భావి సమాజానికి విలువలతో కూడిన పౌరులను అందించాలంటే... అది బాల్యం
నుంచే సాధ్యమవుతుంది. అలాంటి విలువలను బాల్యం నుంచే నేర్పడంలో బాలల
సాహిత్యం ముఖ్యమైనది. ఇదే క్రమంలో... నేటితరం పిల్లలను ఆకట్టుకునేలా కొత్త
ఒరవడిలో 'బాల చెలిమి పత్రిక' త్వరలో వెలువడనుంది. ఈ నేపథ్యంలో... గత నెల
ఏప్రిల్ 2న అంతర్జాతీయ పిల్లల పుస్తక దినోత్సవం రోజున హైదరాబాద్
హిమాయత్నగర్లోని ఆక్స్ఫొర్డ్ గ్రామర్ స్కూల్లో 'చిల్డ్రన్స్
ఎడ్యుకేషన్ అకాడమీ' ఆధ్వర్యంలో 'బాల చెలిమి ముచ్చట్లు' పేరుతో తొలి చర్చా
కార్యక్రమాన్ని నిర్వహించారు. దానికి కొనసాగింపుగా మే 12న.. 'బాలల
సాహిత్యం - రచన - సవాళ్లు' అంశంపై చర్చా కార్యక్రమం జరిగింది. బాల చెలిమి
పత్రి ప్రచురణతోపాటు... ఇలా ప్రతినెల రెండో శనివారం బాలల సాహిత్యంపై ఇలాంటి
కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
'చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ అకాడమీ' చైర్మన్ యం. వేదకుమార్
ఆధ్యక్షతన... మే 12న జరిగిన 'బాలల సాహిత్యం - రచన - సవాళ్లు' కార్యక్రమంలో
ప్రముఖ బాల సాహితీవేత్తలు డా. వి.ఆర్.శర్మ, పైడిమర్రి రామకృష్ణ, దాసరి
వెంకట రమణ, వేదాంతసూరి, డా. కందెపి రాణీ ప్రసాద్, పుట్టగంటి సురేష్, డా.
పత్తిపాక మోహన్, డా. బెల్లంకొండ సంపత్, డా.రఘు, గరిపల్లి అశోక్, అనిల్
బత్తుల, చొక్కపు వెంకట రమణ, డా.సిరి, తిరునగరి, పెండెం జనార్దన్, రాజా
వాదిరెడ్డి మల్లీశ్వరి, జుగాష్ విల్లీ, యాదయ్య తదితరులు పాల్గొన్నారు.
వి.ఆర్.శర్మ, బాల సాహితీ రచయిత
బాలల సాహిత్య రచనలు చేయాలంటే... అసలు ముందుగా బాల్యం గురించి లోతుగా
తెలుసుకోవాలని... దీనిపై అధ్యయనం చేయాలని బాల సాహితీ రచయిత వి.ఆర్.శర్మ
అన్నారు. ఆసిఫాలాంటి ఘటనలు జరిగినపుడు... బాలల రచయితపై ఎలాంటి బాధ్యతలు
ఉన్నాయో ప్రశ్నించుకోవాలో అని శర్మ సూచించారు.
బాల సాహిత్యం - సవాళ్లు ప్రశ్న వేసుకున్నప్పుడు... అసలు ఈ రోజుల్లో
బాల సాహిత్యం లక్ష్యం ఏమిటనే ప్రశ్న తలెత్తుతుంది. వందేళ్ల క్రితం
పాశ్చాత్య రచనల ప్రభావంతో... మనదేశంలో బాల సాహిత్య రచనలు
ప్రారంభించుకున్నప్పుడు ఆనాటి సమాజ అవసరాలు, పరిస్థితుల మేరకు సూత్రీకరణలతో
రచనలు చేశారు. కానీ ప్రస్తుత సమాజం అలా లేదు. అప్పట్లో రచయితలు ఆర్థికంగా,
సమాజంలో ఉన్నతవర్గాల వారు తాము చూసిన, అనుభవించిన బాల్యాన్ని, పాశ్చాత్య
రచనల ప్రభావంతో బాల సాహిత్యాన్ని అందించారు. కానీ నేటి బాల్యం చాలా
మారింది. ఇప్పటికీ అదే పాత్ర సూత్రాలతో బాల సాహిత్యాన్ని రచించడం ఎంతవరకు
సమంజసమైనదనేది మొదటి ప్రశ్న. దీనిపై చర్చ జరగాల్సిన అవసరం ఉందని నా
వ్యక్తిగత అభిప్రాయం. అసలు బాల్యం ఎక్కడ మొదలై ఎక్కడ అంతమువుతుందీ
అనుకుంటే... పాత సూత్రీకరణలన్నీ ప్రస్తుత పరిస్థితులకు వర్తిసాయా.. అనే
చర్చ జరగాలి. పెద్దలకు ఏది మంచిదో... పిల్లలకు అదే మంచిది... పిల్లలకు ఏది
చెడ్డదో.. పెద్దలకు కూడా అదే చెడ్డదే.. ఇలాంటి విషయాలపై విస్రృతంగా
చర్చించాలి. నేటి బాల్యాలు... విద్య, తిండి, యుద్ధాలు, అత్యాచారాలు వంటివి
ప్రభావితమై ఉన్నాయి. నేటి బాలలపై జరుగుతున్న అకృత్యాలపై స్పందించాల్సిన
బాద్యత రచయితలపై ఉందని భావిస్తున్నా. పిల్లలకు కేవలం నీతి కథలేకాకుండా..
ప్రస్తుత సమాజం గురించి కూడా పరిచయం చేయాల్సిన విషయంపై చర్చ జరగాలని
కోరుకుంటున్నా. ఆనాటి రోజుల్లో పూర్ణమ్మ లాంటి కథలు రాసి గురజాడ ఎందరిలో
ఆలోచింపజేశాడు..... మరి ఈ రోజుల్లో బాల రచయితలకు ఎందుకు స్పందన ఉండటంలేదు..
నేటి బాల్యంపై ఉన్న ఒత్తిళ్లపై కూడా రచనలు జరగకపోవడం ఒక సవాలుగా
పరిగణించాలి. మనదేశంలో బాలసాహిత్యం చిన్న చూపు చూడబడుతోంది... కానీ
పాశ్చాత్య దేశాల్లో హ్యారీపోటర్ లాంటి కథలు ... సినిమాలుగా తెరకెక్కి
అందరినీ ఆకర్షించి కోట్లు కొల్లగొడుతున్నాయి. మరి మన దగ్గర మన కథలు...
పిల్లల్ని మరింతగా ఆకట్టుకునేలా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉంది. రచయితలు
కూడా తరుచూ సమావేశమై చర్చిండం ద్వారా జ్ఞానాన్ని పెంచుకోవచ్చు.. పిల్లలకు
బాల సాహిత్యాన్ని మరింత దగ్గర చేసేందుకు బాల చెలిమి తరపున జరిగే జిల్లా
పర్యటనల్లో అందరూ తమవంతుగా తరలిరావాలి. చిత్తశుద్ధితో బాల్యాన్ని
రక్షించుకునేందుకు బాల రచనలు చేద్దాం....
యం.వేదకుమార్, బాల చెలిమి ప్రధాన సంపాదకులు
చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అకాడమీ ద్వారా.. బాల సాహిత్యాన్ని సంబంధించిన
విజ్ఞాన్ని ప్రచురుస్తిన్నామని.. బొమ్మలతో కూడిన వినోద, విజ్ఞాన
పుస్తకాలను విరివిగా అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నామని... అలాగే
దృశ్య, శ్రవణ పద్ధతిలో కూడా బాలల సాహిత్యాన్ని, రచనలను అందుబాటులోకి
తెస్తున్నామని.. చిల్డ్రన్ ఎడ్యుకేషన్ చైర్మన్, బాల చెలిమి ప్రధాన
సంపాదకులు యం. వేదకుమార్ అన్నారు.
ముద్రణ, దృశ్య, శ్రవణ మార్గమాల ద్వారా పిల్లలకు ఎంతమంచి సాహిత్యాన్ని
అందివ్వగలమో.. అంత ప్రయత్నం చేస్తాం. ఈ మధ్యనే ఆక్స్ఫొర్డ్ గ్రామర్
స్కూల్లో రేడియో కార్యక్రమాలను నిర్వహించాం. ఇలాంటి కార్యక్రమాల ద్వారా
బాల సాహిత్యాన్ని పిల్లలకు మరింత దగ్గర చేయొచ్చు. ప్రస్తుత చర్చలో
పాల్గొన్న అనేక మంది రచయితల సహాకారంతో అకాడమీ ద్వారా బాల చెలిమి తెచ్చే
ప్రయత్నం చేస్తున్నాం. బాల చెలిమి కేవలం ఒక పత్రికగానే మిగిలిపోకుండా...
జిల్లాకు ఒక పత్రిక వచ్చి... బాల చెలిమి ఒక వేదికలా మారాలి. ముందుగా
తెలుగువారికి బాల చెలిమిని అందించే ప్రయత్నం జరుగుతోంది. బాల సాహితీ రచనలు
చేసి... సమాజానికి అందుబాటులోకి తేలేకపోతున్నవారికి కూడా... బాల చెలిమి
వేదికగా పనిచేస్తుంది. అలాగే ప్రతినెల రెండో శనివారం సాయంత్రం... బాల
సాహిత్యం గతం, వర్తమానం, భవిష్యత్తుపైనే చర్చలు నిర్వహిస్తాం. అందరినీ
ఒకేసారి కాకుండా... బాల సాహితీ రచనల్లో నిష్ణాతులైన వారిని ప్రతినెల చర్చకు
ఆహ్వానిస్తాం. వారు చర్చల్లో పాల్గొంటారు. ప్రతి నెలలో జరగాల్సిన చర ్చ
అంశంపై ముందుగానే ఒక నిర్ణయానికి వస్తాం. దీంతోపాటు... రాబోయే రోజుల్లో
ప్రతినెలలో ఒక రోజు బాల సాహిత్య పుస్తకాలను తీసుకొని ఒక బస్సులో
జిల్లాల్లో పర్యటిస్తాం. మా వద్ద ఉన్న దృశ్య, శ్రవణ కథలను ప్రొజెక్టర్ల
ద్వారా పిల్లలకు చూపిస్తాం. అక్కడి బాల సాహితీ రచయితలకు తమ ఆలోచనలు
పంచుకోవడానికి ఒక వేదిక కల్పిస్తాం. వారి రచనలు ముద్రించుకోవానికి ముద్రణా
సంస్థల ద్వారా సహకారం అందిస్తాం. వీటితోపాటు... ప్రతినెలలో ఒకరోజు ప్రభుత్వ
పాఠశాలలకు వెళ్లి... రచయితల సహకారంతో పిల్లలకు కథలు చెప్పడం... రంగస్థలం
గురించి చెప్పడం... పిల్లల సినిమాలు చూపించడం... గేయాలు పాడించడం.. వారిలో
సృజనాత్మకత వెలికితీసేలా రచనలు చేయించడం వంటివి నిర్వహించబోతున్నాం... బాల
చెలిమి ముచ్చట్లకు... నగరంలో జరిగే కార్యక్రమాలకు... జిల్లాల్లో పర్యటనలను
ఎవరెవరు నిర్వహించాలో ఓ కమిటీ ఏర్పాటు చేసి వాటి కార్యక్రమాలు చేపడదాం...
చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అకాడమీ, బాల చెలిమి ప్రయత్నాలతోపాటు.... అసరమైతే
ప్రభుత్వానికి కూడా సూచనలు చేసి సహాయం తీసుకుంటాం...
డా. ఎస్.రఘు, బాలసాహితీవేత్త
బాల చెలిమి అనేది ... రేపటి తరం వారికి మానవీయ విలువలకు చెలిమిలా
నిలబడాలని కోరుకుంటున్నాం. నిశ్శబ్దంగా... వేదకుమార్ గారు... బాల చెలిమి
ఉద్యమాన్ని నిర్వహిస్తున్నారు. ఆ ప్రయత్నంలో మేమంతా తప్పకుండా
భాగస్వామ్యవులవుతున్నాం.. బాల సాహిత్య- రచనలు- సవాళ్లు అనే విషయంలో... ఇంకా
అనేక పాత కథా వస్తువులనే తీసుకుంటున్నాం... అదే రాజులు, అడవి, పల్లెలు
అంశాలతో పాత పద్ధతుల్లోనే కొత్త కథలు చెబుతున్నారు. అలాకాకుండా...
ప్రస్తుతం పిల్లల చుట్టూ ప్రపంచం మారుతోంది. సమకాలీన అంశాలపై ... వారి
చుట్టూ జరిగే అంశాలు... వారికి పరిచయమైన వాతావరణంలోంచి కథలు వస్తే
బాగుంటుంది. అప్పుడు వారు తొందరగా కథలపట్ల ఆకిర్షతులయ్యే అవకాశం ఉంటుంది.
పిల్లలకు సులభంగా అర్థమయ్యేలా హాస్యాన్ని, వ్యంగాన్ని కూడా చేరిస్తే మరింత
ప్రయోజనకరం. ఇలాంటి కొత్త ప్రక్రియల వల్ల పిల్లలు బాల సాహిత్యం పట్ల
ఆకర్షితులవుతారు.
బెల్లంకొండ సంపత్కుమార్, బాల సాహితీ వేత్త
బాల సాహిత్యం లేకుండా పెద్దల సాహిత్యమనేది ... పునాది లేకుండా ఇల్లు
కట్టడం వంటిదేనని... ప్రముఖ బాల సాహితీ వేత్త బెల్లంకొండ సంపత్కుమార్...
బాల చెలిమి ముచ్చట్ల సందర్భంగా అన్నారు...
బాల సాహిత్య రచనలు చేసేటపుడు... అసలు బాలలు అంటే ఎవరూ అనేది స్పష్టత
ఉండాలి. వారికి చేసే రచనలు వారిని ఏ దిశకు తీసుకెళతాయిన్నది ముఖ్యం. బాల
సాహిత్య రచనల్లో ఇలాంటి సవాళ్లు ప్రాథమికస్థాయిలోనే ఉంటాయి. పిల్లల
ఆలోచనలు... నర్సరీ క్లాసుల్లో ఒక మాదిరిగా.. .. 5వ తరగతి వరకు మరో రకంగా...
ఆ పైన ఇంకో రకంగా ఉంటాయి. ఇక ఇంటర్ చదివే విద్యార్థులు అటు చిన్నవారు
కాదూ... అటు పెద్దవారు కాదు. పదో తరగతిలోపు పిల్లలను విలువలు
నేర్పించగలిగితే ఆ తర్వాత వారి భవిష్యత్తు బాగుంటుంది. ఇంటర్మీడియెట్
చదివే వారికి కూడా బాలసాహిత్యం ద్వారా విలువల గురించి చెప్పాల్సిన అవసరం
ఉంటుంది. పిల్లల స్థాయిని బట్టి బాల చెలిమి రచనలు అందిస్తే మేలు. పిల్లల
వయసుకు తగ్గట్టుగా రచనలు అందించకపోగా... వారిపై అదనపు భారం మోపితే... వారి
ఆలోచనా విధానం దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. చిన్న పిల్లలకు రైతు పోరాటాలు -
పోలీసుల యాక్షన్ గురించి చెబితే... వారి ఆలోచనలపై దుష్ప్రభావం పడే ప్రమాదం
ఉంది. బాల సాహిత్యం రచన- సవాళ్లలో వీటన్నింటిని పరిగణలోకి తీసుకోవాలి.
నేటి తరం పిల్లలపై సెల్ఫోన్లు, టీవీల ప్రభావం తీవ్రంగా ఉంటోంది. వాటి
మోజులో పడి పిల్లలు ఎదురుతిరిగే స్వభావాన్ని అలవరచుకుంటున్నారు. వారు బాహ్య
ప్రపంచానికి దూరమవుతున్నారు. పిల్లలపై తల్లిదండ్రుల అతి ప్రేమవల్లే అనేక
అనర్థాలు జరుగుతున్నాయి. అతి సున్నితమైన విషయాలను పిల్లలతో చాలా జాగ్రత్తగా
వ్యవహరించాల్సి ఉంటుంది. సమాజంలో ఇలాంటివన్నీ బాల సాహిత్య రచనల్లో
సవాళ్లుగానే భావించాలి. పిల్లల్లో వ్యక్తిత్వ నిర్మాణంలో కీలకమైన
పరిస్థితిని కల్పించాలి. అలాంటి రచనలు చేయడం వల్ల ఓ లక్ష్యం కోసం పనిచేసిన
వాళ్లమవుతాం. అలాంటి కీలకమైన బాధ్యత బాల చెలిమి తీసుకుంటే మంచిది. ఇలాంటి
గురుతరమైన బాధ్యత బాల చెలిమిపై ఉందని భావిస్తున్నా. నేటి తరం పిల్లల్లో
శ్రమను గౌరవించే తత్వం పోతోంది. వారికి శ్రమ విలువ తెలియడంలేదు. బాల సాహితీ
రచయితలు ఈ విషయాలు కూడా దృష్టిలో పెట్టుకోవాలి. పిల్లల పట్ల ఎలా
ప్రవర్తించాలో తెలిపేందుకు... పెద్దలకు కూడా ఓ వర్క్షాప్ అవసరమే. అదే
సమయంలో విలువలను నేర్పడంలో వారికి కూడా వర్క్షాప్ లాంటివి నిర్వహించాలి.
పిల్లల్లో సృజనాత్మకత పెంపునకు కొన్ని పత్రికలు ప్రయత్నం ప్రారంభించి... ఓ
దశ తర్వాత వదిలేశాయి... వాటిని మరింత మెరుగుపరచి వారి ఆలోచనల్ని మరింత
పదును పెంచాలి. అలాంటి ప్రయత్నాలతో బాలచెలిమి మరింతగా పిల్లలను
ఆకట్టుకోగలుగుతుంది. బాల సాహిత్య రచనల పట్ల అమితాసక్తి ఉన్నవారు
బాలచెలిమికి పనిచేయడం సంతోషంగా ఉంది.
రాజా వాసిరెడ్డి మల్లీశ్వరి, బాల సాహితీవేత్త, తెలుగు ఉపాధ్యాయురాలు
32 ఏళ్లపాటు తెలుగు ఉపాధ్యాయురాలిగా పనిచేస్తూ... రాబోయే తరం
పిల్లల్లో ఏం తక్కువుందనేది గమనిస్తూ వచ్చాను. ఆ తర్వాతే బాల సాహిత్యం
మొదలుపెట్టాను. కథలు, గేయాలు, కవితలు ఏం చదవాలన్నా ముందు భాష తెలియాలి.
చిన్నపుడు మనకు ఇళ్లలో పద్యాలు, పొడుపుకథలు, సామెతలు చెప్పేవారు. అవే కథలు
తరగతిగదిలో అర్థాలు తెలుసుకుని ఆనందించేవాళ్లం. ప్రస్తుతం ఆ పరిస్థితి
లేదు. సిలబస్ పూర్తిచేయడానికి టీచర్లకు సమయం సరిపోవడంలేదు. ఈ రోజుల్లో
పిల్లలకు భాష తెలియడంలేదు. అలాంటపుడు... వారు కథలు, గేయాలు ఎలా
తెలుసుకోగలరు. వారికోసం రాసిన సాహిత్యాన్ని ఆనందించలేరు. తెలుగు భాష అంటే
ఆసక్తి పెరగడానికి కారణం వెతకాలి. చిన్న చిన్న వాక్యాల్లో తెలుగు నేర్పించి
భాషపై ఆసక్తిని పెంచాలి. అప్పుడు మాత్రమే వారు కథలు, గేయాలు చదివినా
ఆనందిస్తారు. బాల సాహిత్యంలో గేయాల రూపంలో నేను రచనలు చేశాను. పాశ్చాత్య
రైమ్స్ వారి దేశాల పరిస్థితులకు అనుగుణంగా రాసుకున్నవే.
దురదృష్టవశాత్తూ... మన దేశ పరిస్థితులకు తగ్గ చిన్నచిన్న రైమ్స్ ఇప్పటికీ
రావడంలేదు. పిల్లలస్థాయిని బట్టి రచనల్లో పదజాలం ఉండేలా రచయితలు
దృష్టిలోపెట్టుకోవాలి. నేటి పత్రికల్లోనూ... బాలల కోసం మొక్కుబడిగా కథలు,
గేయాలు వేస్తున్నారే తప్ప... వారి భాష పరిజ్ఞాన్ని పెంచే ప్రయత్నం
కనబడటంలేదు. భాషలేనపుడు సాహిత్యమేరాదు... ఒక రచయిత అయినా...ఉపాధ్యాయుడైన
వినూత్నంగా ఆలోచించి దాన్ని పిల్లల్లోకి తీసుకెళ్లగలగాలి. బాలల కోసం ఎన్ని
రచనలు చేసినా... వారి వద్దకు తీసుకెళ్లగలగడం చాలా కష్టమైన పని... అలాంటి
కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న వేదకుమార్ గారికి అభినందనలు. చిట్టి
చిలకమ్మా... అమ్మ కుట్టిందా అని కాకుండా... నేటి పరిస్థితులకు అనుగుణంగా
మార్పు రావాలి.
పత్తిపాక మోహన్, బాలసాహితీ రచయిత
బాల చెలిమి పుస్తకాన్ని పిల్లల మసుకు హత్తుకునేలా... బొమ్మలు, ముద్రణ,
అక్షరాల సైజు వంటి విషయాల్లోనూ వేదకుమార్ గారు జాగ్రత్తలు
తీసుకుంటున్నారు. దీంతోపాటు ప్రతి జిల్లాలోనూ ఒక బాల చెలిమి లాంటి పత్రిక
రావాలని కోరుకుంటున్నాం. దేశవ్యాప్తంగా చూసుకుంటే మన తెలుగులో బాల పత్రికలు
చాలా తక్కువగా ఉన్నాయి. బాల సాహితీ రచయితలకు సమాజంలో రెండో కేటగిరి
రచయితలుగా భావిస్తున్నారు. దీంతో ఎంతో ఉత్సాహం ఉన్న రచయితలు కూడా బాల
సాహిత్యానికి దూరమవుతున్నారు. అయితే ప్రస్తుతం పరిస్థితుల్లో కొంత మార్పు
వస్తోంది. కొన్ని పత్రికలు పిల్లల కోసం కొంత స్థలాన్ని కేటాయించడం
శుభపరిణామం...
మనుషులకు విలువలు నేర్పేదే బాల సాహిత్యం... అలాంటి బాల సాహిత్యాన్ని
బ్రతికించుకోవాలి... అప్పుడు మాత్రమే ప్రపంచాన్ని బ్రతికించుకోవచ్చని
ప్రముఖ బాల సాహితీవేత్త దాసరి వెంకట రమణ అన్నారు. ప్రపంచం మీద ప్రేమ
ఉంటేనే... బాల సాహిత్యం సాధ్యమవుతుందన్నారు.
దాసరి వెంకట రమణ, బాల సాహిత్య రచయిత
బాల సాహిత్యాన్ని రాయడంలో... ప్రచురించడంలో... ప్రచారంలోకి తేవడంలో
అనేక ఇబ్బందులుంటాయి. పిల్లల్ని తన్మయ పరిచేలా... పెద్దల్ని అబ్బురపరిచేలా
బాల సాహిత్య రచనలు రావాల్సిన అవసరం ఉంది. మనుషుల్ని బ్రతికించుకోవాల్సిన
అవసరంఉంది. అది జరగాలంటే నేటి పిల్లలకు బాల సాహిత్యాన్ని నూరిపోయాలి. నైతిక
విలువలు లేకపోవడం వల్లే పిల్లల్లో నేరప్రవృత్తి పెరుగుతోంది. సంస్కారం,
విలువలు, మానవత్వం అడుగంటి పోతున్నాయి. తల్లిదండ్రి అంటే గౌరవం లేకుండా
పోతోంది. దానికి కారణం మనమే. వాళ్లని కేవలం బడికి వెళ్లివచ్చే యంత్రాల్లా
తయారు చేస్తున్నాం. వారికి ఎలాంటి కథలు చెప్పడంలేదు.. వారికి విలువలు,
గౌరవం నేర్పడంలేదు.
తల్లిదండ్రి మీద దయలేని పుత్రుండు వాటి పుట్టనేమి గిట్టనేమి
పుట్టలోని చెదలు పుట్టదా గిట్టదా... విశ్వదాభిరామ వినురవేమా....
ఇలాంటి పద్యంలోని జీవనసారాన్ని పిల్లలకు నేర్పిస్తే... వారికివచ్చే
బుద్ధులకు సరితూగేలా... వేమన పద్యం లాంటి పద్యం ప్రపంచ సాహిత్యంలో లేదు. మన
పిల్లలకు రోజుకు ఒక పద్యం నేర్పిద్దాం... ఇదే బాల సాహిత్యం యొక్క
ఔన్నత్యం. కొన్ని తరాలకు సంస్కారం నేర్పిన చందమామ పత్రిక కూడా 2013లో
ఆగిపోయింది. ఎందుకు ఆగిపోయిందో ఓ పెద్ద సవాల్. ఇలాంటి పరిస్థితుల్లో...
బాల చెలిమి మళ్లీ వస్తోందని ... దక్కన్ ల్యాండ్ పత్రికలో చదివినపుడు...
వర్ణనాతీతమైన ఆనందానికి గురయ్యాను. బాల సాహిత్యాన్ని ప్రేమించేవాడిని...
ప్రచురించేవారిని... ప్రచారం చేసే వారు ఎవరున్నా శిరస్సు వంచి
నమస్కరిస్తా.. ఈ విషయంలో వేదకుమార్ గారు అభినందనీయులు.. బాల చెలిమి పత్రిక
మళ్లీ వస్తది... నిలదొక్కుకుంటది... మన్నుతది... మనుషులకు మానవత్వాన్ని
నేర్పుతది.. ప్రపంచానికి మన సాహిత్య సౌష్టవాన్ని చాటుతది...
గరిపల్లి అశోక్, పిల్లల రచయిత, విశ్రాంత ఉపాధ్యాయులు
బాలల పత్రికలు ఎన్నివచ్చినా... తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల్లో ప్రేరణ
కల్పించగలగాలి. అప్పుడు ఆ పత్రికలు తప్పకుండా విజయం సాధిస్తాయి. పిల్లల్లో
ముందుగా పఠనాసక్తిని పెంచాలి. అప్పుడు తప్పకుండా మార్పు వస్తుంది. ఆ
సిద్ధాంతాన్ని నేను నమ్ముతున్నాను. చందమామ వంటి పత్రికలను పిల్లల కంటే
పెద్దవాళ్లే ఎక్కువగా చదివారు. ఆ కథలతో ఎంతో స్ఫూర్తి పొందాం. ఏ పత్రిక
వచ్చినా... పిల్లలతోపాటు ఆబాలగోపాలన్నీ అలరించే విధంగా ఉన్నపుడు...
తప్పకుండా విజయం సాధిస్తుంది.
యాదయ్య, బాల సాహితీ రచయిత
పిల్లల్లో విలువలు ఇంటి నుంచే మొదలవుతాయి. ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య
బంధాలే విలువలకు పునాది. పెద్దల సాహిత్యంకంటే.. బాల సాహిత్యం చాలా
నిజాయితీగా ఉండాల్సిన అవసరం ఉంది. పిల్లల దగ్గర అనేక గొప్ప విషయాలు
తెలుస్తాయి. దానికోసం వారిని పరిశీలిస్తుండాలి. వారి మాటల్లోంచే కవితలు,
కథలు స్ఫురిస్తాయి. బాల సాహిత్యాన్ని మరింత3 ముందుకు తీసుకెళ్లేందుకు బాల
చెలిమి చేస్తున్న కృషిని అభినందిస్తున్నా.
బాలల సాహిత్యానికి ఆదరణ పెరుగుతుండటం శుభపరిణామమని... 'బాల సాహిత్య
రచన- సవాళ్లు' చార్చా కార్యక్రమంలో పాల్గొన్న వక్తలు పేర్కొన్నారు. నేటితరం
పిల్లలకోసం రచయితలను ఒకచోట చేర్చి... ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్న
'చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ అకాడమీ' చేస్తున్న కృషిని రచయితలు
అభినందించారు.
0 comments:
Post a Comment