బాలలను మార్చేది బాల సాహిత్యమే
బాలలను మార్చేది బాల సాహిత్యమేనని తెలంగాణ రాష్ట్ర బీసీ కమీషన్ ఛైర్మన్ బి.ఎస్.రాములు పేర్కొన్నారు. బాలసాహిత్యం - నా అనుభవాలు - సూచనలు అనే అంశంపై బాలచెలిమి పిల్లల వికాస పత్రిక, చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో శనివారం ఆక్స్ఫర్డ్ గ్రామర్ స్కూల్లో నిర్వహించిన 'బాలచెలిమి ముచ్చట్లు' 11వ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్నతనంలో తండ్రి లేకపోవడంతో తల్లి సంరక్షణలో పెరిగానని తద్వారా స్వేచ్ఛ ఎక్కువగా ఉండేదన్నారు. దీంతో చందమామ, బాలమిత్ర వంటి కథల పుస్తకాలు చదవడంతో బాల సాహిత్యంపై అవగాహన పెరిగిందన్నారు. తాను 1967లో జగిత్యాల కథను రాశానని, ఈ కథ బాల మిత్రలో అచ్చు అయినట్లు తెలిపారు. తొమ్మిదవ తరగతి నుండే రచనలు, ఉపన్యాసాలు ఇవ్వడంతో పెన్నులు, పెన్సిల్ల్లాంటి బహుమతుల నుండి అవార్డుల వరకు అనేకం వచ్చినట్లు వివరించారు. పిల్లలను తల్లిదండ్రులు ప్రోత్సహిస్తేనే వాళ్లలోని సృజనాత్మకత వెలుగులోకి వస్తుందన్నారు. పిల్లలు రాస్తున్నప్పుడు వారిని ప్రోత్సహించాలని లేకపోతే వారిలోని నైపుణ్యం మరుగున పడుతుందన్నారు.
చిల్డ్రన్స్ ఎడ్యుకేషనల్ అకాడమి ఛైర్మన్ మణికొండ వేదకుమార్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తరువాత జరిగిన ప్రపంచ తెలుగు మహాసభల్లో బాల సాహిత్యంపై ప్రత్యేక చర్చ నిర్వహించినట్లు తెలిపారు. అందులో భాగంగా పిల్లలకోసం 'బాల చెలిమి' పత్రికను తిరిగి ప్రారంభించాలని చర్చించడంతో ఈ బాల చెలిమి ముచ్చట్లు కార్యక్రమం ప్రతి నెల రెండవ శనివారం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దక్కన్ ల్యాండ్ మాసపత్రిక ప్రారంభించినప్పుడు కొంచెం వెనుకాడాము కానీ నేడు 77 సంచికలు తీసుకొచ్చి ధైర్యంగా ముందుకు వెళ్తున్నట్లు తెలిపారు. అదే ఉత్సాహంతో బాల చెలిమి పత్రికను కూడా త్వరలోనే తీసుకు రాబోతున్నట్లు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రముఖ రచయిత కల్లూరి ప్రభాకర్ చారి రచించిన 'చిరుదీపం' పిల్లల పుస్తకాన్ని ఆవిష్కరించారు.
కార్యక్రమంలో కవి, రచయిత్రి డా|| శిలాలోలిత, రచయిత్రి శ్రీమతి దాసరి శాంతకుమారి, పత్తిపాక మోహన్, గుడిపూడి సుబ్బారావు, జుగాష్విలీ, నాళేశ్వరం శంకరం, సయ్యద్ షాబీర్, పద్మావతి, బాల్రాజ్, ఖైజర్, కె. ప్రభాకర్, కో-ఆర్డినేటర్ తదితరులు పాల్గొన్నారు.
0 comments:
Post a Comment