Flash News
Powered by Blogger.

Popular Posts

Blog Archive

Popular Posts

Bala Chelimi

Editor:
Manikonda Veda Kumar

Executive Editor:

Gali Udaya Kumar
---- ----
Bala Chelimi
Chandram, 490, Street No.11,
Himayat Nagar, Hyderabad 500 029
www.balachelimi.com

Mail Instagram Pinterest RSS

పందుల దొడ్డి


అది ఒక అడవి. దట్టంగా ఉంది.
ఎటు చూసినా క్రూరమృగాలు.
మధ్యలో వంద ఎకరాల చదునైన భూమి.
ఆ భూమి వరాహరాజు ఆధీనంలోకి వచ్చింది.
ఆయన నివాసం అక్కడే! మధ్యలో ఒక చక్కటి ఇల్లు కట్టుకొన్నాడు. తన భూమికి చుట్టూ కంచె వేయించాడు.

వరహరాజు దగ్గర వెయ్యి పందులు ఉన్నాయి. అతని ఇల్లు కట్టిందీ. చుట్టూ కంచె వేసింది ఆ పందులే! వరాహరాజుకు గాని అతడి కుటుంబ సభ్యులకు గానీ అన్ని పనులు చేసి పెట్టేది పందులే!
పందులు పొలం దున్నుతాయి. పంటలు పండిస్తాయి. పండించిన ధాన్యాన్ని వరాహ రాజు ధాన్యాగారం లోకి చేరుస్తాయి.
పందుల బాగోగులు వరాహరాజే చూస్తాడు. వాటికి కావలసిన తవుడు, పొట్టు, గంజినీళ్ళు, ముగ్గిపోయిన ధాన్యం అందేలా చూస్తాడు. వరాహరాజు అభిమానానికి నోచుకొన్న కొన్ని పందులకు అప్పుడప్పుడూ వరి అన్నం కూడా దొరుకుతుంది.
పందులలో కూడా రకరకాల తేడాలు ఉన్నాయి. కొన్ని కష్టపడి పనిచేస్తే, మరికొన్ని సోమరిగా తిరుగుతాయి. బక్కచిక్కిన వాటి మీద అధికారం చెలాయిస్తాయి. వాటిల్లో  తేడాలు ఎలా ఉన్న వరాహరాజు విషయానికి వస్తే అన్నీ బానిసలే!
ఏ చీకూ చింతా లేని వరాహరాజుకు రోజులు సుఖంగా గడిచిపోతున్నాయి.
ఒక రాత్రి ఒక తెలివైన పందికి నిద్ర పట్టలేదు.
మిగిలిన అన్ని పందులనూ అది నిద్ర లేపింది.
సభ చేసింది.
''మన పంది బతుకులు చాలా హీనంగా ఉన్నాయి. మన యజమాని చాలా సుఖంగా ఉన్నాడు. ఫలితం దక్కాలి. ఇందుకు మీరేమంటారు?'' అని అడిగింది.
తెలివైన పంది మాటలకు మిగిలినవన్నీ ఒప్పు కొన్నాయి. ''నిజమే! మనకు చాలా అన్యాయం జరుగుతోంది. ఏం చెయ్యమంటావో నువ్వే చెప్పు'' అన్నాయి.
''మనం వరాహరాజును, అతని కుటుంబంలోని అందరినీ చంపేద్దాం. అటు తరువాత మన మీద అధికారం చలాయించేవాళ్ళు ఎవరూ ఉండరు. అందరం కలిసి కష్టపడి పనిచేద్దాం. ఫలితం సమానంగా అనుభవిద్దాం'' అంది.
ఈ సలహా అన్ని పందులకూ నచ్చింది.
అన్నీ మూకుమ్మడిగా పైకి లేచాయి. అప్పటికప్పుడే వరాహరాజు  ఇంటిమీద దాడి చేశాయి.
వెయ్యి పందులు ఒక్కమారుగా మీద పడడంతో వరాహరాజు ఏమీ చెయ్యలేక పోయాడు. పందులు అతన్ని చీల్చి చెండాడాయి. అతని భార్య పిల్లలు కూడా పందుల దాడిలో చనిపోయారు.
పందులు స్వతంత్రం ప్రకటించుకొన్నాయి.వాటి ఆనందానికి అంతులేదు. వరుసగా వారం రోజుల పాటు విచ్చలవిడిగా గంతులు వేశాయి. ఆనందంతో  పందులు పనుల గురించి పట్టించుకోలేదు. నీళ్ళు కట్టకపోవడం వల్ల వరిమడి ఎండిపోయింది. చెరకుతోట బెండు తేలిపోయింది. కూరగాయలు వాడి రాలిపోయాయి.
ఏ పందికి ఆ పంది నేనే ఎందుకు పనిచేయాలి అని చాటుకు తప్పుకోసాగింది.
తెలివైన పంది పరిస్థితి గమనించి మళ్ళీ పందుల సభ  జరిపింది. ''మనకు నాయకుడు లేకపోవడం వల్ల ఎవరూ బాధ్యతగా పనిచేయడం లేదు. కాబట్టి మనలో ఒకరిని నాయకుడిగా ఎన్నుకొందాం'' అంది.
మిగిలిన అన్ని పందులూ అందుకు ఒప్పుకొని ''నువ్వే మా నాయకుడివి'' అన్నాయి.
తెలివైన పంది నాయకుడు అయిన తరువాత పరిస్థితి మారిపోయింది.
అన్నీ కష్టపడి పని చేయసాగాయి.
నాయక పంది అటూ ఇటూ తిరిగి అజమాయిషీ చేయసాగింది.
నెలరోజుల్లో  నాయక పంది వరాహరాజు మునుపు ఉన్న ఇంట్లోకి వెళ్ళింది.
ఆ పంది పిల్లలు, భార్య, బంధువులు అన్నీ అధికార హోదా సంపాదించుకున్నాయి.
మరికొన్ని రోజులకు పరిస్థితి మునుపటిలా తయారయింది. వరాహరాజు  కాలంలో ఎలా ఉండేదో అలాగే మారిపోయింది.
అర్ధరాత్రి పూట పందులు మళ్ళీ సభ చేశాయి. పంది నాయకుణ్ణి చంపెయ్యాలని తీర్మానించాయి.
ఒక పిల్ల పంది పైకిలేచి ''ఈ రోజు నాయకుణ్ణి చంపేస్తాం. రేపు ఇంకొకరు వస్తారు. అతనూ ఇలాగే తయారవుతాడు. మనం ఎంతకాలం ఇదే పద్ధతి కొనసాగించాలి?'' అంది.
పందులు అన్నీ ఆలోచనలో పడ్డాయి.