జ్ఞాన తెలంగాణే బంగారు తెలంగాణ
సమాజాన్ని మార్చేది నేటి పిల్లలేనని, ప్రస్తుత సమాజంలో బాలల కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉందని తెలంగాణ రాష్ట్ర బీసీ కమీషన్ ఛైర్మన్ జూలూరీ గౌరీశంకర్ పేర్కొన్నారు. బాలసాహిత్యం - నా అనుభవాలు - సూచనలు అనే అంశంపై బాలచెలిమి పిల్లల వికాస పత్రిక, చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో శనివారం ఆక్స్ఫర్డ్ గ్రామర్ స్కూల్లో 'బాలచెలిమి ముచ్చట్లు' 12వ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ సమాజంలో పిల్లలు పావు వంతు ఉన్నారని, వాళ్ళకు బంగారు భవిష్యత్తు ఉందన్నారు. పిల్లలను సమర్థులను చేస్తేనే తెలంగాణ రాష్ట్రం పురోగమిస్తుందన్నారు. జ్ఞాన తెలంగాణనే బంగారు తెలంగాణను ప్రతిష్టిస్తుందన్నారు. ఏప్రిల్ మాసం నుంచి చందమామ లాంటి చిన్న పిల్లల మాసపత్రిక 'బాలచెలిమి' రానుండటం గర్వకారణం అన్నారు. చిల్డ్రన్స్ ఎడ్యుకేషనల్ అకాడమి ఛైర్మన్ మణికొండ వేదకుమార్ నేతృత్వంలో 'బాలచెలిమి' మాసపత్రిక రావటాన్ని అభినందిస్తున్నట్లు తెలిపారు. పెద్దల కోసం ఎన్నో పత్రికలు ఉన్నాయని, కానీ పిల్లలకు విరివిగా పత్రికలు రావల్సి ఉందన్నారు. ఆ మార్గంలో బాలచెలిమి పిల్లల మాసపత్రిక రావడం శుభసూచికం అన్నారు. బాలచెలిమి చర్చా వేదిక ఒక సంవత్సర కాలం పూర్తి చేసుకోవడం గర్వకారణం అన్నారు.
కవి, రచయిత యాకూబ్ మాట్లాడుతూ బాల్యం ఎంతో అందమైనదని, మనిషిని ఎలా ప్రేమించాలో బాల్యంలోనే నేర్పించాల్సిన బాధ్యత తల్లిదండ్రులు, ఉపాధ్యాయులపై ఉందన్నారు. కవి, రచయిత, నేషనల్ బుక్ ట్రస్ట్ చైర్మన్ పత్తిపాక మోహన్ మాట్లాడుతూ చిన్నప్పుడు చదివిన బాల సాహిత్యమే పెద్దవాళ్లు అయిన తరువాత మంచి జీవితాన్ని ప్రసాదిస్తుందన్నారు. రచయిత, ఫోటోగ్రాఫర్ కందుకూరి రమేష్ బాబు మాట్లాడుతూ పిల్లలను రచయితలుగా అంగీకరించాల్సిన బాధ్యత పెద్దలపై ఉందన్నారు. 'బాల చెలిమి' 12 నెలలు పూర్తి చేసుకున్న సందర్భంగా సంవత్సరం కాలంలో కార్యక్రమాల ముచ్చట్లను పుస్తక రూపంలో తీసుకొచ్చి సమావేశంలో ప్రదానం చేశారు. కార్యక్రమంలో యు. విజయశేఖర రెడ్డి, డా.సిరి, అహోబిలం ప్రభాకర్, కె. ప్రభాకర్, కో-ఆర్డినేటర్ తదితరులు పాల్గొన్నారు.
0 comments:
Post a Comment