హితాన్నే చేకూర్చేదే సాహిత్యం... ఎన్నో రకాలైన సాహితీ ప్రక్రియల్లో బాల
సాహిత్యం ప్రత్యేకమైనది. తల్లి జోలపాట మొదలుకుని.. బాల్యదశ ముగిసేవరకు
వచ్చే విజ్ఞానమంతా బాల సాహిత్యం కిందకే వస్తుంది. అందుకే బాల్య దశలో వారి
మనసులో నిండే ఊసులే వారి జీవితమంతా ప్రవహిస్తూ జీవనదశ దిశలను
మారుస్తుంటాయి. అయితే మారిన ప్రస్తుత జీవన విధానంతో... పిల్లలు కేవలం...
పాఠ్య పుస్తకాలకే పరిమితమవుతున్నారు. పాఠ్యాంశాలకు అదనంగా బాలల సాహిత్య
రచనలు వారి వద్దకు చేర్పించి చదివించాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది. ఇలాంటి
సాహిత్యం వల్లే వారి ఆలోచనా విధానాలు ఉన్నతంగా ఉంటాయనడంలో ఎలాంటి సందేహం
లేదు. పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానం.. ..వారిని ఎలక్ట్రానిక్
గ్యాడ్జెట్ల వైపు మాత్రమే ఆకర్షిస్తోంది. కంటికి కనిపించే దృశ్యాలే
తప్ప... రచనలు చదవడం వల్ల ఊహించుకునే పరిస్థితి ఉండటంలేదు. చదివిన
పుస్తకాలను.. వారి భావాలను ఒకచోట చర్చించడం ద్వారా పిల్లలకు మరింత ప్రయోజనం
కలుగుతుంది. అలాంటి వేదిక ఏర్పాటు లక్ష్యంతో... 'బాల చెలిమి' చిల్డ్రన్స్
ఎడ్యుకేషన్ అకాడమీ ఆధ్వర్యంలో... అంతర్జాతీయ పిల్లల పుస్తక దినోత్సవాన్ని
హిమాయత్ నగర్లోని ఆక్స్ఫొర్డ్ గ్రామర్ స్కూల్లో ఏప్రిల్ 2న
నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ అధ్యక్షుడు
అయాచితం శ్రీధర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. 'బాల చెలిమి' ప్రధాన
సంపాదకులు ఎమ్.వేదకుమార్ ఈ కార్యక్రమానికి ముఖ్య వ్యాఖ్యాతగా
వ్యవహరించారు... ఈ కార్యక్రమంలో ఎన్బిటీ సంపాదకులు డా.పత్తిపాటు మోహన్,
బాల సాహితీవేత్తలు, రచయితలు గంగదేవు యాదయ్య, వి.ఆర్.శర్మ, డాక్టర్ సిరి,
సాహితీ వేత్తలు డాక్టర్ వడ్డేపల్లి కృష్ణ, డాక్టర్ ఎన్.రఘు,
శ్రీనివాస్, మంచి పుస్తకం ప్రచురణ కర్త కె. సురేష్ తదితరులు
పాల్గొన్నారు.
ఎమ్. వేదకుమార్, బాల చెలిమి ప్రధాన సంపాదకులు..
సాధారణ పాఠ్య పుస్తకాలతోపాటు... అదనంగా పుస్తకాలను చదవాల్సిన అవసరం
ఉందని... ప్రపంచవ్యాప్తంగా చాలా మంది రచయితలు ఇదే అభిప్రాయపడుతున్నారు.
పుస్తక పఠనంతో జీవితాన్ని తెలుసుకునే అవకాశం ఉంటుంది. అందమైన కథలతో... ఓ
కొత్త ప్రపంచంలోకి వెళ్లవచ్చు. సినిమాలు, కార్టూన్ ఫిల్మ్స్లో దర్శకులు
తమకున్న విజన్తో కథలు చెబుతారు.. అదే మంచి కథల పుస్తకాలు చదివినపుడు
అంతకన్నా ఎక్కువగా ఊహా ప్రపంచంలో విహరించవచ్చు.. ప్రకృతి, మనుషులు,
పండుగలు, ఆచారాలు, ప్రజల జీవన విధానం వంటివి పుస్తకాలతో తెలుస్తాయి.
విద్యార్థులుగా ఆ విషయాలను తెలుసుకోవడం మీకు చాలా ముఖ్యం. అంతర్జాతీయ
పిల్లల పుస్తక దినోత్సవం సందర్భంగా... ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం
సంతోషంగా ఉంది. బాల చెలిమి వేదికగా... ప్రతి నెల రెండో శనివారం ఇలాంటి
కార్యక్రమాలు నిర్వహిస్తాం. పాఠశాల విద్య జ్ఞానాన్ని పెంచుకోవడానికి,
జీవితంలోపైకి ఎదగడానికి అవసరమైనదే... అయితే వాటికి అనుబంధంగా పిల్లల రచనలు
చదవడం చాలా అవసరమని ఇక్కడికి వచ్చిన వక్తలు కూడా చెబుతున్నారు.
పుస్తకాలు చదవడం, రచనలు చేయడం, పాటలు పాడటంతో మీలో దాగిఉన్న కళలను
బయటికి తీయడం ముఖ్యం. ఆ ఉద్దేశంతోనే 90వ దశకంలో ప్రచురితమై అనివార్య
కారణాలతో నిలిచిపోయిన బాల చెలిమిని పిల్లల అంతర్జాతీయ పుస్తకాల దినం
సందర్భంగా మళ్లీ తెస్తున్నాం. ఈ మధ్యనే జరిగిన ప్రపంచ తెలుగు మహా సభల్లో...
పిల్లల రచనలపై చర్చిండం జరిగింది. ఆ పరిణామ క్రమంలోనే తమవంతు ప్రయత్నంగా
తెలుగులో బాల చెలిమి రాబోతోంది. ఎక్కువమందికి దగ్గరవ్వాలనే లక్ష్యంతోనే బాల
చెలిమిని తెలుగులోకి తెస్తున్నాం.
బాల చెలిమి ముచ్చట్లులో భాగంగా... ఆక్స్ఫొర్డ్ గ్రామర్ స్కూల్
విద్యార్థులు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. వేదికను అలంకరించిన
బాల సాహితీవేత్తలు... పిల్లలతో మమేకమై పుస్తక పఠనాసక్తిని పెంచేందుకు పలు
సూచనలు చేశారు. ప్రముఖ పిల్లల పుస్తక రచయిత డాక్టర్ సిరి పిల్లలను
అడిగి... వారికొచ్చిన కథలు వినిపించమని ప్రోత్సహించారు. అటు విద్యార్థులు
కూడా ఉత్సాహంగా తమకు తెలిసిన కథలు వినిపించారు. కార్యక్రమానికి ముఖ్య
అతిథిగా వచ్చిన రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ అధ్యక్షుడు ఆయాచితం శ్రీధర్ తన
అనుభవాలను పంచుకున్నారు.
ఆయాచితం శ్రీధర్, రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ అధ్యక్షుడు...
ఏప్రిల్ 2న ప్రత్యేక సందర్భంగా 'పిల్లల అంతర్జాతీయ పుస్తక
దినోత్సవాన్ని నిర్వహించడం సంతోషకరం. ఇలాంటి పండుగలు పెద్ద ఎత్తున
చేసుకోవాల్సిన అవసరం ఉంది. వచ్చే ఏడాది రాష్ట్రవ్యాప్తంగా అన్ని
గ్రంథాలయాల్లో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించేందుకు కృషి చేస్తాం. పిల్లల
కథా రచయితలు ఇందులో పాల్గొని.. సమాజానికి మంచి సందేశం ఇవ్వాలన్నారు. చందమామ
పుస్తకం నుంచే నాకు పఠానసక్తి మొదలైంది. పిల్లలకు చదువు పట్ల, పుస్తకాల
పట్ల ఆసక్తి కలిగించే బాధ్యత తల్లిదండ్రులపై ఉంది. పిల్లల జీవితంలో ఏ
సందర్భమైనా పుస్తక ప్రమేయం ఉండేలా చూడాలి. ఇంటికొచ్చే పిల్లలకు గానీ... మనం
ఎవరి పిల్లల పుట్టిన రోజు వేడుకలకు, ఏదైనా బహుమతులు, ప్రోత్సాహకాలు ఇచ్చే
సందర్భం అయినా... పుస్తకాలను బహుమతిగా ఇచ్చే సంస్కృతి పెరగాలి. పిల్లల్లో
పఠనాసక్తి, గ్రంథాలయాల్లో వేళ్లే ఆసక్తి పెంచాలి. నేటి స్కూల్ పిల్లలు
వారి పాఠ్య పుస్తకాలు, స్కూల్కి వెళ్లి రావడమే తప్ప... గ్రంథాయాలుకు
వెళ్లడం లేదు. పిల్లల్లో ఇలాంటి కార్యక్రమాలు ప్రోత్సహించేందుకు... బాల
చెలిమి ద్వారా వేదకుమార్ చేస్తున్న కృషిని... ప్రశంసిస్తున్నాను. ఈ
కార్యక్రమం ద్వారా నా బాధ్యతను గుర్తుచేసినందుకు ఆయన... ధన్యవాదాలు.
కార్యక్రమంలో భాగంగా ఎన్.బి.టి( నేషనల్ బుక్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా)
పిల్లల రచనలకు సంబంధించిన పలు పుస్తకాలను ప్రదర్శించారు. సుమారు 150
పుస్తకాలు ప్రదర్శనలో పెట్టారు.
ఆ పుస్తకాలను కార్యక్రమంలో పాల్గొన్న రచయితలు, వక్తలతోపాటు
విద్యార్థులు కూడా ఆసక్తికరంగా పరిశీలించారు. అంతర్జాతీయ పిల్లల పుస్తక
దినోత్సవం విశిష్టతను బాలల సాహితీ రచయిత డాక్టర్ మోహన్ వివరించారు.
డాక్టర్ మోహన్, పిల్లల కథా రచయిత
ఫెయిరీ టేల్స్... కాన్సెప్ట్ని హన్స్ క్రిస్టియన్ ఆండర్సన్
ప్రారంభించాడు. ఆయన జ్ఞాపకార్థం ఇలాంటి కార్యక్రమాలను యునెస్కోతోపాటు పలు
సంస్థలు ప్రపంచ వ్యాప్తంగా నిర్వహిస్తున్నాయి. ఇందులో 5 రకాల కార్యక్రమాలు
ఉంటాయి. ఈ రోజు ఓ కొత్త పుస్తకాన్ని క్రియేట్ చేయడం, ఓ కొత్త పుస్తకాన్ని
కొనడం, కొత్త పుస్తకంపై చర్చలు జరపడం, కొత్త పుస్తకాన్ని మీ ఆత్మీయులకు
ఇవ్వడం వంటివి. ఇలాంటి సందర్భంలో ఒక రచయితగా పాల్గొనడం సంతోషంగా ఉంది.
తమకు చిన్నపుడు... ఇప్పుడున్న ఎలక్ట్రానిక్ పరికరాలు లేవు. తమ వద్ద ఉన్న
డబ్బుతో చందమామ సహా పిల్లల కథల పుస్తకాలు చదివే వాళ్లం. పిల్లల కోసం రాసిన
రచనలు ఎంతో తీయగా ఉంటాయి. వాటిని ఆ ఆరోజుల్లో పెద్దవాళ్లు కూడా చదివే
వాళ్లు. చిన్న పిల్లల రచనలు అన్ని వయసుల వారినీ ఆకట్టుకుంటాయి. అందుకే
పిల్లలు వీలైనంత వరకు తమ రచనా సామర్థ్యాన్ని పెంచుకోవాలి.
90 వ దశకంలో వచ్చిన బాల చెలిమి పత్రిక తొలినాటి పరిస్థితులను... మంచి
పుస్తకం ప్రచురణకర్త కె. సురేష్ కార్యక్రమంలో వివరించారు. ఆ రోజుల్లో
పిల్లల పుస్తకాల కోసం తాము ఎదుర్కొన్న సవాళ్లను తెలిపారు.
కె.సురేష్,
మంచి పుస్తకం ప్రచురణకర్త
పిల్లల అంతర్జాతీయ పుస్తక దినోత్సవం రోజున... బాల చెలిమి పుస్తకం
మరోసారి ఆవిష్కరించనున్నారు అనే విషయం... చాలా సంతోషంగా ఉంది. ఆ రోజుల్లో
పిల్లల రచయితలను ఒకే వేదికపై తీసుకొచ్చి వేదకుమార్ గారు కార్యక్రమాలను
నిర్వహించేవారు. పిల్లల పుస్తకం తీసుకునిరావాలంటే రచయితలతోపాటు
చిత్రకారులను కూడా ఒకే దగ్గరకు తీసుకొచ్చి ఎంతగానో కృషి చేయాల్సి ఉంటుంది.
బాల చెలిమిని మళ్లీ తీసుకునిరావడంతోపాటు బాల చెలిమి ముచ్చట్లు కూడా
నిర్వహించడం సంతోషకరం. ఇతర భాషల్లో వచ్చినట్టుగా... తెలుగులో
వైవిధ్యభరితమైన పిల్లల పుస్తకాలు రావడంలేదు. ఇలాంటి స్థితి నుంచి బయటికి
రావడానికి బాల చెలిమి కృషి చేస్తుందని భావిస్తున్నా...
బాల చెలిమి పత్రిక ఈ జనరేషన్ వారి కోసం మళ్లీ తీసుకునిరావడంపై...
బాలల పుస్తకాల రచయిత వి.ఆర్. శర్మ సంతోషం తెలిపారు. బాల చెలిమి పత్రికలో
తమ రచనలు, సలహాలు, పఠనం ద్వారా అందరూ పిల్లలు, పెద్దలు పాల్గొనాలని ఆయన
సూచించారు.
వి.ఆర్. శర్మ,, పిల్లల పుస్తకాల రచయిత
అంతర్జాతీయ పిల్లల పుస్తక దినోత్సవం సందర్భంగా... బాల చెలిమి పుస్తకం
మళ్లీ రాబోతుండటం సంతోషంగా ఉంది. బాల చెలిమి పిల్లల వికాసానికి ఉపయోగపడే
పత్రిక. పెద్దవాళ్లతోపాటు పిల్లలు రాసే కథలు కూడా పుస్తకంలో ఉంటాయి.
పిల్లలు స్నేహం చేసుకోవడానికి వీలుగా.. పిల్లల చెలిమికి సంబంధించిన
శీర్షికలుంటాయి. లేఖలు, గేయాలతో వారిలో అవగాహన, జ్ఞానాన్ని పెంచే
శీర్షిలుంటాయి. బాల చెలిమిని మరింత మెరుగుపరచడానికి లేఖలు కూడా పిల్లలు
రాయొచ్చు. పూర్తిగా తెలంగాణలో నిర్వహిస్తున్న పత్రికల్లో మొలక, బాలచెలిమి
ఉన్నాయి. పిల్లలు తమ అభిప్రాయాలు తెలుపుకోవడానికి 'బాల చెలిమి ముచ్చట్లు'
సరైన వేదిక. సరదగా ఉండే ముచ్చట్లతోపాటు మన వికాసానికి పనికొచ్చే ముచ్చట్లు
పెట్టుకోవచ్చు. సాహిత్య విషయాలు, జ్ఞానం, పుస్తకానికి సంబంధించిన విషయాలు
ఇక్కడ కార్యక్రమం జరుగుతుంది. పిల్లలకు ఏమీ తెలియదు అనే భావన నుంచి అందరూ
బయటికి రావాలి.. ..వాళ్లు అద్భుతాలు చేస్తున్నారు...
దేశం సాంకేతిక రంగం ఎంతగా అభివృద్ధి చెందుతున్నప్పటికీ... పుస్తకం
పుస్తకమేనని కార్యక్రమంలో పాల్గొన్న బాల సాహితీ రచయితలు, వక్తలు తెలిపారు.
త్వరలో రాబోతున్న బాల చెలిమి పత్రిక కోసం అందరూ ఆసక్తికరంగా వేచి
చూస్తున్నామని అన్నారు.
0 comments:
Post a Comment