారం సంపాదించుకునే స్థితికి రాగానే మగపక్షి గూటిని ముక్కుతో పగలగొడుతుంది.
అపుడు తల్లి, పిల్లలు బయటికి వచ్చి స్వేచ్చగా ఎగురుతాయి. -
పాప బడిలో చేరింది
పలకా బలపం పట్టింది
'అ ఆ' లన్నీ నేర్చింది
'కఖా' లన్నీ దిద్దింది
మాటలు బాగా రాలేదు
ముక్కున కోపం పోలేదు
'పలకాబలపం' అనవే అంటే
'బలకం కలపా' అంటుంది
'రఘుపతిరామా' అని చెబితే
'లఘుపతి లామా' అంటుంది
గణపతి ముక్కుకు పేరేమంటే
టొండము టొండము అంటుంది.
బడిలో పిల్లలు విన్నారు
పక్కున అందరు నవ్వారు
పాపకు రోషం హెచ్చింది
కోపం ముంచుకు వచ్చింది.
-- గాలి ప్రభావతి -
చిన్నది చిన్నది చిటికెన వేలు
ఉన్నది పక్కనే ఉంగరం వేలు
నడుమన పొడవుది నడిమీ వేలు
చూపును దిశలను చూపుడు వేలు
పొట్టిది గట్టిది బొటనా వేలు
అన్నము కలుపును అయిదూ వేళ్ళు
ఆకలి తీర్పును అయిదూ వేళ్ళు
ఐక్యత నేర్పును అయిదూ వేళ్ళు
అమ్మలవంటివి అయిదూ వేళ్ళు
అమ్మలకమ్మలు అయిదూ వేళ్ళు
-- సి.ఎల్.శ్రీనివాసరెడ్డి -
పిల్లల్లో కథలు వినే
కోరిక బహు మెండు,
తాతయ్యలు, నానమ్మల
కథ మాటల చెండు!
ఎక్కడుంది బామ్మకిపుడు
కథ చెప్పే తీరిక,
ఆమెకి కూడా 'టీ.వీ'
చూడాలని కోరిక!
ఎంచక్కా లైబ్రరీకి
వెళ్ళవచ్చు కాని,
హోమువర్కు చేయకపోతె
క్లాసులోన హాని!
ఒక్కసారి యోచిస్తే
ఉంది చాల టైము,
దాన్ని వృథా చేస్తుంటాం
అదొక పెద్ద క్రైము!
పోసుకోలు కబుర్లతో
గడపరాదు నిమిషం,
వృథా అయిన ప్రతి నిమిషం
బతుకున ఒక విషం!
పత్రికలూ, పుస్తకాలు
కథల నిధులు, బాలలూ!
తీరికలో చదువుకోండి
వేసుకుంటు ఈలలు.
-- దేవిప్రియ అంకుల్ -
మానవుడు జీవితంలో అనేకసార్లు పొరపాట్లు చేస్తూ ఉంటాడు. ఉదాహరణకు కొంతమందిని వెనకనుండి చూసి తెలిసిన మనిషిగా భావించి చప్పట్లుకొట్టి తర్వాత సారీ చెప్పటం, కొందరిని చూసినపుడు పోలికల్ని బట్టి 'ఫలానవారు మీ బంధువులా?' అని అడిగాక తర్వాత పొరబడ్డామని గ్రహించటం, ఇలా అనేక రకాల పొరపాట్లు చేస్తూ ఉంటారు. మానవులే కాక పక్షులు, జంతువులు మొదలైన జీవరాశులు కూడా అప్పుడప్పుడు పొరపాట్లు చేస్తాయని శాస్త్రవేత్తలు ఋజువులతో సహా చెబుతున్నారు.
ఉదాహరణకు ఆఫ్రిన్ ఆర్కిడ్ అనే మొక్క పువ్వు అచ్చం ఆడ తేనెటీగలా ఉంటుందిట. దీన్ని నిజంగా ఆడతేనెటీగని భావించి మగతేనెటీగలు ఆ పూవుపై వాలతాయి. ఫలితంగా అవి పూవును తమ రెక్కలకంటుకున్న అదే జాతి పుప్పొడితో ఫలదీకరణం చేస్తాయి.
అలాగే ఓ కోడి పెట్ట నుండి పిల్లల్ని దూరం చేసినపుడు ఆకోడి పిల్లి పిల్లలనయినా తన పిల్లలేనని భావించి వాటిని తన రెక్కల కింద ఉంచుకొని కాపాడుతూ వస్తుందట. పిల్లి పిల్లలు కూడా కోడిని తమ తల్లిగానే భావించి మొదట్లో దాంతో ప్రేమగా ఆడుకొంటాయట. కొంతకాలానికి పిల్లి పిల్లలు కోడి తమ తల్లికాదని గ్రహించి కోడినుండి దూరంగా వెళ్ళిపోతాయి.
ఇదే విధంగా ఓ జాతికి చెందిన పక్షి తనగూడు నెవరయినా నాశనం చేసినప్పుడు తన పిల్లలకోసం తెచ్చే ఆహారాన్ని దగ్గర చెరువులో ఉండే చేపపిల్లలకు అందిస్తుందట. ఆ పిట్ట చెరువు ఒడ్డుకు రాగానే చేపపిల్లలు పిట్ట దగ్గరకు నోరు తెరుచుకుని వెళ్తాయి. చూశారా? తప్పులు మానవులేగాక జీవరాశులన్నీ చేస్తాయి.
-గిరిజానారాయణ్
పలు ప్రయోజనాల 'కోడిగుడ్డు'
ఒక కోడి ఏడాదికి దాదాపు 180 గుడ్లు పెడుతుంది. కోడి గుడ్డులో బి1,బి2 విటమిన్లే కాక ప్రొటీనులు కూడా ఉంటాయి. కోడిగుడ్డు తినడానికి గాక ఐవరీ పాలిష్, రంగులు, జిగురు, పుస్తకాల బైండింగ్, మందులు, పుస్తకాల ముద్రణకు ఉపయోగించే సిరా, సబ్బు, వార్నష్, వైన్, ఐస్క్రిమ్, రొట్టెల తయారీలలో కూడా వాడుతారు. -
ఒక అడవిలో పులి బోనులో బందీ అయిఉంది. అది బోనులో నుండి బయటికి రావాలని ప్రయత్నించింది. కానీ వీలుకావటం లేదు. ఆ దారిలో ఒక బ్రాహ్మణుడు వెళ్తూండటం పులి కంటపడింది. అది వెంటనే-
'ఓయీ బ్రాహ్మణుడా! ఆగు, నేను చాలాసేపటినుంచి ఈ బోనులో బందీ అయి ఉన్నాను. నాకు విపరీతమైన దాహం వేస్తోంది. నీవు కాస్త ఈ బోను తెరిస్తే నేను నీళ్ళుతాగి మళ్ళీ ఈ బోనులోకి వస్తాను'' అంది.
అది విని బ్రాహ్మణుడు 'అమ్మో! దీన్ని బయటికి వదిలేస్తే ఇంకేమైనా ఉందా! నన్నే తింటుంది. - అనుకుని, 'నేను తెరవను' అన్నాడు.
'నీవు భయపడుతున్నట్లుగా నిన్ను ఏమీ చేయను. దయ ఉంచి తెరువు. లేకుంటే నేను ఇందులోనే చచ్చిపోతాను.' అంది దీనంగా ముఖంపెట్టి, కొద్దిసేపటికి బ్రాహ్మణుడికి జాలి కలిగి బోను తెరిచాడు. పులి వెంటనే బోనులోనుంచి బయటికి వచ్చి-
'నేను చాలా ఆకలితో ఉన్నాను. నిన్నిప్పుడు తింటాను.' అంది. బ్రాహ్మణుడికి భయం పట్టుకుంది. గజగజ వణికిపోతూ ''ఇది అన్యాయం. నేను నీకు సాయం చేశాను. కావాలంటే ఎవరినైనా న్యాయం అడుగుదాం.' అన్నాడు. ఇంతలో అటుగా వస్తున్న ఒక నక్కకు బ్రాహ్మణుడు జరిగింది చెప్పాడు. నక్క అంతా విని-
''నీ మాటలు నాకు ఏమీ అర్థం కాలేదు. ఈ బోనులో నీవున్నావా?'' అంది నక్క బ్రాహ్మణుడిని చూస్తూ-
'లేదు నేనే ఉన్నాను' అంది పులి.
''ఇంత చిన్నబోనులో నీవెలా ఉంటావు. నీవు చెప్పేది నమ్మబుద్ది కావటంలేదు.'' అంది నక్క బోను వైపు చూస్తూ-
అసలే ఆకలిగా ఉన్న పులి-
'ఓసీ మూర్ఖపు నక్కా! ఈ బోనులో నేనే ఉన్నాను. కావాలంటే చూడు లోనికి వెళ్ళి వస్తాను' అంటూ పులి బోనులోకి వెళ్ళింది. బ్రాహ్మణుడు, నక్క కలిసి వెంటనే బోను తలుపులు బిగించారు. తన ప్రాణాలు కాపాడి నందుకు నక్కకి కృతజ్ఞతలు తెలిపి, 'దుష్టుల మాటలు నమ్మరాదు' అనుకుంటూ బ్రాహ్మణుడు తన దారిన తాను పోయాడు.