బాలలు ఉన్నతంగా ఎదిగే స్థితిని కల్పించే రచనలను రచయితలు అందించాలని కేంద్ర సాహిత్య అకాడమి అవార్డు గ్రహీత, ప్రముఖ రచయిత డాక్టర్ ఎం భూపాల్రెడ్డి అన్నారు. బాలసాహిత్యం - నా అనుభవాలు - సూచనలు అనే అంశంపై బాలచెలిమి పిల్లల వికాస పత్రిక, చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో శనివారం ఆక్స్ఫర్డ్ గ్రామర్ స్కూల్లో నిర్వహించిన 'బాలచెలిమి ముచ్చట్లు' 8వ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. బాలల భావాలను గ్రహించి వారి మనస్తత్వాన్ని గమనించి నడవడికను తీర్చిదిద్దేలాగా రచనలు ఉంటే బాగుంటుందని చెప్పారు. ఆడుతూ పాడుతూ కథల్లా సాగిపోయే ఆనందమయమైన రచనాశైలిని రచయితలు అవలంబిస్తే బాలలకు ఎంతో ఇష్టంగా సాహిత్యం చేరువవుతుందని అన్నారు. పాటలు, పొడుపు కథలు, సామెతలు వంటి అంశాలలో ఆసక్తికరంగా రచనలను మలచాలని చెప్పారు. తల్లిదండ్రులు, కుటుంబ పెద్దలు చెప్పే కథల్ని కూడా రచయితలు సేకరించి తమదైన బాణీలో అందించగలిగితే ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని సూచించారు.
ప్రముఖ రచయిత, చరిత్ర పరిశోధకులు డాక్టర్ కావూరి శ్రీనివాస్ మాట్లాడుతూ తల్లిదండ్రులు ఎదుగుతున్న పిల్లలను స్నేహితులుగా భావించాలని అన్నారు. ఆప్యాయతను అందించగల్గిన వాతావరణాన్ని సాహిత్యంలో రచయితలు ప్రతిబింబింపజేయాలని చెప్పారు. ఊహా శక్తిని పెంపొందించే విధంగా రచయితల కథా సృష్టి బాలల కోసం ఉండాలని అన్నారు. ప్రముఖ బాలల రచయిత బమ్మిడి జగదీశ్వర్రావు మాట్లాడుతూ బాలలు సహజంగా ఎదిగే రీతిలో స్వచ్ఛతను పెంపొందింపజేసే కథాంశాలను ఎన్నుకొని రచనలు చేయాలని చెప్పారు. సామాజికవేత్త గరిపల్లి అశోక్ మాట్లాడుతూ అంతరించిపోకుండా కథల్ని పిల్లలకు పెద్దలు వారసత్వ సంపదగా అందించాలని అన్నారు.
పాత్రికేయురాలు ఉషా తురగా రేవల్లి మాట్లాడుతూ పాఠం విన్నంత సులభంగా బాలలకోసం రచనలను చేయడానికి రచయితలు సిద్ధపడాలని చెప్పారు. మలుపులు తిరిగే రీతుల్లో కథల్ని అందించినప్పటికీ బాలల కోసం స్పష్టత ఎంతో ముఖ్యమని ఆమె అభిప్రాయపడ్డారు.
కార్యక్రమానికి అధ్యక్షత వహించిన చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ సొసైటీ చైర్మన్ వేదకుమార్ మణికొండ మాట్లాడుతూ బాల సాహిత్య రంగంలో నిష్ణాతులైన ప్రముఖులను ఆహ్వానించి ప్రతి నెలా ఉపయోగకరమైన అంశంపై నిర్వహిస్తున్న సదస్సులో అనేక ప్రయోజనాత్మకమైన అంశాలు వెలువడుతున్నాయని తెలిపారు. బాల చెలిమి ముచ్చట్లు కార్యక్రమాన్ని ప్రింట్, ఎలక్ట్రానిక్ రూపాలలో సొసైటీ ద్వారా అందించేందుకు సంసిద్ధమయ్యామని అన్నారు. బాలల సంపూర్ణ వికాసమే లక్ష్యంగా బాలచెలిమి కార్యక్రమాలు కొనసాగుతాయని తెలిపారు.
0 comments:
Post a Comment