జలచరాలను ఓషనేరియం, అక్వేరియంలలో, డాల్ఫినేరియంలలో ఉంచి టూరిజానికి ఊతం ఇ”వ్వాలనే ప్రయత్నాలు ముమ్మరమవుతున్నాయి. ముంబాయిలో ఓషనేరియం, అక్వేరియంలను; ఢిల్లీలో డాల్ఫినేరియాన్ని; కేరళలో ఓషనేరియాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఇది అనాలోచితమైన చర్య అనీ, దీనిని ఆపాలనీ మనం కేంద్ర పర్యావరణం, అటవీ మంత్రిత్వ శాఖకు వ్రాద్దాం.
జలచరాల జీవితం ఎంతో వైవిధ్యభరితమైనది. అవి మనకన్నా మిన్నగా ఒకదానితో ఒకటి సమాచారం ఇచ్చిపుచ్చుకొంటాయని శాస్త్రవేత్తలు ఏనాడో తెలియజేశారు. విశాలమైన సముద్రాలలో స్వేచ్ఛగా ఈదులాడే జంతుచరాలను పట్టి తెచ్చి, రసాయనాల పూత పూసిన కాంక్రీటు ట్యాంకులలో ఉంచటం అసమంజసమైన విషయం. ఏ భిన్నత్వమూ, వైవిధ్యమూ లేని ట్యాంకులలో చిన్న చేపలైనా, అతి పెద్ద తిమింగలాలైనా చైతన్యాన్ని కోల్పోయి నిరాసక్తంగా మారతాయి.
సముద్రం లోని తిమింగలాలు, సొర చేపలకు రేడియో కాలర్ ట్యాగ్లను తగిలించటం ద్వారా, అవి ఎక్కడ ఉన్నాయో తెలుసుకోవాలని గుజరాత్ అధికారులు భావిస్తున్నారు. తద్వారా యాత్రికులు నావలలో ఆ ప్రాంతాలకు వెళ్లి వాటిని చూడవచ్చునని, దీని వలన టూరిజం పెరుగుతుందని వారి అభిప్రాయం. యాత్రికుల సంఖ్య పెరిగే కొద్దీ జల చరాల ఏకాంతానికి భంగం వాటిల్లుతుందని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు ప్రజల డిమాండ్ల మేరకు ఇటువంటి పనులకు దూరంగా ఉంటున్నాయి. కానీ మన దేశంలో మాత్రం ఇందుకు విరుద్ధంగా జరుగుతోంది. ఈ ప్రయత్నాలను విరమించుకోవాలని మనం ప్రభుత్వాన్ని కోరదాం.
0 comments:
Post a Comment