కాలం మారుతోంది... సామాజిక జీవనపరిస్థితులూ మారుతున్నాయి...
రేపటితరమైన పిల్లల ఆలోచనా విధానం కూడా మారుతోంది. ఈ నేపథ్యంలో.. బాలల
సాహిత్యం పేరుతో... అనగనగా అని కథలు మొదలు పెట్టకుండా... పిల్లల్లో మానసిక
పరిణితిని పెంపొందించాల్సిన అవసరం ఉంది. ఇదే విషయాన్ని... జూన్ 9న
ఆక్స్ఫొర్డ్ గ్రామర్ స్కూల్లో జరిగిన బాలచెలిమి ముడవ ముచ్చట్లు
కార్యక్రమంలో బాల సాహితీవేత్తలు, రచయితలు పేర్కొన్నారు. ఈసారి... 'నేను -
నా రచనా నేపథ్యం' అంశంపై బాలసాహితీ వేత్తలు సమావేశమై చర్చించారు.
ప్రముఖ రచయిత అమ్మంగి వేణుగోపాల్ ముఖ్య అతిథిగా పాల్గొన్న ఈ
కార్యక్రమంలో... బాలసాహితీ రచయితలు... చంద్రశేఖర్ ఆజాద్, ఐతా చంద్రయ్య,
డా.వి.ఆర్.శర్మ, పత్తిపాక మోహన్, కన్నెగంటి అనసూయ, సుజాత, ఆకెళ్ల
సుబ్బలక్ష్మి, డా. సిరి, మల్లీశ్వరి, తదితరులు హాజరయ్యారు.
చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ అకాడమీ చైర్మన్ ఎం.వేదకుమార్ అధ్యక్షతన
జరిగిన ఈ కార్యక్రమానికి రచయిత, నేషనల్ బుక్ ట్రస్ట్ అసిస్టెంట్
ఎడిటర్ పత్తిపాక మోహన్ వ్యాఖ్యాతగా వ్యవహరించారు.
బాలచెలిమి ముచ్చట్లలో పాల్గొనడానికి వచ్చిన రచయితలను పరిచయం చేస్తూ... ఎం.వేదకుమార్ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఎం.వేదకుమార్, చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ అకాడమీ చైర్మన్
ప్రముఖ రచయిత అమ్మంగి వేణుగోపాల్... బాల చెలిమి మూడవ ముచ్చట్లలో
పాల్గొనడం సంతోషంగా ఉంది. అప్పట్లో... బాల చెలిమికోసం చిల్డ్రన్స్
ఎడ్యుకేషన్ అకాడమీ మూడేళ్లపాటు పరిశోధన చేసింది... ఆనాటి పెద్ద రచయితల
నుంచి యువ రచయితలకు అందరితో మాట్లాడి, వర్క్షాప్లు నిర్వహించి.. బాల
చెలిమిని నడిపాం. ఎబౌట్ చిల్డ్రన్, ఫొర్ చిల్డ్రన్, బై చిల్డ్రన్
అంశాలతో రచనలు ఉండాలన్నది మా భావన. కుగ్రామంలో ప్రభుత్వ పాఠశాలలు తప్ప
ఏమీలేని బాలబాలికలకు.. రేడియో మాత్రమే వినగలిగే పిల్లలకు అకాడమీ
పుస్తకాలతోపాటు అనుబంధంగా పుస్తకాలు అందజేయాలన్నది అకాడమీ ఆలోచన. పభుత్వ
విద్యా విధానంలో ఉన్న సమస్యలపై.. ఎన్నో సలహాలు సూచనలు ఇచ్చినా ప్రభుత్వాలు
పట్టించుకోలేదు. అదే పాత పద్ధతిలో కొనసాగించాయి. ఈ నేపథ్యంలో
మనకున్నపరిమితులకు లోబడి వారికి సప్లిమెంటరీ పుస్తకాలు ఇవ్వాలని
ప్రయత్నిస్తాం.
చంద్రేశఖర్ ఆజాద్, బాల సాహితీ రచయిత
నేను 76 నవలలు రాశాను. రేడియోతోపాటు అన్ని ప్రక్రియల్లో నా రచనలు
జరుగుతున్నాయి. మా ఇంటి దగ్గర అనేకమంది సామాజిక వర్గాల ప్రజలు ఉండేవారు.
అక్కడి ప్రకృతినివారిని గమనిస్తూ ఉండేవాడిని. ఆ తర్వాత... రచనలు చదవడం
మొదలుపెట్టాను. ఒక రచయితగా నిలదొక్కుకోవాలంటే... అప్పుడు ఎలాంటి పరిస్థితి
ఉండేదో... ఇప్పుడు అలాగే ఉంది. బాలసాహిత్యం రచనలు నాకు అనుకూలంగా
అనిపించాయి. అయితే బాల రచనలను పత్రికలు పెద్దగా పట్టించుకునేవి కావు....
పెద్దల పుస్తకాలు, పిల్లల పుస్తకాలు రాస్తూ ఉండేవాడిని. ఇటీవలి కాలంలో
నేను రాసిన 'దారి తప్పిన పిల్లవాడు' అనే నవల రాబోతోంది. బాల సాహిత్యం అంటే
అప్పటి పంచతంత్రకథలు, నీతి కథలు అన్నట్టుగా తయారైంది. నేటి జనరేషన్...
వాళ్ల చుట్టూ ఉన్న పరిస్థితులు, ఆటవస్తువులు, భావజాలం మారిపోయాయి. నా
రెండేళ్ల మనవడిలాగే అందరూ పిల్లలు సెల్ఫోన్ గేమ్స్లోనే ఎక్కువ సేపు కాలం
గడుపుతున్నారు. ఈ రోజుల్లో డోరేమాన్, ఛోటా బీమ్ కార్టూన్లు ఎక్కువగా
చూస్తున్నారు. జెకే రౌలింగ్ లాంటివారు రాసిన నవలను మనం వందలు ఖర్చు పెట్టి
కొంటున్నాం. మనం తెలుగులో కనీసం అటువైపు ఆలోచించడంలేదు. పిల్లలకు జీవితం
అంటే చెప్పాలి. చెప్పిన చెప్పిన కథలే చెప్పకుండా... పిల్లలతో మమేకం
అవ్వాలి. అప్పుడు కొత్త కథలు వస్తాయి. పత్రికలవాళ్లు అడిగారని కథలు
రాయొద్దు... రచనల్లో గాఢత, కొత్తదనం ఉండాలి. మనం పరిధిదాటి పిల్లల
జీవితాల్లో వెళ్లినపుడు అనేక కథలు దొరుకుతాయి. ముందుగా రచయితలు మారాలి.
కన్నెగంటి అనసూయ, పిల్లల రచయిత్రి
నేను చిన్నపల్లెటూరులో పుట్టాను... అక్కడి ప్రకృతితో గాఢమైన అనుబంధం
ఉంది. రోజులో అధిక సమయంలో ఆటలతో గడిచిపోయేది. నా ప్రతి కథలోనూ... నా
చిన్నతనం అనుభవాలు కనిపిస్తాయి. స్కూల్లో జరిగిన వ్యాసరచన పోటీల్లో ...
రుక్కులు, గోవులొస్తున్నాయి జాగ్రత్త లాంటి పుస్తకాలు బహుమతులుగా వచ్చేవి.
ఇంటర్ కాలేజీ పత్రికలో ఆర్టికల్స్ రాశాను. ఒకసారి పుష్కరాలకు వెళ్లినపుడు
అక్కడి బ్రాహ్మణులు పొట్టకూటి కోసం పడుతున్న వెతలపై తొలిసారిగా కథ రాశాను.
ఏలూరు టైమ్స్ పత్రికలో నా తొలికథ ప్రచురితమైంది. నేను రోజూ కథలు రాయను...
తట్టుకోలేని బాధకలిగినపుడు మాత్రమే నా నుంచి మంచి కథ వస్తుంది. ఇక బాలల
రచనలు విషయానికొస్తే.... చిన్నప్పటి నుంచే పిల్లల కోసం కథలు రాశాను. గతంలో
కంటే ఇప్పుడు బాలల రచనలు పెంచాను. వాళ్లకు కార్టూన్ ఛానెల్స్ పెట్టేసి మన
చేతులారా నాశనం చేస్తున్నాం. సుమారు 3 వందల బాల సాహిత్యం కథలు రాశాను.
గ్రామాల్లో ఉన్న పిల్లలకు... ప్రపంచంలో ఎన్ని వసతులున్న పిల్లలకు
తీసిపోకుండా.. బాలసాహిత్యం అందించే అవకాశం మనకు ఉంది. దీన్ని
ప్రయోగాత్మకంగా చేపట్టాం. ఏడు ప్రచురణల తర్వాత ఆపివేయడం జరిగింది.
బాలచెలిమి పునరుద్ధరణలో భాగంగా ఇది మూడవ ముచ్చట. ఇప్పటి వరకు పిల్లలకు
రాయని రచయితలు, మేథావులు, ప్రొఫెసర్లు లాంటి వారికి ప్రోత్సహించే వేదికగా
ఉండాలన్నది మా భావన. బాలచెలిమి పత్రిక కోసం నెలకు ఒక కథ ఇవ్వడానికి ప్రముఖ
కవి అమ్మంగి వేణుగోపాల్ సమ్మతించడం సంతోషంగా ఉంది. తెనాలి రామకృష్ణుడు,
అక్బర్ బీర్బల్, ముల్లా నసీరుద్దీన్ మాదిరిగా ఈ దక్కన్ ప్రాంతం నుంచి
ఒక క్యారెక్టర్కి క్రియేట్ చేసి అమ్మంగిగారు కథలు తెచ్చే ప్రయత్నాలు
జరుగుతున్నాయి. పిల్లల పుస్తకాలను.. పెద్దలు కూడా ఎక్కువగానే చదువుతారు. మా
అమ్మగారు కూడా... ఆఖరిశ్వాస వరకు చందమామ చదివారు. పిల్లల పత్రిక అంటే...
ఒకటే మూస ధోరణిలో రచనలు ఉండాలన్నది చిల్డ్రన్స్ అకాడమీ ఆలోచన కాదు. అన్ని
రకాల ప్రయోగాలు చేస్తూ... సంతులనం పాటిస్తూ.. మన పరిస్థితులను బట్టి...
ఎలాంటి సాహిత్యాన్ని పిల్లలకు అందజేయాలి...దానిపై అకాడమీ ప్రయత్నం
చేస్తోంది.
బాలచెలిమి ముచ్చట్లలో.. ..ముందుగా.. సిద్ధిపేటకు చెందిన ప్రముఖ బాల సాహితీవేత్త
ఐతా చంద్రయ్య... తన రచనల ప్రస్థానాన్ని వివరించారు.
ఐతా చంద్రయ్య, బాల సాహితీ వేత్త
నేను సిద్ధిపేటలోని జేబీఎస్ పాఠశాలలో 6వ తరగతిలో ఉండగా.. బ్రహ్మయ్య
అనే ఉపాధ్యాయుడు... రచనలవైపు ప్రోత్సహించారు. ఆయన చొరవతోనే స్కౌట్స్లో
చేరి తొలిసారిగా స్కౌట్స్పై ఓ గేయం రాశాను. నా గేయం ప్రచురణ, సార్
ప్రోత్సాహంతో రచనలపై ఆసక్తి పెరిగింది. హై స్కూల్లోనూ మా టీచర్
ప్రోత్సాహంతో చిన్నచిన్న పద్యాలు రాయడం ప్రారంభించాను. కథలు రాస్తున్న
క్రమంలో.... మన తెలంగాణ బాల సాహితీవేత్తలు తక్కువ అనే అప ప్రథ వచ్చింది.
అంతకుముందు నుంచే నేను బాల సాహిత్యం చదవడం వల్ల... బాల సాహిత్యం రాయడం
ప్రారంభించాను. నా రచనలు బాల భారతం, చందమామలో వచ్చినయి. నేను కథలు
సంపుటితాలు, గేయ సంపుటితాలు రాశాను. వీటితోపాటు 18 మంది తెలంగాణ యోధుల
జీవిత చరిత్రలు రాసినాను. అవి త్వరలోనే వస్తున్నాయి. అందులో సీఎం కేసీఆర్
చరిత్ర కూడా రాశాను. ఎన్.బి.టిలో ఇంతకుముందు తెలంగాణ వాళ్లకు అవకాశం
దక్కేది కాదు... మోహన్ గారు వచ్చాక అది సాధ్యమైంది. వారు పంపిపన హిందీ బాల
సాహిత్యాన్ని తెలుగులోకి అనువందిచాను. సిద్ధిపేటలో ప్రస్తుతం డజనుకుపైగా
బాల సాహిత్య రచయితలున్నారు. వారిని చూస్తుంటే నాకు సంతోషం కలుగుతోంది.
సుజాత, బాల సాహిత్య రచయిత్రి
నా పదహారవ ఏట ఒక నవలతో రచనా ప్రయాణాన్ని మొదలుపెట్టాను. 'వెన్నెల
వాన', 'చింతనీకేలా' నా తొలి నవలలు... ఆ తర్వాత నవలల జోలికి నేను వెళ్లలేదు.
ఆతర్వాత రాసిన కథలకు మంచి స్పందన వచ్చింది. అవి పది భాషల్లో అనువాదం
అయ్యాయి. బాలలకు ఎలాంటి విషయాలు చెప్పాలి... వాళ్లు ఏం అర్థం చేసుకోవాలలి..
వాళ్లకు ఏమి తెలియాలి.. అసలు టీచర్లు ఎలా ఉండాలి అనే అంశాలతో 15 రోజులపాటు
అప్పట్లో శిక్షణా శిబిరం ఏర్పాటు చేశారు. అప్లికేషన్తోపాటు.. మా
అమ్మాయికి వచ్చిన ఆలోచన నుంచి రాసిన పాట పంపాను....
అమ్మా ఈ రైలు బండి అసలెక్కడ పుట్టిందే...
అన్నమెవరు పెడ్తారే...
అమ్మా ఈ రైలు బండి అసలెక్కడ పుట్టిందే..
ఆ పాట... నా తమ్ముడి మిత్రుడి సహాయంతో విశాలాంధ్రలో ప్రచురితం అయింది.
అక్కడికి వచ్చిన రచయితల భావాలు నాలో మార్పును తెచ్చాయి. ఆ తర్వాత నేను
పిల్లలు, పెద్దలకు రచనలు చేశాను. అక్కడి నుంచి చేపలు, పరిహారం, వేకువ రేఖలు
కథల పుస్తకాలు వచ్చాయి. నా పాటలు రేడియోల్లో వచ్చేవి... అవే పుస్తకాలుగా
కూడా వచ్చాయి. కిన్నెర లలితగీతాలు... వంటివి వచ్చాయి.. నా కథలకు
ఎన్.సి.ఆర్.టి.ఇ నుంచి కూడా బహుమతులు వచ్చాయి.
ఆకెళ్ల సుబ్బలక్ష్మి, బాలల రచయిత
చిన్నపుడు మా ఇంటిపక్కన రాజుల కుటుంబాలు ఉండేవి. వారి ఇంటికి
వెళ్లినపుడు... చందమామ పుస్తకం చదివాను... అలాంటి కథలు రాయాలనిపించేది.
ఆరోజుల్లో వచ్చే డిటెక్టివ్ నవలలో మొదటిసారి నేను రాసిన జోక్ అచ్చయింది.
దానికి 5 రూపాయలు బహుమతి కూడా ఇచ్చారు. అక్కడి నుంచి ఐదేళ్లపాటు ఆ
పుస్తకంలో క్విజ్లు, ఫజిల్స్, లాయర్ సలహాలు సమాధానం ఇచ్చాను.
విజయబాపినీడు గారి విజయ పత్రికలో 'పాపం సంధ్య' రాశాను. ఒకటి రాస్తే మరొకటి
రాయలేమనుకుంటారు గానీ... నేను స్పందించే విధంగా అంశం నచ్చితే కథలు, కవితలు,
బాలసాహిత్యం రాశాను. శత్రువు ఆట అనే పిల్లల కథకు మంచి పేరు వచ్చింది. ఆ
తర్వాత పిల్లల పత్రిక బొమ్మరిల్లులో కథలు రాశాను. అప్పటి చందమామ నుంచి
ఇప్పటి నాని పత్రికల్లో నా కథలు ప్రచురితం అయ్యాయి. నా రచనల వల్ల పిల్లలకు,
బాల కథా రచయితలకు ఎంతోకొంత ప్రయోజనం ఉండాలని..'బాల గోకులం' అనే సంస్థ
ఏర్పాటు చేశాం. అందులో పిల్లలకు కథల పోటీలు పెట్టేవాళ్లం. కథా రచయితలకు
'బాల నేస్తం' అనే బిరుదు ఇచ్చేవాళ్లం.
అమ్మంగి వేణుగోపాల్, కవి - రచయిత
బాల సాహిత్యం రాసేవాళ్లు చాలా సవాళ్లు ఎదుర్కొంటారు. ముందుగా పెద్దల
రచనల చేసినవాళ్లు ఆ తర్వాత బాల సాహిత్యం రాసినపుడు... ..రచయితలకు
ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. పిల్లలస్థాయికి దిగి రచనలు చేయడం పెద్ద సవాల్.
దాదాపు అందరు రచయితల మాదిరిగానే నేను చందమామ నుంచే క్రియేటివిటీని, చదివే
శక్తిని నేర్చుకున్నా. కొన్ని విలువలను మనం బాలల సాహిత్యం నుంచి
నేర్చుకుంటాం. పిల్లల పనులు కూడా తెలివితక్కువగా ఉంటూ ... సాహసోపేతంగా
ఉంటాయి. నేను చిన్నపుడు... చందమామ వంటి కథలతో ప్రేరేపితమై 'రాజు కథ' అనే కథ
రాశాను. బాలచెలిమి కోసం వేదకుమార్గారి విజ్ఞప్తి మేరకు కథలు రాసే పనిలో
ఉన్నాను. డోరేమాన్ లాంటి కార్టూన్లకు పిల్లలు అడిక్ట్ అయి ఉన్నారు.
వాటిలో కథలు సైంటిఫిక్గా చాలా పెద్దగా ఉంటాయి. మరి చిన్న పిల్లలకు
అంతపెద్ద సైంటిఫిక్ కథలు అవసరమా అనిపిస్తూ ఉంటది. అలాంటి వ్యవసానాల నుంచి
బాల చెలిమి లాంటి పుస్తకాలు డైవర్ట్ చేయగలిగేలా ఉంటే బాగుంటుంది.
బాలచెలిమిలో ప్రచురితమైన కథలపై పిల్లల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటే
బాగుటుంది. ఇంగ్లీష్ బాల రచనలు కూడా పరిశీలించాలి. కొత్తయుగంలో నడిచే
పత్రికలు చందమామలా ఉంటే నడవదు. ఐ.క్యూ, జనరల్ నాలెడ్జికి సంబంధించిన
అంశాలు కూడా ఉండాలి.
డా. సిరి, బాలల రచయిత
బాల సాహిత్యమంటే.. పిల్లల కోసం ఏదో రాస్తుంటారు అని బయట
చెప్పుకుంటారు. పిల్లలు ప్రయోజకులు అవాడానికి ఏది ఉపయోగపడాలో దాని గురించి
రాస్తుంటారు. పిల్లల కోసం రచనలు చేయడం చిన్న అనుకుంటారు.. ..కానీ అనుభవంలో
అది పెద్ద విషయమే. మనం రాసే రచనలు అందరూ పిల్లలకు అందుతున్నాయా అన్నది
అనుమానమే. బాల సాహిత్య రచన అక్షరాల రూపంలో మనం కూడబెట్టిన ఆస్తి...
అమ్ముడుపోని పుస్తకాల కట్టలో మిగిలిపోతోంది. తెలుగులో రచనలు చేస్తే... చాలా
మంది ఇంగ్లిష్లో చేయండి... బాగా అమ్ముడు పోతాయాని సలహా ఇస్తుంటారు. అసలు
మన మాతృభాషలో రాస్తే మన పిల్లలు ఎందుకు చదవరు. తల్లిదండ్రులు మాతృభాషను
ఎందుకు ప్రోత్సహించరు. దీనిపై రచయితలు, ప్రచురణకర్తలు ఆలోచించాలి.
మల్లీశ్వరి, బాల సాహితీ రచయిత
బాల సాహిత్యమంటే... ఈ రోజుల్లో అందరూ కథల సాహిత్యమనే అనుకుంటున్నారు.
కథ అంటే.. అనగనా ఒకప్పుడు... ఒకానొకప్పుడు.. అని చెబుతుంటారు. కథను ఆ
రోజుల్లో అని చెప్పడం బాగానే ఉంటుంది. కానీ ప్రతీది అలా చెప్పడం బాగాలేదు.
చలంగారు అన్నట్లు... పెద్దలే పిల్లల పట్ల వినయంగా, విధేయంగా ఉండాలి.
వాళ్లను రిస్ట్రిక్ చేయడంవల్ల.. వాళ్ల ఊహల్ని ఆపేస్తుంటాం. కోపాలు,
వైషమ్యాలు, ఉద్రేకాలు చోటుచేసుకుంటున్న ప్రస్తుత రోజుల్లో సంయమనం చాలా
అవసరం. దీనికోసం పిల్లల్లో ఉండే రకరకాల భావాలను గుర్తిచగలగాలి. మా పెరట్లో
పిచ్చుకల గూటిలో గుడ్లు తొలగించడాన్ని ప్రశ్నించిన మా అబ్బాయి ఆలోచనలోంచి
'ఎవరు చెప్పినా వినాలి' అనే కథను రాశాను. కథల రూపంలో నీతిబోధ తరతరాలుగా
జరుగుతూనే ఉంది. కానీ ప్రయోజనం అయితే ఇప్పటి వరకు నాకు కనిపించలేదు.
చిన్నపిల్లల్లో ఆలోచనాపరమైన కదలికలను తీసుకుని రాగలిగితే.. ప్రయోజనం
ఉంటుంది.
డాక్టర్ శర్మ, బాల సాహితీవేత్త
రచయితల సహాయ, సహకారాలతో ప్రతి నెల బాలచెలిమి ఇలా వికసిస్తూ ఉంటుంది.
అందరూ రచనలు చేస్తూ ఉన్నాం.. ..కానీ ప్రచురణకు సంబంధించి కవర్ పేజీ,
అక్షరాలు స్టైల్ వంటి సాంకేతిక విషయాలు ఎవరికీ సరిగా తెలియదు. వీటికి
శిక్షణా తరగతులు పెట్టాలన్నది నా విజ్ఞప్తి. దానివల్ల అందరికీ తెలుస్తుంది.
మనం అచ్చు వేసే పుస్తకాల్లో కనీసం 30 శాతం స్కూలు పిల్లలకు ఉచితంగా
అందిస్తే బాగుటుందని నా ఆలోచన. బాలచెలిమికి అందరికీ సలహాలు, సూచనలు
ఆహ్వానిస్తున్నాం. ఇతర భాషల్లో బాల సాహిత్య రచనలు ఎలా ఉన్నాయో పరిశోధనలు
కూడా చేయాలి... అప్పుడు మన ఆలోచన విస్తృతమవుతుంది.
ప్రముఖ రచయితలతోపాటు... పలువురు యువ రచయితలు కూడా... తమ రచనా అనుభవాలను...బాలచెలిమి ముచ్చట్లలో పంచుకున్నారు.
0 comments:
Post a Comment