చిల్డ్రన్స్ ఎడ్యుకేషనల్ అకాడమీ ప్రచురించిన
'టంగ్ యంగ్' పుస్తకావిష్కరణ
పిల్లలకు సృజనాత్మక కథలు తెలియాలంటే గ్రామీణ స్థాయి నుంచి బాల సాహిత్యంపై అవగాహన తెలియపరచాల్సిన అవసరం ఉందని ఓ.యు, మాజీ చరిత్ర శాఖాధిపతి ప్రొఫెసర్ అడపా సత్యనారాయణ పేర్కొన్నారు. బాలసాహిత్యం - నా అనుభవాలు - సూచనలు అనే అంశంపై బాలచెలిమి పిల్లల వికాస పత్రిక, చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో శనివారం ఆక్స్ఫర్డ్ గ్రామర్ స్కూల్లో 'బాలచెలిమి ముచ్చట్లు' 14వ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా చిల్డ్రన్స్ ఎడ్యుకేషనల్ అకాడమీ ప్రచురించిన 'టంగ్ యంగ్' పుస్తకావిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అడపా సత్యనారాయణ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత విద్యార్థులకు బాల సాహిత్యం గురించి, గురు శిష్యుల అనుబంధం గురించి నేటి పిల్లలకు తెలియచేయాల్సిన అవసరం తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు ఉందన్నారు. అలాగే తెలంగాణ చరిత్రను కూడా ఇప్పటి పిల్లలకు తెలియచేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
సభాధ్యక్షులు, బాలచెలిమి సంపాదకులు మణికొండ వేదకుమార్ మాట్లాడుతూ ప్రపంచ తెలుగు మహాసభలు జరిగినప్పుడు బాల సాహిత్యంపై ప్రత్యేక సెషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ మహాసభల్లో బాల సాహిత్యంపై అనేక అంశాలపై చర్చించటం జరిగిందని తెలిపారు. ఈ క్రమంలో పిల్లల కోసం 'బాలచెలిమి ముచ్చట్లు' ప్రతి నెల రెండవ శనివారం క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నామన్నారు. రచయిత డాక్టర్ కె.బి.గోపాలం మాట్లాడుతూ బాల సాహిత్యం అంటే ఎలా ఉండాలి, అందులోని బొమ్మలు ఎలాంటివి వుండాలి అనే ఆలోచనతో పిల్లలకు అర్థమయ్యే రీతిలో బాలసాహిత్యం రావాలని తెలిపారు. రచయిత్రి శ్రీమతి మాడభూషి లలితాదేవి మాట్లాడుతూ మాతృభాషలో బాల సాహిత్యం విరివిగా రావాలని కోరారు. బాల సాహిత్యంపై వర్క్షాప్లు పిల్లల చేతనే నిర్వహించాలి. ఆంగ్లంలో వచ్చినన్ని కథల పుస్తకాలు మన మాతృభాష అయిన తెలుగులో రాలేదని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో జుగాష్విలి, డాక్టర్ యస్. రఘు, కె. ప్రభాకర్, వెంకటమ్మ, పి. నీరజ, వి. రేఖ, పేనేపల్లి పాండురంగారావు, బక్క బాబురావు, కె. ప్రభాకర్, కో-ఆర్డినేటర్ తదితరులు పాల్గొన్నారు. విశాల్ చతుర్వేది దర్శకత్వం హించిన 'సురభి' హిందీ షార్ట్ ఫిల్మ్ను ఈ సందర్భంగా ప్రదర్శించారు.
0 comments:
Post a Comment