16వ 'బాలచెలిమి ముచ్చట్ల'లో మల్లేశం సినిమా ముచ్చట్లు
మల్లేశం సినిమాను కమర్షియల్ సినిమాగా చూడలేదని, సమాజానికి ఒక సందేశం ఇవ్వాలని తీయడం జరిగిందని మల్లేశం సినిమా దర్శకులు రాజ్ రాచకొండ అన్నారు. బాలసాహిత్యం - నా అనుభవాలు - సూచనలు అనే అంశంపై బాలచెలిమి పిల్లల వికాస పత్రిక, చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో శనివారం ఆక్స్ఫర్డ్ గ్రామర్ స్కూల్లో 'బాలచెలిమి ముచ్చట్లు' 16వ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మల్లేశం చిత్రబృందం పాల్గొని తమ అనుభవాలను పంచుకున్నారు. దర్శకులు రాజ్ రాచకొండ మాట్లాడుతూ... నేను మొదటి సినిమా తమిళ్ డబ్బింగ్ తీసి సక్సెస్ కాలేక పోవడంతో అమెరికా వెళ్లి స్థిరపడ్డానన్నారు. రెండు సంవత్సరాలు తరువాత చింతికింది మల్లేశం పద్మశ్రీ అవార్డు అందుకున్న తరువాత ఆయన గురించి తెలుసుకుని భారతదేశానికి వచ్చి మల్లేశం కథ రాయడం జరిగిందని తెలిపారు.
చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ అకాడమీ ఛైర్మన్ మణికొండ వేదకుమార్ మాట్లాడుతూ.. ప్రతి మాసం బాలల సాహిత్యంపై బాలల రచయితలతో ముచ్చట్లు నిర్వహించేవారం. కానీ ఈ మాసం 16వ ముచ్చట్లలో మల్లేశం చిత్రంలో కూడా బాలల గురించి ఉందని కాబట్టి ఈ చిత్ర బృందంతో ముచ్చట్లు నిర్వహించడం జరిగిందని తెలిపారు. దర్శకులు పేరు రాజ్ కుమార్ ఆర్ అని సినిమాలో ఉన్న పేరును ఈ వేదిక నుంచి ఇంటి పేరుతో సహా రాజ్ రాచకొండ అని మార్చుకుంటున్నారని వేదకుమార్ అన్నారు.
మల్లేశం చిత్రానికి మాటలు అందించిన ప్రముఖ సినీ రచయిత పెద్దింటి అశోక్ మాట్లాడుతూ.. చదువంటే సాహిత్యంతో అనుబంధం కల్గి ఉండాలి. సాహిత్యం జ్ఞానాన్ని పెంచుతుందని తెలిపారు. నేటి తల్లిదండ్రులు పిల్లలకు పెద్దలు పడుతున్న కష్టాలను తెలియపర్చాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కోడి తన పిల్లలకు 57 రోజుల్లో ఎలా బ్రతుకుతుందో నేర్పుతుంది. కానీ తల్లి దండ్రులు 30 సంవత్సరాలు పిల్లలను పెంచినా కూడా వారిని మనుషుల్లాగా తయారు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రముఖ ఆర్టిస్ట్ ఏలె లక్ష్మణ్ మాట్లాడుతూ... దర్శకులు రాజ్ వచ్చి సినిమా కథ చెప్పినప్పుడు మల్లేశం సినిమా నా నిజ జీవితానికి దగ్గరగా ఉండటం వల్లే నేను పని చేయడం జరిగింది. కమర్షియల్ సినిమాగా కాకుండా చక్కటి తెలంగాణ నేపథ్యం గల సందేశాన్ని ఇవ్వడానికి గ్రామీణ ప్రాంతంలో చిత్రీకరించడం జరిగింది. యూనిట్ సభ్యులందరం తారతమ్య బేధాలు లేకుండా కుటుంబంలాగా కలిసి పని చేశాం. ప్రముఖ ఫిల్మ్ మేకర్, ఫోటో గ్రాఫర్ బి. అజిత్ నాగ్ మాట్లాడుతూ మా తండ్రి బి. నర్సింగ్రావు తీసిన సినిమాలు ఇలా థియేటర్లలో ఆడాలని తపన పడ్డారు. ఇప్పుడు రాజ్ తీసిన మల్లేశం సినిమా ఆయన ఆశయానికి అనుగుణంగా ఉండడం సంతోషించారని తెలిపారు. పద్మశ్రీ అవార్డు గ్రహీత చింతకింది మల్లేశం మాట్లాడుతూ.. దర్శకులు రాజ్ మాట్లాడినప్పుడు ఇప్పుడు అన్ని బయోఫిక్లు రాజకీయంమీద కమర్షియల్గా వస్తున్నాయి. నా మీద సినిమా తీస్తే మీకు డబ్బులు రావని తెలిపారు. కానీ వారు మాకు డబ్బులతో పని కాదు 6వ తరగతి వరకు మాత్రమే చదివిన ఒక సామాన్యుడు కూడా ఆసు యంత్రాన్ని కనిపెట్టడం లాంటి సందేశాన్ని సమాజానికి అందివాలన్నారని చెప్పారు.
ఈ కార్యక్రమంలో టీఆర్సీ పబ్లికేషన్లో వెలువడిన పుస్తకాలను అతిథులకు అందించడం జరిగింది. నటులు చక్రపాణి, దాసి సుదర్శన్, ఓయు తెలుగుశాఖ అధ్యక్షురాలు ప్రొఫెసర్ సూర్య ధనంజయ్, ప్రొఫెసర్ యాదగిరి, డాక్టర్ ఎస్. రఘు, పత్తిపాక మోహన్, పద్మిని, వీసీ ముత్యంరెడ్డి , కె. ప్రభాకర్, కో-ఆర్డినేటర్ తదితరులు పాల్గొన్నారు.
0 comments:
Post a Comment