Flash News
Powered by Blogger.

Popular Posts

Blog Archive

Popular Posts

Bala Chelimi

Editor:
Manikonda Veda Kumar

Executive Editor:

Gali Udaya Kumar
---- ----
Bala Chelimi
Chandram, 490, Street No.11,
Himayat Nagar, Hyderabad 500 029
www.balachelimi.com

Mail Instagram Pinterest RSS

మారిన బాల్యాన్ని గమనిస్తూ రచనలు చేయాలి


గతంతో పోలిస్తే నేటి బాల్యం ఎంతగానో మారినందున బాలల రచయితలు అది గమనించి తమ రచనలను కొనసాగించవల్సిన అవసరం ఎంతో ఉందని ప్రముఖ కవి, రచయిత, కాళోజీ స్మారక పురస్కార గ్రహీత డాక్టర్‌ అమ్మంగి వేణుగోపాల్‌ అన్నారు. హిమాయత్‌ నగర్‌లోని ఆక్స్‌ఫర్డ్‌ గ్రామర్‌ స్కూల్‌లో శనివారం సాయంత్రం 'నేను - నా రచనా నేపథ్యం' అంశంగా జరిగిన 'బాల చెలిమి ముచ్చట్లు' కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. పిల్లలను కాపాడుకుని చైతన్యవంతులను చేసే బాలల రచనలు ఇప్పుడు రావల్సి ఉందని చెప్పారు. సరళమైన అంశాలను ఎన్నుకొని బాలల్లో మానసిక పరిణతిని పెంపొందించేదిగా బాల సాహిత్యం ఉండాలని సూచించారు.
ప్రముఖ బాలల రచయిత పి. చంద్రశేఖర్‌ ఆజాద్‌ మాట్లాడుతూ రాయగల్గినంత అవకాశం ఎక్కువ వున్నది బాల సాహిత్యంలోనే అని చెప్పారు. తాను బాలల సంపూర్ణ స్థితిగతులను గమనిస్తూ ఎప్పటికప్పుడు మారుతున్న అంశాలను చేరుస్తూ ఎన్నో కథలు, నవలలను పిల్లలకోసం రాశానని వివరించారు. గతంలో చెప్పినవే చెప్పకుండా నూతనత్వాన్ని జోడిస్తూ కొత్తదనాన్ని పిల్లలు అందుకునేలా చూడాలని అన్నారు.
ప్రముఖ బాలల రచయిత ఐతా చంద్రయ్య మాట్లాడుతూ సరళమైన పదాలను ఎంపిక చేసుకుని సహజ సిద్ధమైన అభిరుచితో పిల్లలు చదువుకునేలా తాను కథలను రాశానని చెప్పారు. బాలల కోసం రాయడంలో ఇతర పక్రియలకన్నా ఎంతో తృప్తి రచయితకు మిగులుతుందని అన్నారు.



చిల్డ్రన్స్‌ ఎడ్యుకేషన్‌ అకాడమి ఛైర్మన్‌ యం. వేదకుమార్‌ మాట్లాడుతూ బాలల వికాసం కోసం రచనల్లో చోటు చేసుకోవల్సిన మార్పులను చర్చించేందుకు నిష్ణాతులైన బాలల రచయితలతో వారి రచనా నేపథ్యాన్ని వివరిస్తూనే సూచనలు అందించేందుకు ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా నిర్వహించినట్లు వివరించారు.
ప్రముఖ రచయిత్రి కన్నెగంటి అనసూయ మాట్లాడుతూ ప్రయోజనాత్మక రచనలు బాలల కోసం విరివిగా రావాలని అందుకు నూతన దృష్టికోణాలను రచయితలు ఎంపిక చేసుకోవాలని అన్నారు. బాలల రచనలు చేసేవారు వారితో కలిసి మాట్లాడితే ఎన్నో అద్భుతమైన అంశాలను గ్రహించవచ్చని సూచించారు. కార్యక్రమానికి ప్రముఖ బాలల రచయిత డా. పత్తిపాక మోహన్‌ స్వాగతం పలికారు. ప్రముఖ రచయిత్రులు డి. సుజాతాదేవి, డా. తిరునగరి దేవకీదేవి, డా. వి.ఆర్‌.శర్మ, రాజా వాసిరెడ్డి మల్లీశ్వరి, ఉండ్రాళ్ల రాజేశం పాల్గొన్నారు. కార్యక్రమానికి సాహితీవేత్తలు మంచి పుస్తకం సురేష్‌, డా. ఎస్‌.రఘు, తిరునగరి శ్రీనివాస్‌, శాంతారావు, డా. బోనాల ప్రకాశ్‌, సయ్యద్‌ షాబీర్‌, బాలరాజ్‌గౌడ్‌, మహమ్మద్‌బేగ్‌, టి.స్వామి, కె. ప్రభాకర్‌, కో-ఆర్డినేటర్‌ తదితరులు పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో బాలసాహిత్యాభిమానులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.




0 comments:

Post a Comment