కత్తులు, బల్లేలు పోయి
బాంబులు తుపాకులు
పదునెక్కిన చాకుల వలె
వున్నవిపుడు ఆకులు!
రాజ్యకాంక్షతోటి జరిపి
క్రూర దండయాత్రలు
రక్తంతో నింపారోయ్
మన చరిత్ర పాత్రలు!
క్లాసు పుస్తకాల్లో కాదు
కళ్ళముందే దారుణం
జరుగుతుంది చూడండోయి
''ఇరాకు''లోయ మరణం!
యుద్ధంలో నశించేది
పేదలు, సామాన్యులు
పదిలంగా వుండగలరు
ధనవంతులు - ధన్యులు!
మానవజాతికి పట్టిన
యుద్దజ్వరం తగ్గి
చల్లారితే మంచిదోయ్
ఈ పెట్రోల్ అగ్గి!
ప్రపంచాన యెక్కడైన
పసిమొగ్గలె పిల్లలు
లోకశాంతి కోరుకోండి
మరచిపోయి ఎల్లలు!
-దేవిప్రియ అంకుల్
(నేటి పరిస్థితికీ అద్దం పడుతున్న ఈ కవిత బాలచెలిమి డిసెంబర్ 1990లో
ప్రచురితమైంది. పత్రిక సంపాదకులు
వేదకుమార్ అభ్యర్థన మేరకు కవి
ప్రపంచశాంతిని వస్తువుగా తీసుకొని ఈ కవిత రాశారు. కవి వాక్కు నేటికీ అక్షర
సత్యం.)
0 comments:
Post a Comment