ఒక అడవిలో పులి బోనులో బందీ అయిఉంది. అది బోనులో నుండి బయటికి రావాలని ప్రయత్నించింది. కానీ వీలుకావటం లేదు. ఆ దారిలో ఒక బ్రాహ్మణుడు వెళ్తూండటం పులి కంటపడింది. అది వెంటనే-
'ఓయీ బ్రాహ్మణుడా! ఆగు, నేను చాలాసేపటినుంచి ఈ బోనులో బందీ అయి ఉన్నాను. నాకు విపరీతమైన దాహం వేస్తోంది. నీవు కాస్త ఈ బోను తెరిస్తే నేను నీళ్ళుతాగి మళ్ళీ ఈ బోనులోకి వస్తాను'' అంది.
అది విని బ్రాహ్మణుడు 'అమ్మో! దీన్ని బయటికి వదిలేస్తే ఇంకేమైనా ఉందా! నన్నే తింటుంది. - అనుకుని, 'నేను తెరవను' అన్నాడు.
'నీవు భయపడుతున్నట్లుగా నిన్ను ఏమీ చేయను. దయ ఉంచి తెరువు. లేకుంటే నేను ఇందులోనే చచ్చిపోతాను.' అంది దీనంగా ముఖంపెట్టి, కొద్దిసేపటికి బ్రాహ్మణుడికి జాలి కలిగి బోను తెరిచాడు. పులి వెంటనే బోనులోనుంచి బయటికి వచ్చి-
'నేను చాలా ఆకలితో ఉన్నాను. నిన్నిప్పుడు తింటాను.' అంది. బ్రాహ్మణుడికి భయం పట్టుకుంది. గజగజ వణికిపోతూ ''ఇది అన్యాయం. నేను నీకు సాయం చేశాను. కావాలంటే ఎవరినైనా న్యాయం అడుగుదాం.' అన్నాడు. ఇంతలో అటుగా వస్తున్న ఒక నక్కకు బ్రాహ్మణుడు జరిగింది చెప్పాడు. నక్క అంతా విని-
''నీ మాటలు నాకు ఏమీ అర్థం కాలేదు. ఈ బోనులో నీవున్నావా?'' అంది నక్క బ్రాహ్మణుడిని చూస్తూ-
'లేదు నేనే ఉన్నాను' అంది పులి.
''ఇంత చిన్నబోనులో నీవెలా ఉంటావు. నీవు చెప్పేది నమ్మబుద్ది కావటంలేదు.'' అంది నక్క బోను వైపు చూస్తూ-
అసలే ఆకలిగా ఉన్న పులి-
'ఓసీ మూర్ఖపు నక్కా! ఈ బోనులో నేనే ఉన్నాను. కావాలంటే చూడు లోనికి వెళ్ళి వస్తాను' అంటూ పులి బోనులోకి వెళ్ళింది. బ్రాహ్మణుడు, నక్క కలిసి వెంటనే బోను తలుపులు బిగించారు. తన ప్రాణాలు కాపాడి నందుకు నక్కకి కృతజ్ఞతలు తెలిపి, 'దుష్టుల మాటలు నమ్మరాదు' అనుకుంటూ బ్రాహ్మణుడు తన దారిన తాను పోయాడు.
0 comments:
Post a Comment