బడి అంటే పిల్లల్లో భయం లేనప్పుడే విద్యాహక్కు చట్టం జాతీయ స్థాయిలో విజయవంతమవుతుందని ప్రధాని మన్మోహన్సింగ్ చెప్పారు. కఠినంగా దండిస్తున్న ఘటనల వల్ల విద్యార్థులు బడి అంటే భయం పెంచుకొంటున్నారని అన్నారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా మాట్లాడుతూ దేశంలో ప్రతి చిన్నారికి నాణ్యమైన విద్యను అందించడమే ప్రభుత్వ ధ్యేయమని మన్మోహన్ చెప్పారు. దేశంలో విద్యా వ్యవస్థ ప్రస్తుతం అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఉందన్నారు. విద్యా సంస్కరణల్లో ఉపాధ్యాయులే ముందుండాలని కోరారు. ఉపాధ్యాయులు దేశానికి అత్యంత విలువైన సంపద అన్నారు. సంప్రదాయ పద్ధతులు, ఆధునికతను సమన్వయం చేసుకొంటూ ముందుకు సాగాలని కోరారు.
''విద్యార్థులను దండించడం, మానసికంగా వేధించడాన్ని విద్యాహక్కు చట్టం నిషేధిస్తోంది. నిర్బంధం, బహిష్కరణలను కూడా నిషేధిస్తోంది. ఇలాగైతే తరగతి గదిలో పిల్లలను క్రమశిక్షణగా ఉంచడం ఎలా? అంటూ చాలా మంది ఉపాధ్యాయులు ప్రశ్నిస్తున్నారు. చిన్నారిని నియంత్రించేందుకు క్రమశిక్షణ అనేది ఓ సులువైన మార్గం. కానీ, ఇది జీవితంలో ఎదురయ్యే సమస్యలను తెలుసుకోవడానికి వారికేమాత్రం సహాయపడదు. ఉపాధ్యాయుడు ప్రతి విద్యార్థిని పరిశీలిస్తూ, వారిపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తే బహిష్కరణ, ఆధిపత్యం, క్రమశిక్షణ.. ఇలాంటి వాటి అవసరమే ఉండదు' అని తత్వవేత్త జిడ్డు కృష్ణమూర్తి సమాధానం చెప్పారన్నారు మన్మోహన్. ఉపాధ్యాయుడిగా పనిచేసిన కాలం జీవితంలో తనకెంతో సంతృప్తినిచ్చిందని చెప్పారు. చిన్నతనంలో అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో తాను చదువుకొన్న విషయాలను ప్రస్తావించారు. కష్టపడి చదువుకోవడం వల్లే ప్రస్తుతం తానీ స్థితిలో ఉన్నానన్నారు.
0 comments:
Post a Comment